రావలసి ఉన్నది. రావడానికి కావలసిన భౌతిక పరిస్థితులు ఏర్పడుతున్నాయి. వస్తే బాగుంటుంది. కానీ, వచ్చితీరుతుందని చెప్పలేము. ద్రావిడ సాహిత్యోద్యమం అనగానే, గతంలో ఉమ్మడి మద్రాసురాష్ట్రంలో తమిళుల నాయకత్వంలో జరిగిన ద్రావిడ రాజకీయ, సామాజిక ఉద్యమం మనకు స్ఫురిస్తుంది. తెలుగు, కన్నడ, మలయాళ ప్రాంతాలలో దాని ప్రభావం పరిమితంగానే ఉండింది. దక్షిణాది ప్రాంతాల వారి మధ్య సోదరత్వ సారూప్యాలు ఉండవచ్చును కానీ, రాజకీయ సంఘీభావం ఇంకా ఏర్పడవలసి ఉన్నది. ప్రాంతీయ వైమనస్యాలతో పాటు అనేక అవరోధాలు ఉన్నాయి.
అయితే, ఇప్పుడు దేశంలో బలపడిన ఉత్తరాది కేంద్రిత రాజకీయ వ్యవస్థ, దక్షిణాదివారి మధ్య ఏకీభావాన్ని అనివార్యంగా నిర్మిస్తున్నది. దక్షిణాది భాషాసాహిత్యాల మధ్య ఇటీవలికాలంలో ఆదాన ప్రదానాలు పెరిగాయి. సాహిత్య ఉత్సవాలు ఇరుగు పొరుగుల అతిథులతో సందడిగా జరుగుతున్నాయి. అనువాదాలు విరివిగా జరుగుతున్నాయి. ఒకరి గురించి మరొకరు ఎంతగా తెలుసుకుంటే, దక్షిణాది సాంస్కృతిక లక్షణాలు ఎంతగా సంస్కారవంతమైనవో, ఉత్తరాది కంటె ఎంత భిన్నమయినవో అర్థమై, ఉమ్మడితనం ఏర్పడుతుంది. ఇప్పుడు రూపొందవలసిన దాక్షిణాత్య ఉద్యమం, మునుపటి ద్రావిడ ఉద్యమానికి భిన్నంగా, జాతీయ అభివృధ్ధిలో, పంపకాలలో, పునర్విభజనల్లో న్యాయాన్ని కోరడం మీద దృష్టి పెట్టాలి. ఆ భవిష్యత్తుకు కావలసిన భావసమీకరణ, సృజనాత్మక వ్యక్తీకరణ, అస్తిత్వ నిర్మాణం మంద్రస్థాయిలో ఇప్పటికే మొదలయ్యాయి.




