యూనివర్సిటీలో విద్యార్థులు చేస్తున్న దీక్షా శిబిరంలో పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి
తెలంగాణ సమగ్ర శిక్షా ఉద్యోగుల రిలే దీక్షకు సంఘీభావం...
హన్మకొండ, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 13 : తెలంగాణా ఉద్యమంలో కీలక పాత్ర వహించిన విద్యార్థులపై దాడులకు పాల్పడడం దురదృష్టకరమని, తెలంగాణా కోసం మలి దశ ఉద్యమంలో ఎన్నో ఉద్యమాలు చేసి పోరాడిన విద్యార్థి సంఘాల నాయకులను అణిచివేసే ధోరణి మానుకోవాలని పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ప్రభుత్వన్ని డిమాండ్ చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రత్యెక తెలంగాణా రాష్ట్రం కోసం ఉద్యమం ప్రారంభించింది కాకతీయ యూనివర్సిటీ నుండేనని అయన గుర్తు చేశారు. కెయులో పిహెచ్డి అడ్మిషన్ల పక్రియపై నిరసన తెలియ చేసిన యూనివర్సిటీ విద్యార్థులపై జరిగిన అమానుష దాడికి నిరసనగా కేయు జేఎసి.ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న దీక్షా శిబిరాన్ని బుధవారం టిపిసిసి అధ్యక్షులు ఎ. రేవంత్ రెడ్డి సందర్శించి వారికి సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ…ఉద్యమం ప్రారంభమైన కెయు నుండే ఇప్పుడు తన దురహంకార, నియంత పాలన నుండి విముక్తి కల్గించడానికి విద్యార్థులు పోరాటానికి సన్నద్ధం అవుతరని కెసిఆర్ గుర్తుంచుకోవీలన్నారు. యూనివర్సిటీలో జరుగుతున్న అక్రమాలను, లోపాలను ప్రశ్నించిన విద్యార్థులపై పోలీసులు భౌతిక దాడులు, థర్డ్ డిగ్రీ ప్రయోగించి ఇబ్బంది పెట్టారన్నారు. కేసును టాస్క్ ఫోర్సు పోలీసులకు అప్పచెప్పి విద్యార్థులను చిత్రహింసలకు గురిచేసారనియ ఆయన ఆరోపించారు. కొంతమంది పోలీసులు రాజకీయ నాయకుల కనుసన్నులో పనిచేస్తూ అతిగా ప్రవర్తిస్తున్నారని, కేయు వైస్ చాన్స్లర్ బిఆర్ఎస్ కార్యకర్తగా మారి కేసిఆర్ తొత్తుగా వ్యవహరిస్తున్నాడని ఆరోపించారు. పాఠాలు చెప్పి విద్యార్థులకు భవిష్యత్ను నిర్మించాల్సిన అధ్యాపకులు, ప్రొఫెసర్లు తమ తాత్కాలిక లబ్ది కోసం రాజకీయ నాయకుల తొత్తులు కావడం చాలా సిగ్గుచేటన్నారు రేవంత్.

సమగ్ర శిక్షా ఉద్యోగుల రిలే దీక్షకు సంఘీభావం….
రాజీవ్ గాంధీ విద్య మిషన్ సర్వ శిక్ష అభియాన్లో కాంగ్రెస్ పార్టీ హయాంలోనే ప్రస్తుత ఉద్యోగులకు అవకాశాలు కల్పించిందని రేవంత్ రెడ్డి అన్నారు. విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడానికి వారిని నియమించడం జరిగిందన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీమ్ కోర్ట్ ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగిందని, అయినా ఇంతవరకు వారి ఉద్యోగాలు పర్మనెంట్ కాలేదన్నారు. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ తీసుకు వొచ్చింది కాంగేస్స్ పార్టీనేనని, దాన్ని ప్రభుత్వం తుంగలో తొక్కిందని రేవంత్ మండిపడ్డారు. విద్యనూ ప్రైవేటికరణ చేసి వ్యాపారం చేసిన వ్యక్తి కేసిఆర్ అన్నారు. సమగ్ర శిక్ష ఉద్యోగులను ఉద్యోగ భద్రత కల్పించి, మినిమం టైమ్ స్కేల్ అమలు చేస్తామని రేవంత్ హామీ ఇచ్చారు. హెల్త్ ఇన్స్యురెన్స్ మరియు ఎక్స్ గ్రేషియా కల్పిస్తామని, విద్యా శాఖా నియమాకలో వెయిటేజ్ కల్పిస్తామని తెలిపారు. వారి సమస్యకు పరిష్కారం కావాలంటే కేసిఆర్ను గద్దె దించాల్సిన అవసరం ఉందని, కేసిఆర్ ఉద్యోగం ఊడ గోట్టాల్సిందేనని ఆయన పిలుపునిచ్చారు. ఎంఆర్పిఎస్, ఎంఎస్పి హన్మకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఎస్సి వర్గీకరణ బిల్ల్లుకు చట్ట భద్రత కల్పించాలంటూ చేస్తున్న దీక్షకు కూడా రేవంత్ రెడ్డి సంఘీభావం తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వారి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.




