– తీవ్రమైన వాయు కాలుష్యంతో ఇబ్బందులు
– హాస్పిటల్స్లో పెరుగుతున్న శ్వాసకోశ కేసులు
న్యూదిల్లీ, అక్టోబర్ 27: దేశ రాజధాని దిల్లీలో వాయు కాలుష్యం రోజురోజుకూ క్షీణిస్తోంది. గాలి నాణ్యత సూచీ ప్రమాదకర స్థాయిలో నమోదవుతోంది. సోమవారం ఉదయం దిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో వాయు నాణ్యత సూచిక 315గా నమోదైంది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉన్న డేటా ప్రకారం అశోక్ విహార్లో అత్యధికంగా ఏక్యూఐ 416గా నమోదైంది. ఆ తర్వాత గౌతమ్ పురి వద్ద 415, ఆనంద్ విహార్ వద్ద 366గా ఉంది. గణెళిశ్పూర్ వద్ద 318, జీటీబీ నగర్లో 302, కశ్మీర్ గేట్ ఐఎస్బీటీ ప్రాంతంలో 298, యమూర్ విహార్లో 287గా ఏక్యూఐ నమోదైంది. రాత్రికి ఒకటి లేదా రెండుచోట్ల తేలికపాటి వర్షం పడే అవకాశం ఉందని దిల్లీ ఆర్ఎమ్సీ అంచనా వేసింది. తీవ్రమైన వాయు కాలుష్యంతో దిల్లీ వాసులు అనారోగ్యం బారిన పడుతున్నారు. దిల్లీ, నోయిడా, గురుగ్రామ్, ఫరీదాబాద్, ఘజియాబాద్లోని హాస్పిటల్స్లో రోగుల సంఖ్య గణనీయంగా పెరిగింది. శ్వాసకోశ, ఛాతీలో నొప్పి, దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యలతో స్థానికులు హాస్పిటల్స్ కు వస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్కాస్టింగ్ అండ్ రిసెర్చ్ నివేదిక ప్రకారం గాలి నాణ్యత 447కు పడిపోవడం అంటే దాన్ని తీవ్ర వాయు కాలుష్యంగా పరిగణించవచ్చు. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 0-100 మధ్య ఉంటే గాలి నాణ్యత బాగా ఉండి కాలుష్యం లేదని, 100-200 మధ్య ఉంటే గాలి నాణ్యత మధ్యస్తంగా ఉందని అర్థం. 300-400 మధ్య ఉంటే గాలి నాణ్యత మరింత అధ్వాన్నంగా ఉందని, 400-500 మధ్య ఉంటే కాలుష్యం తీవ్ర స్థాయిలో ఉందని అర్థం చేసుకోవచ్చు. ఈ నెల 29న దిల్లీలో మొదటిసారిగా కృత్రిమ వర్షాన్ని కురిపించేందుకు ఏర్పాట్లు చేశామని సీఎం రేఖా గుప్తా వెల్లడించారు. బురాయ్లో ప్రయోగాత్మక పరీక్ష విజయవంతమైందన్నారు. ఐఐటీ-కాన్పూర్ సహకారంతో దిల్లీ ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రాజెక్ట్కు ఐఎండీ, ఐఐటీఎమ్-పుణె తోడ్పాటును అందిస్తున్నాయి. దీపావళి తర్వాత పొగ మంచు సీజన్లో కాలుష్య కణాలను తగ్గించడానికి వాయువ్య దిల్లీలో అయిదుచోట్ల కృత్రిమ వర్షం కురిపించనున్నారు. ఇందుకోసం డీజీసీపీ అనుమతి పొందారు. సిల్వర్ అయోడైడ్ లేదా సోడియం క్లోరైడ్ లాంటి పదార్థాలను మేఘాల్లోకి విడుదల చేయడం ద్వారా కృత్రిమ వర్షాన్ని కురిపిస్తారు. ఈ వర్షం కారణంగా గాలి నాణ్యత మెరుగుపడే అవకాశం ఉంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





