స్థానిక కళాకారులతో కలిసి నృత్యాలు చేసిన ఆఫ్రికన్ డెలిగెట్స్
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 27: ఆఫ్రికన్ ప్రతినిధులను(African Delegates) సాంస్కృతిక ప్రదర్శనలు విశేషంగా అలరించాయి. కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 5 రోజుల పర్యటన లో భాగంగా ఆఫ్రికా ఖండంలో మధ్య, పచ్చిమ ప్రాంతాల్లోని 15 దేశాలకు చెందిన 30 మంది ఆఫ్రికన్ ప్రతినిధులు ( కంటెంట్ క్రియేటర్ లు ) హైదరాబాద్ పర్యటనలో భాగంగా మంగళవారం శిల్పారామం ను సందర్శించారు.
ఒగ్గు డోలు బృందంతో అధికారులు ఆఫ్రికన్ ప్రతినిధులు కు స్వాగతం పలికారు. అనంతరం శిల్పారామం లో తెలంగాణ కళా రూపాలను ఆఫ్రికన్ ప్రతినిధులకు ప్రదర్శించారు. కూచిపూడి, ఒగ్గుడోలు, పేరిణి నృత్యాల ను ఆసక్తిగా తిలకించారు. ప్రదర్శనలకు మైమరిచిపోయిన డెలిగేట్ లు కళాకారులతో కలిసి నృత్యం చేసారు. స్టాల్ లను సందర్శించారు. అంతకుముందు ఎలక్ట్రానిక్, హార్డ్వేర్ రంగంలో నూతన ఆవిష్కరణలు ప్రోత్సహించేందుకు ప్రభుత్వం నగరంలో ఏర్పాటు చేసిన టి – వర్క్ ను సందర్శించి నూతన ఆవిష్కరణ లు తిలకించారు. మైండ్ స్పేస్ లోని హార్న్ బిల్ వీఎఫ్ఎక్స్ స్టూడియో ను సందర్శించారు. పిల్లలను ఆకట్టుకునే కార్టూన్, సినిమాలకు గ్రాఫిక్స్ రూపకల్పన పై నిర్వాహకులు ఆఫ్రికన్ డెలిగేట్ లకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ముఖ్యంగా హనుమాన్ సినిమాకు హార్న్ బిల్ సంస్థ అందించిన విజువల్స్ ఎఫెక్ట్ ను తిలకించి చప్పట్లతో నిర్వాహకులను అభినందించారు. ఆఫ్రికన్ కంటెంట్ క్రియేటర్ల హైదరాబాద్ పర్యటన కార్యక్రమాలను రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ సమన్వయం చేస్తుంది.



