నిబద్ధత గల కమ్యూనిస్టు నేత: కేసీఆర్‌

– సురవరం మృతికి ప్రముఖుల సంతాపం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 23: సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ సురవరం సుధాకర్‌ రెడ్డి మృతికి పలువురు ప్రముఖులు సంతాసం వ్యక్తం చేశారు. పీడిత వర్గాల అభ్యున్నతి కోసం పనిచేసే కమ్యూనిస్టు పార్టీ నేతగా తన జీవితకాలం కృషి చేసిన తెలంగాణ మట్టి బిడ్డ సురవరం అని బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఒక ప్రకటనలో సంతాపం ప్రకటించారు. మార్క్సిస్టు ప్రజానేతగా ఆయన గొప్ప పేరు సంపాదించుకున్నారన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో వారితో తనకున్న అనుబంధాన్ని కేసీఆర్‌ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. శోకతప్తులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

కమ్యూనిస్టులకు తీరని లోటు: కేటీఆర్‌

సీపీఐ అగ్ర నాయకుడు, నల్లగొండ మాజీ ఎంపీ సురవరం సుధాకర్‌ రెడ్డి మృతికి బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సంతాపం తెలిపారు. ఆయన మరణం తెలంగాణ రాజకీయాలకు, కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని లోటన్నారు. ఆయన తన జీవితాన్ని ప్రజల కోసం, పేదల అభ్యున్నతి కోసం అంకితం చేశారన్నారు. నల్లగొండ పార్లమెంట్‌ సభ్యుడిగా ఆయన అందించిన సేవలు అపారమైనవని, విలువలతో కూడిన రాజకీయాలకు ఆయన నిలువుటద్దమని కొనియాడారు. ఆయన పోరాట స్ఫూర్తి, నిబద్ధత అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. ఆయన కుటుంబానికి, మిత్రులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

ఆయన ఉద్యమ పంథా చిరస్మరణీయం: హరీష్‌రావు

సురవరం సుధాకర్‌రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు. సీపీఐ అగ్ర నాయకుడు, పార్లమెంట్‌ మాజీ సభ్యుడు సురవరం మరణం ఎంతో బాధాకరమన్నారు. వారి ప్రజాసేవ, ఉద్యమ పంథా చిరస్మరణీయమన్నారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ సురవరం ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానన్నారు.


 

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండిరగ్‌ వీడియోల కోసం Prajatantra వెబ్‌సైట్‌ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్‌ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్‌ను ఫాలో కండి. అలాగే మా ప్రజాతంత్ర యూట్యూబ్‌ చానల్‌ను సబ్‌ స్క్రైబ్‌ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్‌ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్‌ చేయడం మరిచిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *