– 9 కేసుల ఛేదన.. 12 మంది నిందితుల అరెస్ట్
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 7: సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు జనవరి 30 నుంచి ఫిబ్రవరి 5 వరకు చేపట్టిన ప్రత్యేక దర్యాప్తులో భాగంగా మొత్తం 9 సైబర్ క్రైమ్ కేసులను విజయవంతంగా ఛేదించారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న 12 మంది నిందితులను అరెస్టు చేసినట్లు సైబర్ క్రైమ్స్ డీసీపీ టి.సాయి మనోహర్ తెలిపారు. ఈ అరెస్టుల్లో అత్యధికంగా 7 అరెస్టులు ట్రేడింగ్ మోసాలకు సంబంధించినవని తెలిపారు. మొత్తం కేసుల్లో ట్రేడింగ్ ఫ్రాడ్, జాబ్ ఫ్రాడ్, పార్ట్టైం జాబ్ ఫ్రాడ్, మ్యాట్రిమోనీ ఫ్రాడ్ వంటి వివిధ రకాల సైబర్ నేరాలు ఉన్నట్లు వెల్లడించారు. అదే సమయంలో బాధితులకు ఊరట కలిగించే విధంగా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్, సైబరాబాద్ 58 కేసుల్లో 406 రిఫండ్ ఆర్డర్లను సాధించిందని డీసీపీ తెలిపారు. వీటి ద్వారా మొత్తం రూ.1,04,17,082 లను బాధితులకు తిరిగి చెల్లించనున్నట్లు చెప్పారు. ఇది సైబర్ నేరాలపై కఠిన చర్యలతో పాటు బాధితుల ఆర్థిక పరిరక్షణకు పోలీస్ శాఖ ఇస్తున్న ప్రాధాన్యతకు నిదర్శనమని పేర్కొన్నారు. ఈ దర్యాప్తులో కీలకంగా వెలుగులోకి వచ్చిన కేసుల్లో ఒకటిగా రూ22.80 లక్షల జాబ్ ఫ్రాడ్ కేసు ఉందని డీసీపీ వివరించారు. ఈ కేసులో నిందితులు ఒక ప్రముఖ ఎంఎన్సీలో సాప్ట్వేర్ డెవలపర్ ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి బాధితుడి నుంచి రూ 20,80,007 తీసుకున్నారని తెలిపారు. నిందితుడు జాబ్ పోర్టల్ ఉద్యోగిలాగా నటిస్తూ దరఖాస్తు, ఇంటర్వ్యూ, ప్రాసెసింగ్ ఛార్జీల పేరుతో డబ్బు వసూలు చేశారని, డబ్బు తీసుకున్న తర్వాత అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వకుండా, రీఫండ్ కూడా చేయకుండా పూర్తిగా స్పందించడం మానేశారని వివరించారు. ఈ కేసులో ప్రధాన నిర్వాహకుడైన పురుషోత్తం శర్మతో పాటు, కమిషన్ ఆధారంగా సిమ్ కార్డులు మరియు బ్యాంకు ఖాతాలు సరఫరా చేసిన కుల్దీప్ కుమార్ సునీల్ అనే ఇద్దరు దిల్లీకి చెందిన నిందితులను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేసినట్లు వెల్లడించారు. నిందితులు మోసపోయిన మొత్తాన్ని అనేక బ్యాంకు ఖాతాల కు మళ్లించినట్లు దర్యాప్తులో తేలిందన్నారు. ప్రజలు ఉద్యోగాలు, పెట్టుబడుల పేరుతో సోషల్ డియా లేదా జాబ్ పోర్టల్స్ ద్వారా వచ్చే ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని డీసీపీ టి. సాయి మనోహర్ సూచించారు. ఉద్యోగ దరఖాస్తులు, ఇంటర్వ్యూలు లేదా అపాయింట్మెంట్ల కోసం ఎట్టి పరిస్థితుల్లోనూ డబ్బు చెల్లించవద్దని, నిజమైన కంపెనీలు ముందస్తుగా రుసుములు వసూలు చేయవని గుర్తుంచుకోవాలని తెలిపారు. వ్యక్తిగత వివరాలు లేదా చెల్లింపులు చేసే ముందు అధికారిక వెబ్సైట్లు లేదా సంబంధిత హెచ్ఆర్ విభాగాల ద్వారా ధృవీకరణ చేసుకోవాలని సూచించారు. సైబర్ మోసాలకు గురైన వారు వెంటనే 1930 నంబర్కు కాల్ చేయాలని లేదా వెబ్సైట్లో ఫిర్యాదు చేయాలని డీసీపీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





