రద్దయిన 48 విమాన సర్వీసులు

ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇరాన్‌- ఇజ్రాయెల్‌ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో మధ్యప్రాచ్య ప్రాంతంలో ఆకాశ మార్గాన్ని మూసివేశారు. ఈ నేపథ్యంలో భారత పౌర విమానయాన మంత్రిత్వ శాఖ మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌లో 48 విమాన సర్వీసులను రద్దు చేసినట్లు తెలిపింది. ఆ జాబితాలో 28 సర్వీసులు న్యూదిల్లీ ఎయిర్‌పోర్టుకు చేరుకోవాల్సి ఉండగా ఇంకో 20 సర్వీసులు న్యూదిల్లీి నుంచి బయలుదేరాల్సి ఉన్నాయని వివరించింది. వాటిలో ఎయిర్‌ ఇండియా విమానాలు 17, ఇండిగో 8, ఇతర సర్వీసులకు చెందినవి మూడు విమాన సర్వీసులు ఉన్నాయని వివరించింది.
ఇంకోవైపు ఇజ్రాయెల్‌- ఇరాన్‌ దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరగా ఈ యుద్ధాన్ని ముగిస్తున్నామని ఇరాన్‌ తాజాగా ప్రకటించింది. ఈ క్రమంలో మధ్య ప్రాచ్యంలోని విమానాశ్రయాలు తెరుచుకోనున్నాయని, పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ విమాన సర్వీసులు నడుపుతామని మంగళవారం ఉదయం ఇండిగో సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. విమాన ప్రయాణాలు, సర్వీసుల ఆప్‌ డేట్‌ కోసం మొబైల్‌ యాప్‌ లేదా తమ వెబ్‌సైట్‌ను సందర్శించాలని ప్రయాణికులకు సూచించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page