కలెక్టర్లు వినూత్నంగా ఆలోచించాలి

వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎస్‌ రామకృష్ణారావు

హైదరాబాద్‌, జూన్‌ 24: ప్రజల జీవితాలపై శాశ్వత ప్రభావం చూపేలా కలెక్టర్లు వినూత్నంగా ఆలోచించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు జిల్లా కలెక్టర్లకు సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వన మహోత్సవం, ఇందిరమ్మ గృహనిర్మాణ పథకం, ఎరువుల లభ్యత, ఆయిల్‌పామ్‌ విస్తరణ, భూ భారతి, సీజనల్‌ వ్యాధులు, టిబి ముక్త్‌ భారత్‌, వైద్య కళాశాలల అవసరాలు మొదలైన వాటి పురోగతిని సమీక్షించారు. పేదలు, అణగారిన వర్గాల అభ్యున్నతికి కలెక్టర్లు తమ జిల్లాల్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టడానికి అపారమైన అవకాశం ఉందన్నారు. ఇకపై ప్రతి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తామని తెలియజేశారు. ఇందిరమ్మ ఇళ్ల పురోగతిని సమీక్షించి మంజూరు ప్రక్రియను ప్రారంభించాలని కలెక్టర్లను ప్రధాన కార్యదర్శి కోరారు. మంజూరైన అన్ని ఇళ్ల పనులను వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. వనమహోత్సవం సందర్భంగా జిల్లా పర్యవేక్షణ సంప్రదింపుల కమిటీ సమావేశాన్ని నిర్వహించాలని, సంబంధిత విభాగాలతో జిల్లాలో సమర్థవంతంగా సమీక్షించాలని కలెక్టర్లకు సూచించారు. వనమహోత్సవంలో నాణ్యత గల మొక్కలు నాటడానికి సిద్ధంగా ఉన్నాయా లేదా అనే విషయాలను నిర్ధారించుకోవాల్సిన అవసరాన్ని ఆయన వివరించారు, ముఖ్యంగా పండ్ల మొక్కల పెంపకంపై దృష్టి సారించాలని, మొక్కల మనుగడను కూడా పరిశీలించాలని కలెక్టంతో అన్నారు. అన్ని విభాగాలను కలుపుకుని మొక్కల పెంపకం చేపట్టడానికి లక్ష్య విధానాన్ని పర్యావరణ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ సూచించారు. జిల్లాల్లో ఖాళీగా ఉన్న భూములను గుర్తించి పెద్ద ఎత్తున మొక్కల పెంపకం చేపట్టాలన్నారు. వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌ రావు జిల్లా కలెక్టర్లతో మాట్లాడుతూ తగినంత పరిమాణంలో ఎరువుల నిల్వలు అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రత్యేక అధికారులు తమ జిల్లాల్లోని ఎరువుల షాపులను సందర్శించి పరిస్థితిని సమీక్షించాలన్నారు. ఆయిల్‌పామ్‌ విషయంలో ఆయిల్‌ పామ్‌ తోటల పెంపకాన్ని చేపట్టడానికి తమ జిల్లాల్లో తగిన ప్రాంతాలను గుర్తించాలని, అలాగే రైతులను ప్రోత్సహించాలని కలెక్టర్లను కోరారు. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన రెవెన్యూ సదస్సులో 8 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయని ప్రధాన కార్యదర్శి తెలియజేశారు. దరఖాస్తులను వ్యక్తిగతంగా పర్యవేక్షించి, మానవీయ దృక్పథంతో పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. వర్షాకాలం ప్రారంభం కావడంతో వ్యాపించే వ్యాధులపై కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సీఎస్‌ కోరారు. టీబీ ముక్త్‌ భారత్‌ అభియాన్‌ పై, జిల్లా కలెక్టర్లు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని, %ణవీనూ%లు, హాస్పిటల్‌ సూపరింటెండెంట్లు, రెడ్‌ క్రాస్‌, ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్లతో కూడిన కన్వర్జెన్స్‌ సమావేశాన్ని కూడా నిర్వహించాలని ఆయన జిల్లా కలెక్టర్లను సూచించారు. ముఖ్యంగా వైద్య కళాశాలల అవసరాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. పర్యావరణ, అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి నదీమ్‌ అహ్మద్‌, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా జె చోంగ్తు, రెవెన్యూ శాఖ కార్యదర్శి లోకేశ్‌ కుమార్‌, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *