– విచారణలో వెల్లడవుతున్న సంచలన విషయాలు
- మావోయిస్టుల సానుభూతిపరుల పేరుతో ట్యాప్
- జాబితాలో రేవంత్, ఈటల, అరవింద్, రఘునందన్ రావు
-నాలుగోసారి విచారణకు హాజరైన ప్రభాకర్ రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 17: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వొస్తున్న తరుణంలో ప్రధాన నిందితుడు, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచి(ఎస్ఐబీ) మాజీ ఓఎస్డీ ప్రభాకర్రావు మరోసారి సిట్ విచారణకు హాజరయ్యారు. నాలుగో సారి సిట్ ముందు హాజరైన ఆయనను మరింత లోతుగా విచారించేందుకు సిట్ ప్రణాళికలు రూపొందించింది. ఇప్పటికే 600 మంది ఫోన్ ట్యాపింగ్ బాధితుల జాబితాను అధికారులు సిద్ధం చేశారు. ఫోన్ ట్యాపింగ్తో వారు ఇబ్బందులకు గురైన తీరును వివరించి దానిపై ప్రభాకర్రావు ఏం చెబుతారనే విషయాన్ని నమోదు చేయనున్నట్లు సమాచారం. ఈ క్రమంలో తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సాధారణ ఎన్నికల సమయంలో నవంబర్ 15న పెద్ద ఎత్తున ట్యాపింగ్ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. నవంబర్ 15న 600 మంది ఫోన్లను ప్రభాకర్ రావు టీమ్ ట్యాప్ చేసినట్లు గుర్తించారు. సాధారణ ఎన్నికల సమయంలో ప్రణీత్ అండ్ టీమ్ పెద్ద ఎత్తున ట్యాపింగ్కు పాల్పడినట్లు బయటపడింది. ఒకే రోజు 600 ఫోన్లను ప్రభాకర్ రావు ట్యాప్ చేశారు. మావోయిస్టుల పేరు చెప్పి ట్యాపింగ్కు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. మావోయిస్టులకు సహకారం అందిస్తున్నారని మావోయిస్టుల సానుభూతిపరుల పేర్లతో ట్యాపింగ్ చేసినట్లు గుర్తించారు. రివ్యూ కమిటీకి మావోయిస్టుల పేర్లు, వారి నెంబర్లను ప్రభాకర్ రావు ఇచ్చినట్లు తేలింది. సాధారణ ఎన్నికల్లో మావోయిస్టులు యాక్టివ్ అయ్యారని కమిటీకి ప్రభాకర్ రావు చెప్పినట్లు సమాచారం. మావోయిస్టుల పేరుతో అధికార, ప్రతిపక్ష, వ్యాపార రంగానికి చెందిన వారితో పాటు జర్నలిస్టుల ఫోన్లను కూడా ట్యాప్ చేశారు. ప్రతిపక్ష కాంగ్రెస్ ముఖ్య నాయకులతో పాటు కీలక నాయకుల ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయి. రేవంత్ రెడ్డి, ఈటెల రాజేందర్, అరవింద్ , రఘునందన్ రావు ఫోన్లను ట్యాప్ చేసినట్లు గుర్తించారు. అప్పటి బీఆర్ఎస్ అధికారపక్ష నాయకులు, ఎమ్మెల్యేల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేశారు. ట్యాపింగ్ కోసం ప్రభాకర్ రావు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. శ్రవణ్ రావు ద్వారా సమాచారం తెప్పించుకొని ప్రణీతరావుకు ప్రభాకర్ రావు ఇచ్చేవారని తేలింది. ట్యాపింగ్ ద్వారా వచ్చిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు భుజంగరావుకు ప్రణీత్ ఇచ్చారని భుజంగరావు నేరుగా బీఆర్ఎస్ నేతలకు ఫోన్ చేసి స్థితిగతులను ఎప్పటికప్పుడు వివరించినట్లు పోలీసులు గుర్తించారు. ప్రతిపక్ష నాయకుల వైపు ఎవరైనా వెళ్తుంటే వెంటనే అధికారపక్ష నేతలకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు భుజంగరావు. ప్రతిపక్ష పార్టీలకు ఆర్థిక సాయం చేస్తున్న వారిపై నిఘా పెట్టి పోలీసులతో దాడులు చేయించారు. వ్యాపారవేత్తలపై దాడుల కోసం టాస్క్ ఫోర్స్ ఓఎస్డీ రాధా కిషన్ రావును ప్రభాకర్ రావు ఉపయోగించుకున్నట్లు సమాచారం. డబ్బులు ఎవరైనా తీసుకువెళ్తుంటే వెంటనే ట్యాప్ చేసి మరీ అధికారులు పట్టుకున్నట్లు పోలీసులు గుర్తించారు.





