తెలంగాణా కు చెందిన ఇద్దరు ప్రముఖులకు పద్మశ్రీ

వికసించిన తెలుగు పద్మాలు!

గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను (2026) ప్రకటించింది. వీరిలో ఇద్దరు తెలుగు వారు ఉండడం విశేషం.
హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ కుమార స్వామి తంగరాజ్, తెలంగాణకు చెందిన రామ్ రెడ్డి మామిడి పద్మశ్రీ పురస్కారానికి ఎంపికయ్యారు. కుమార స్వామి తంగరాజ్ సీసీఎంబీ శాస్త్రవేత్త కాగా, రామ్ రెడ్డి పశుసంవర్థక పాడి పరిశ్రమలో గణనీయమైన కృషి చేశారు.

 


* పాడి పరిశ్రమలో పరిమళించిన ప్రతిభ
పశుసంవర్ధక, పాడి పరిశ్రమ రంగ అభివృద్ధికి… ప్రత్యేకించి సహకార సంఘాల నేతృత్వంలో గ్రామీణాభివృద్ధిని ప్రోత్సహించడంలో మార్గదర్శక కృషికి గుర్తింపుగా తెలంగాణకు చెందిన మామిడి రామ్ రెడ్డికి 2026 సంవత్సరానికి పద్మశ్రీ పురస్కారం లభించింది.
రైతు కేంద్రిత అభివృద్ధికి పాటుపడే మామిడి రామ్ రెడ్డి… పశుసంవర్ధకం, పాడి పరిశ్రమలో సహకార ఉద్యమాన్ని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. గ్రామీణ వర్గాలకు స్థిరమైన జీవనోపాధిని కల్పించారు. ఆయన దార్శనికత, నాయకత్వం ద్వారా సమష్టి వృద్ధి, న్యాయమైన మార్కెట్ అవకాశాలు, రైతులకు ఆర్థిక స్థిరత్వం కల్పించడంలో సహకార సంస్థలు ప్రభావవంతమైన వేదికలుగా మారాయి.

సహ వికాస స్థాపకులుగా ఆయన సంస్థాగత పారదర్శకత, ఆర్థిక క్రమశిక్షణపై ప్రధానంగా దృష్టి సారిస్తూ పాల దిగుబడిని మెరుగుపరిచే స్థిరమైన సహకార సంస్థలను స్థాపించి, వాటిని పెంపొందించారు. ఆయన ప్రయత్నాలు ఉత్పత్తికి మించి విస్తరించాయి. సామర్థ్యాలను పెంపొందించడానికి ఆయన అత్యంత ప్రాధాన్యమిచ్చారు. రైతులకు పశువుల నిర్వహణ, పాడి కార్యకలాపాలు, ఆర్థిక నిర్వహణలోనూ శిక్షణనిచ్చి, దీర్ఘకాలిక స్వావలంబనకు అవసరమైన నైపుణ్యాలను సమకూర్చేందుకు రామ్ రెడ్డి ఎంతగానో కృషి చేశారు.

ముఖ్యంగా మామిడి రామ్ రెడ్డి మహిళల నేతృత్వంలోని సహకార సంస్థలను నిరంతరం ప్రోత్సహించారు. నిర్ణయం తీసుకోవడంలో, ఆర్థిక కార్యకలాపాల్లో మహిళలు ఎక్కువగా పాల్గొనడాన్ని ప్రోత్సహించారు. ఆయన చేపట్టిన కార్యక్రమాలు గ్రామీణ మహిళలకు ఆదాయ అవకాశాలను పెంచడంలో, సహకార విధానంలో వారి పాత్రను బలోపేతం చేయడంలో ఎంతగానో సహాయపడ్డాయి.

దార్శనిక నాయకుడిగా పేరున్న మామిడి రామ్ రెడ్డి కృషి తెలంగాణ అంతటా గ్రామీణ జీవనోపాధిపై శాశ్వత ప్రభావాన్ని చూపింది. పశుసంవర్ధక, పాడి పరిశ్రమల్లో సమ్మిళిత అభివృద్ధి, సుస్థిర వృద్ధికి జీవితాంతం కృషి చేసిన ఆయన నిబద్ధతకు పద్మశ్రీ పురస్కారం మంచి గుర్తింపుగా నిలుస్తుంది.


* జన్యశాస్త్రంలో ఎనలేని కృషి
మానవ జన్యుశాస్త్రం, జనగణన జన్యుశాస్త్రం (పాపులేషన్ జెనోమిక్స్) రంగాల్లో చేసిన అసాధారణ కృషికి గాను తెలంగాణకు చెందిన ప్రముఖ జన్యుశాస్త్రవేత్త డాక్టర్ కుమారస్వామి తంగరాజ్‌కు పద్మశ్రీ పురస్కారం లభించింది. భారతదేశ జన్యు చరిత్రపై అవగాహన, ప్రజారోగ్యంపై దాని కీలక ప్రభావాలను పూర్తిగా మార్చేసిన మూడు దశాబ్దాల అద్భుతమైన పరిశోధనలకు ఈ అవార్డు గుర్తింపుగా నిలుస్తుంది.
భారతీయ జనాభా విషయంలో జన్యు నిర్మాణంపై చేసిన అగ్రగామి అధ్యయనాలకు గాను డాక్టర్ తంగరాజ్ అంతర్జాతీయంగా గుర్తింపు పొందారు. భారతీయులందరిలో లోతైన ఉమ్మడి పూర్వీకత ఉందని ఆయన చేసిన కీలక పరిశోధనలు నిరూపించాయి. ఆఫ్రికా నుంచి భారత ఉపఖండానికి ఆది మానవుల వలసలపై బలమైన జన్యు ఆధారాలను ఇవి అందించాయి. ఈ ఫలితాలు మానవ పరిణామం, జనాభా వైవిధ్యంపై జరుగుతున్న అంతర్జాతీయ అధ్యయనాలలో భారత్‌ను ఒక ప్రధాన కేంద్రంగా నిలబెట్టాయి.
మానవ మూలాలను గుర్తించడమే కాకుండా వ్యాధుల బారిన పడే అవకాశంపై జనగణన జన్యుశాస్త్రం ఏ విధంగా ప్రభావం చూపుతుందన్న విషయాన్ని అర్థం చేసుకోవడంలో డాక్టర్ తంగరాజ్ కృషి ఎంతగానో తోడ్పడింది. విభిన్న వర్గాల్లోని జన్యు వైవిధ్యాలను ఆరోగ్య ఫలితాలతో అనుసంధానించడం ద్వారా ఆయన పరిశోధన భారత్‌లో ప్రిసిషన్ మెడిసిన్, నివారణ ఆరోగ్య సంరక్షణ వ్యూహాలకు శాస్త్రీయ పునాది వేసింది.
అనేక జాతీయ జీనోమ్ కార్యక్రమాలలో కీలక భాగస్వామిగా ఉన్న డాక్టర్ తంగరాజ్.. దేశ జన్యు పరిశోధన వ్యవస్థను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. జీనోమ్ మ్యాపింగ్ కార్యక్రమాలు, అరుదైన వ్యాధులకు సంబంధించిన మిషన్లలో ఆయన నాయకత్వం.. సంక్లిష్టమైన జన్యుపరమైన సమాచారాన్ని ప్రజారోగ్య ప్రణాళిక, విధాన రూపకల్పనకు ఉపయోగపడేలా మార్చడంలో సహాయపడింది.
పరిశోధన ద్వారా దేశ నిర్మాణానికి, అత్యున్నత శాస్త్రీయ ప్రమాణాలకు డాక్టర్ కుమారస్వామి తంగరాజ్ అందించిన నిరంతర నిబద్ధతను ఈ పద్మశ్రీ అవార్డు గుర్తిస్తుంది. మానవ మూలాల జ్ఞానాన్ని నేటి ఆరోగ్య సంరక్షణ సవాళ్లతో అనుసంధానించే ‘జన్యుశాస్త్ర ఆధారిత ప్రజారోగ్య వ్యవస్థ’ దిశగా భారత్‌ సాగిస్తున్న ప్రయాణానికి ఆయన సహకారం నిరంతరం మార్గనిర్దేశం చేస్తూనే ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *