హైకమాండ్ పిలుపుతో దిల్లీకి వెళ్లిన టీ కాంగ్రెస్ ముఖ్య నేతలు సోమవారం సాయంత్రం ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్తో సమావేశం అయ్యారు. సమావేశంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, జానా రెడ్డి తదితరలు పాల్గొన్నారు. రాజగోపాల్ రెడ్డి వ్యవహారంపై ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తుంది. అధిష్టానం దూతలుగా ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి సహా పలువురు నేతలు రాజగోపాల్ రెడ్డిని కలిసి బుజ్జగించే ప్రయత్నం చేశారు.
దిల్లీ వొచ్చి అగ్ర నేతలతో మాట్లాడాలని చెప్పారు. అయితే ఆయన మాత్రం అందుకు నిరాకరించారు. దిల్లీ వొచ్చే ప్రసక్తేలేదని, అవసరముంటే వారే తన వద్దకు వొచ్చి మాట్లాడాలని చెప్పారు. రాజగోపాల్ రెడ్డి పార్టీ మారనున్నారన్న ఊహాగానాల నేపథ్యంలో కాంగ్రెస్ హైకమాండ్ పార్టీ సీనియర్లను హస్తినకు రావాలని ఆదేశించగా వారు హుటాహుటిన హస్తినకు వెళ్లారు.




