చిల్లర రాజకీయాలకు ప్రజలే బుద్ధి చెబుతారు: మంత్రి హరీష్ రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 31 : ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం గురించి విపక్ష నేతలు దిగజారి మాట్లాడుతున్నారని మంత్రి హరీష్ రావు విమర్శించారు. సీనియర్ నాయకులు కూడా చిల్లర మాటలు మాట్లాడటం దురదృష్టకరమన్నారు. గతంలో ఇలాంటి ఘటనలు జరగలేదని చెప్పారు. మంగళవారం హైదరాబాద్ యశోద దవాఖానలో చికిత్స పొందుతున్న ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిని మంత్రి హరీష్ రావు పరామర్శించారు. అనంతరం ఆయన వి•డియాతో మాట్లాడుతూ…ప్రభాకర్ రెడ్డిని వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని చెప్పారు.
చిన్న పేగుకు నాలుగు చోట్ల గాయం కావడంతో తొలగించారని తెలిపారు. రాజకీయాలను అపహాస్యం చేసేలా విపక్షాల తీరు ఉన్నదని విమర్శించారు. సీఎం కేసీఆర్కు పనితనం తప్ప.. పగతనం లేదన్నారు. బీఆర్ఎస్ మొదటి నుంచి ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్నదని స్పష్టం చేశారు. ప్రజలను రెచ్చగొట్టి అల్లర్లు చేయాలని ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. తెలంగాణ రాజకీయాల్లో దాడులకు తావులేదని చెప్పారు. నేతలపై దాడులను తెలంగాణ సమాజం హర్షించదని తెలిపారు. ప్రభాకర్ రెడ్డి ఘటనపై విచారణ జరుగుతున్నదని, దాడి వెనుక ఉన్న కుట్రను పోలీసులు తేల్చుతారని చెప్పారు.





