– దానం నాగేందర్ స్టార్ క్యాంపెయినర్ ఎలా అవుతారు
– ఖైరతాబాద్ బస్తీ దవాఖానను పరిశీలించిన కెటిఆర్
- ప్రభుత్వ వైద్యానికి సుస్తీ పట్టిందని విమర్శ
హైదరాబాద్,ప్రజాతంత్ర,అక్టోబర్ 21: పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నారో చెప్పుకోలేక పోతున్నారని.. వాళ్ళకి సిగ్గనిపించడం లేదా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. స్పీకర్ దగ్గర తాము పార్టీ మారలేదని అబద్దాలు చెబుతున్నారని ధ్వజమెత్తారు. దానం నాగేందర్ పేరు కాంగ్రెస్ పార్టీ క్యాంపెయినర్ల లిస్టులో ఎందుకు వొచ్చిందని ప్రశ్నించారు. దానం నాగేందర్ ఏ పార్టీలో గెలిచారు, ఏ పార్టీకి ప్రచారం చేస్తున్నాడని నిలదీశారు. ఏఐసీసీ అంటే ఆల్ ఇండియా కరప్షన్ కమిటీ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీలో గెలిచిన వాళ్లను తీసుకుని వాళ్ల పార్టీ క్యాంపెయినర్ల జాబితాలో పెట్టారని మండిపడ్డారు. రేవంత్ సర్కార్ హైదరాబాద్ను గాలికొదిలేసిందని విమర్శించారు. బస్తీ దవాఖానలు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. హైదరాబాద్ను రేవంత్ గాలికి వొదిలేశారని చెప్పారు. ప్రజల ఆరోగ్యం ద ప్రభుత్వం దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. పార్టీ నాయకులతో కలిసి ఖైరతాబాద్ లోని ఇబ్రహీంనగర్ బస్తీ దవాఖాన, అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా బస్తీ దవాఖానలో సదుపాయాలను పరిశీలించారు. మందులు, పరికరాల పని తీరు, దవాఖానలో అందుతున్న వైద్య సేవల వివరాలను డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ ప్రభుత్వం హైదరాబాద్ నలువైపులా నాలుగు టిమ్స్ దవాఖానలను ప్రారంభించిందని చెప్పారు. 90 శాతం పనులు బీఆర్ఎస్ హయాంలోనే పూర్తయ్యాయని తెలిపారు. మిగిలిన 10 శాతం పనులు చేయడానికి ఈ ప్రభుత్వానికి చేతకావడం లేదని మండిపడ్డారు. బస్తీ దవాఖానలను రేవంత్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఈ సందర్భంగా తమకు 4 నెలలుగా జీతాలు రావడం లేదని, జీతాల విషయంలో ప్రభుత్వం ఇబ్బందులు పెడుతుందని మహిళా డాక్టర్ తెలిపారు. అంగన్వాడీ కేంద్రంలో సమస్యలపై ఆరా తీశారు. చిన్నారులకు చాక్టెట్లు పంపిణీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ నాడు కేసీఆర్ హయాంలో ప్రజలకు, ముఖ్యంగా పేదలు అందరికీ అందుబాటులో ఉండేలా 450 బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేశారని తెలిపారు. వాటితోపాటు తెలంగాణ డయాగ్నస్టిక్స్ సెంటర్లను ఏర్పాటు చేసి ప్రజలకు ఉచితంగా పరీక్షలు కూడా అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వొచ్చిన తర్వాత బస్తీ దవాఖానాలను నిర్లక్ష్యం చేసి, ప్రజారోగ్యాన్ని పూర్తిగా పక్కన పెట్టేశారని విమర్శించారు. వాటిలో పనిచేసే సిబ్బందికి నాలుగు ఐదు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని చెప్పారు. మందు గోళీలు కూడా అందుబాటులో లేవన్నారు. ప్రజారోగ్యం అంటే రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమాత్రం శ్రద్ధ ఉన్నదో దీనితో అర్థమవుతుందన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





