బాధిత కుటుంబాల ఆందోళన
ప్రజాతంత్ర ఇంటర్నెట్ డెస్క్: ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాల్లో నిరాశ నెలకొంది. డీఎన్ఏ పరీక్షల ప్రక్రియలో ఆలస్యం కావడం, మృతదేహాలను గుర్తించడంలో జాప్యం జరుగుతుండడం బాధిత కుటుంబాలకు మరింత ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా డీఎన్ఏ పరీక్షల ప్రక్రియ నెమ్మదిగా సాగుతుండటం వారిని మానసికంగా కుంగదీస్తోంది. దీనికి ప్రధాన కారణం ప్రమాద సమయంలో ఏర్పడిన అధిక ఉష్ణోగ్రతలేనని వైద్యులు తెలిపారు. గాంధీనగర్లోని ఫోరెన్సిక్ సైన్స్ డైరెక్టర్ హెచ్.పీ. సంగ్వీ తెలిపిన ప్రకారం ప్రమాద సమయంలో విమానంలో 1.25 లక్షల లీటర్ల ఇంధనం ఉండటంతో అగ్నిప్రమాదం తీవ్రత పెరిగిందన్నారు. ఈ కారణంగా మృతదేహాలు పూర్తిగా కాలిపోయాయని, దీని వల్ల డీఎన్ఏ నమూనాలను సేకరించడం సవాలుగా మారిందని తెలిపారు.
ఎయిర్ ఇండియా అదనపు ఆర్థిక సాయం
బాధిత కుటుంబాలకు ఎయిర్ ఇండియా సంస్థ తక్షణ ఆర్థిక సాయం ప్రకటించింది. మధ్యంతర సాయం కింద రూ.25 లక్షలు (21 వేల జీబీపీ) ఇవ్వనున్నట్టు ప్రకటించింది. బాధితులకు గతంలో టాటా సన్స్ ప్రకటించిన రూ.కోటి ఆర్థిక సాయానికి ఇది అదనమని పేర్కొంది. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఎయిర్ ఇండియా పోస్టు పెట్టింది. ఈ కష్ట సమయంలో బాధిత కుటుంబాలకు తాము అన్ని విధాలుగా అండగా ఉంటామని తెలిపింది. బాధిత కుటుంబాలకు సాయం చేసేందుకు క్షేత్రస్థాయిలో తమ బృందాలు కృషి చేస్తున్నాయంది. ఇందులో భాగంగానే మధ్యంతర ఆర్థిక సాయం ప్రకటించినట్టు, ప్రమాద ఘటన తమను ఎంతో కలచివేసిందని పేర్కొంది.



