ఎన్నికల నిర్వహణలో అధికారుల నిర్లక్ష్యం

– 12 మందిపై సస్పెన్షన్ వేటు 

చిట్యాల, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 14 : నల్లగొండ జిల్లా చిట్యాల మండలంలోని చిన్నకాపర్తి గ్రామంలో ఈనెల 11న నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి పోలైన బ్యాలెట్‌ పేపర్లు శుక్రవారం మురుగు కాలువలో ప్రత్యక్షమయ్యాయి. ఈ ఘటనకు బాధ్యులైన 12 మంది ఎన్నికల అధికారులను జిల్లా కలెక్టర్‌ ఇలా త్రిపాఠి శనివారం సస్పెండ్‌ చేశారు. ఘటన వెలుగులోకి వచ్చిన శుక్రవారం రాత్రి ఎన్నికల స్టేజ్‌ -2 అధికారి విజయ్‌కుమార్‌ను సస్పెండ్‌ చేసి శనివారం చిట్యాల ఎంపీడీవో ఎస్పీ జయలక్ష్మితోపాటు సంబంధిత పోలింగ్‌ కేంద్రాల్లో విధులు నిర్వహించిన మరో 10మంది అధికారులపై వేటు వేశారు. ఎన్నికల విధులలో తీవ్ర నిర్లక్ష్యం వహించడమే కాకుండా పోలైన బ్యాలెట్‌ పేపర్లు మురికి కాలువలో పడేందుకు కారణమైన బాధ్యత అధికారుల దేనని జిల్లా యంత్రాంగం నిర్ధారించింది. దీంతో వారందరినీ సస్పెండ్‌ చేస్తూ జిల్లా కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల విధుల్లో పాల్గొన్న అధికారులు ఇంతమందిని ఒకేసారి సస్పెండ్‌ చేయడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టనున్నట్లు జిల్లా అధికారులు తెలిపారు. చిన్నకాపర్తి పోలింగ్‌ కేంద్రంలో పోటీ చేసిన అభ్యర్థులకు సంబంధించిన ఏజెంట్లను సైతం నల్గొండ డీఎస్పీ శివరాంరెడ్డి చిట్యాల పోలీస్‌ స్టేషన్‌లో విచారించారు. ఎన్నికల రోజు జరిగిన సంఘటనపై ఆయన విచారించి సంఘటనకు బాధ్యులైన వారిపై కేసులు నమోదు చేస్తామని పేర్కొన్నారు.

—————————————————————————————————————————————————————

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *