ఆస్తుల మార్కెట్ విలువ సవరణకు కార్యాచరణ ప్రణాళిక
ధరల సవరణకు ఇదివరకే అధికారులకు సిఎం ఆదేశం
నేడు కలెక్టర్లు, ఆర్డిఓలతో ప్రభుత్వం సమావేశం
ప్రజాతంత్ర ఇంటర్నెట్ డెస్క్, జూన్ 17 : ఆగస్ట్ 1 నుండి ఆస్తులు మరియు వ్యవసాయ, వ్యవసాయేతర భూమికి కొత్త రిజిస్ట్రేషన్ ఫీజులు అమలులోకి రానున్నాయి. ప్రభుత్వం ఆదాయ మార్గాలను పెంచే మార్గాల అన్వేషణలో భాగంగా ఆస్తుల మార్కెట్ విలువను సవరించడం ద్వారా ఆదాయాన్ని పెంచుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయించింది. స్టాంపులు మరియు రిజిస్ట్రేషన్ శాఖ ప్రస్తుత విలువను అంచనా వేయడానికి, కొత్త రిజిస్ట్రేషన్ ఫీజులను నిర్ణయించడానికి అవసరమైన సవరణలను చేయడానికి కార్యాచరణ ప్రణాళికపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా నేడు కలెక్టర్లు, ఆర్డిఓలతో సమావేశం నిర్వహించేందుకు నిర్ణయించింది. ఈ సమావేశంలో కార్యాచరణ ప్రణాళికకు సంబంధించి ప్రాథమికంగా ఒక నిర్ణయానికి రానుంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో మార్కెట్ విలువలను అంచనా వేసి సవరించడానికి స్టాంప్ మరియు రిజిస్ట్రేషన్ శాఖ ఇప్పటికే నిబంధనలు జారీ చేసింది.
వివిధ దశల విశ్లేషణ అనంతరం జూలై 1న కొత్త రిజిస్ట్రేషన్ ఫీజులు నిర్ణయిస్తారు. అలాగే పలు విధాల పరిశీలన తర్వాత తుదిగా మార్కెట్ విలువ నిర్ణయించబడుతుంది. అనంతరం మండల, జిల్లా కమిటీల పూర్తి స్థాయి పరిశీలన అనంతరం కొత్త మార్కెట్ విలువ ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానుంది. కసరత్తులో భాగంగా రెవెన్యూ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పంచాయతీరాజ్, సర్వే తదితర శాఖల ప్రతినిధులతో స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ సమావేశాలు నిర్వహించనుంది. జూలై 1న సవరించిన విలువలను వెబ్సైట్లో ప్రచురించిన తర్వాత, జూలై 20 వరకు ప్రజల నుండి వొచ్చే అభిప్రాయాలు, అభ్యంతరాలను స్వీకరించి, పరిశీలించి జూలై 31 కల్లా కసరత్తు పూర్తి చేసిన అనంతరం ఆగస్టు 1 నుంచి కొత్త రిజిస్ట్రేషన్ ఛార్టీలను అమలులోకి తీసుకురానుంది.
ఆదాయాలను పెంచే మార్గాల అన్వేషణకు మే నెలలో సిఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో స్టాంపులు మరియు రిజిస్ట్రేషన్ల శాఖకు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే సమావేశంలో భూమి పన్నులు పెరిగినా అదే స్థాయిలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం పెరుగకపోవడంపై చర్చించారు. ఈ సందర్భంగా భూమి మార్కెట్ విలువకు, వాస్తవ విక్రయ ధరకు మధ్య భారీ వ్యత్యాసమే కారణమని అధికారులు సిఎంకు వివరించారు. ఏటా భూముల మార్కెట్ విలువ సవరించాలని చట్టంలో ఉన్నా అది జరుగక పోవడంతో ధరలను సవరించాలని సిఎం అధికారులను ఆదేశించారు. అయితే ఓ వైపు పెంచుతూనే మరోవైపు భవన, రియల్ ఎస్టేఠ రంగానికి కూడా అనుకూలంగా ఉండే విధంగా భూముల ధరలు సవరించాలని ఆ సందర్భంగా సిఎం అధికారులకు సూచించారు. అయితే ఈ పక్రియకు లోక్ సభ ఎన్నికల కోడ్ అడ్డంకిగా నిలిచింది. ఇప్పుడు ఎన్నికల కోడ్ ముగిసినందున కసరత్తు తిరిగి ప్రారంభించడంలో భాగంగా ప్రభుత్వం నేడు కలెక్టర్లు, ఆర్డిఓలతో సమావేశం నిర్వహించనుంది.





