తెరుచుకున్న అంగ‌న్వాడీ కేంద్రాలు

– తొలిరోజు పిల్ల‌ల‌కు ఎగ్ బిర్యానీ
– మంత్రి సీత‌క్క ఆదేశాల అమ‌లు
– ప్ర‌వేశాలు పెరుగుతాయ‌ని అధికార్ల అంచ‌నా

వేసవి సెలవుల అనంతరం రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడి కేంద్రాలు నేడు తిరిగి ప్రారంభమయ్యాయి. అమ్మ మాట అంగన్వాడి బాట బ్యానర్లతో ర్యాలీలు నిర్వహించి అంగన్వాడి కేంద్రాల వద్ద చిన్నారులకు అంగన్వాడి టీచర్లు, హెల్పర్లు స్వాగతం పలికారు. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క ఆదేశాల మేరకు ప్రారంభ దినం సందర్భంగా ప్రత్యేకంగా ‘ఎగ్ బిర్యానీ’ మ‌ధ్యాహ్న భోజ‌నంలో వడ్డించారు. పిల్లలు ఎగ్ బిర్యానీను ఎంతో ఉత్సాహంగా ఆస్వాదించారు. తెలంగాణ చరిత్రలో తొలిసారిగా అంగన్వాడి కేంద్రాల్లో వెరైటీ ఫుడ్‌గా ఎగ్ బిర్యానీ వడ్డించడం గమనార్హం. ప్రతి రోజు ఒకే రకమైన భోజనం కాకుండా చిన్నారుల అభిరుచులకు అనుగుణంగా ఆహారంలో మార్పులు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. వీలైన చోట్ల చిన్నారులకు వెరైటీ ఫుడ్ అందించేందుకు మహిళా శిశు సంక్షేమ శాఖ చర్యలు తీసుకుంటోంది.

ఈ తరహా పోషకాహారం అందించడం ద్వారా అంగన్వాడీ కేంద్రాల్లో అడ్మిషన్లు, హాజరు పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. టేస్ట్, న్యూట్రిషన్ రెండింటినీ సమపాళ్లలో అందిస్తూ అంగన్వాడీలపై పిల్లలు, తల్లిదండ్రుల్లో నమ్మకం పెరుగుతుందన్న విశ్వాసంతో ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. ఈ సందర్భంగా రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ సీతా దయాకర్ రెడ్డి, సభ్యులు పదుల సంఖ్యలో అంగన్వాడి కేంద్రాలను సందర్శించారు.

అందిస్తున్న ఆహారం, విద్యా సేవలపై సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం అంగన్వాడీల బలోపేతం కోసం తీసుకుంటున్న చర్యలను స్వయంగా పరిశీలించిన కమిషన్ హర్షం వ్యక్తం చేసింది. హైదరాబాదులోని సైదాబాద్ లో గల సింగరేణి కాలనీలో అంగన్వాడి కేంద్రంలో వడ్డించిన ఎగ్ బిర్యానినీ చిన్నారులు ఎంజాయ్ చేశారు.  అయితే ఉత్తరాది రాష్ట్రాల్లో అంగన్వాడి కేంద్రాల్లో కనీసం కోడిగుడ్లను కూడా ఇవ్వటం లేదు. అలాంటిది తెలంగాణలో ఏకంగా అంగన్వాడీ కేంద్రాల్లో ఎగ్ బిర్యాని వడ్డించడం విశేషం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *