– నిరుద్యోగులను మోసం చేసిన బీఆర్ ఎస్
– విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నారు
– కెసిఆర్ కుటుంబంలో మాత్రం అందరికీ ఉద్యోగాలు
– కాంగ్రెస్ వొచ్చాక 15 నెలల్లో 55 వేల ఉద్యోగాల భర్తీ
–బీఆర్ఎస్ నేతలను నిలదీయండి –ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
గత బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో ఆడుకుందని, ఉద్యోగాలు ఇవ్వకుండా అడ్డుకున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండిపడ్డారు. బుధవారం హైదరాబాద్లోని బాబూ జగ్జీవన్రామ్ భవన్లో ఎస్సీ గురుకులాల్లో టెన్త్, ఇంటర్ చదివి, ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఆయన బహుమతుల ప్రదానం చేశారు. అనంతరం మాట్లాడుతూ ఉన్నత శిఖరాలను చేర్చేది చదువు తప్ప కులం కాదన్నారు. గత ప్రభుత్వం తమ ఇంట్లో ఉద్యోగాలు వొస్తే చాలనే ధోరణిలో నిరుద్యోగులను మోసం చేసిందన్నారు. తమ ప్రభుత్వం హయాంలో మెరుగైన వైద్యం అందిస్తున్నామన్నారు. గతంలో కేసీఆర్ కుటుంబ సభ్యులకు మాత్రం ఉద్యోగాలొ చ్చాయ ని వ్యంగ్యంగా అన్నారు. తెలంగాణ వొస్తే, ఉద్యోగాలు వొస్తాయని భావించిన యువత ఆశలపై నీళ్లు చల్లారన్నారు. తన ఇంట్లో వాళ్లు ఒక చోట ఓడిపోతే మరోచోట పదవులు ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చుకున్నారు. ఈ ప్రభుత్వం ఏర్పడిన 15 నెలల్లోనే 55వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసింది.
ఇంకా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువత సంఖ్య లక్షల్లో ఉందన్నారు. గత పదేళ్లలో ఉద్యోగాల భర్తీకి ఎందుకు నోటిఫికేషన్లు ఇవ్వలేదంటూ బీఆర్ఎస్ నేతలను ఆయన నిలదీశారు. పీజీలు చేసిన విద్యార్థులు ఎంతో విలువైన కాలాన్ని కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. చదువుకున్న పిల్లలకు తాము ఉద్యోగాలు ఇస్తున్నామన్నారు. ఒక్క ఏడాదిలోనే 59 వేలకుపైగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని గుర్తు చేశారు. గత 15 ఏళ్లుగా గ్రూప్-1 పరీక్షలు నిర్వహించలేదన్నారు. తమ హయాంలో 563 గ్రూప్-1 పోస్టులు భర్తీ చేస్తున్నామని తెలిపారు. గ్రూప్-1లో 89శాతం పోస్టులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు దక్కాయని సీఎం రేవంత్ రెడ్డి ఉదహరించారు. ఈ రోజు అంటే బుధవారం తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి జయంతి అని గుర్తు చేశారు. వారి స్ఫూర్తిని కొనసాగించేందుకు తెలుగు యూనివర్సిటీకి వారి పేరు పెట్టుకున్నామన్నారు. కోఠీలోని మహిళా యూనివర్సిటీకి వీరనారి చాకలి ఐలమ్మ పేరు పెట్టుకున్నామన్నారు. ప్రజల కోసం పాటుపడిన వారే చరిత్రలో నిలిచిపోతారని ఆయన స్పష్టం చేశారు. కులం వల్ల ఎవరికీ గుర్తింపు రాలేదు. మంచి చదువుతోనే అందరికీ గుర్తింపు వచ్చిందని చెప్పారు. ఆత్మనూన్యత భావాన్ని వీడాలంటూ దళితులు, గిరిజనులు, బలహీనవర్గాలకు ఆయన పిలుపు నిచ్చారు.
వారిలోని ఆత్మనూన్యత భావాన్ని తొలగించేందుకే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు బర్రెలు, గొర్రెలు, చేపలు వంటి స్కీములు తెచ్చారని గుర్తు చేశారు. కానీ చదువు చెప్పి రాజ్యాధికారంలో భాగస్వాములను చేస్తామని ఎందుకు చెప్పలేదంటూ బీఆర్ఎస్ నేతలను నిలదీశారు. తాము మొదటి ఏడాదిలోనే 59 వేల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేశామని స్పష్టం చేశారు. మొదటి ఏడాదిలోనే ఇన్ని ఉద్యోగాలు భర్తీ చేసిన ఘనత తమ ప్రభుత్వానిదేనన్నారు. అంతేకాదు గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించి ఫలితాలు సైతం విడుదల చేశామన్నారు. కానీ నోటికాడి కూడును కింద పడేసినట్లు.. రాజకీయ కుట్రతో నియామక పత్రాలు ఇవ్వకుండా అడ్డుకున్నారని గత ప్రభుత్వ పెద్దలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్లలో గ్రూప్ 1 పరీక్షలు కూడా నిర్వహించని పార్టీలు కోర్టులో కేసులు వేసి అడ్డుకుంటున్నారన్నారు. అందుకే ఇది సామాజిక సమస్యగా మారుతోందన్నారు. మొదటి పాతికేళ్ల వయసు వరకు బాగా చదువుకుంటేనే జీవితంలో రాణిస్తారన్నారు. తప్పుదారి పడితే కన్న తల్లిదండ్రులు తలదించుకునే పరిస్థితి ఉంటుందని విద్యార్థులకు ఉద్బోధించారు. అలాంటి పరిస్థితులు ఎప్పుడూ తెచ్చుకోవద్దంటూ విద్యార్థులకు హితవు పలికారు.
కష్టపడండి.. ఆత్మవిశ్వాసంతో రాణించి తల్లిదండ్రులకే కాదు.. రాష్ట్రానికి గర్వకారణంగా నిలవాలని విద్యార్థులకు సూచించారు. వందేళ్ల ఉస్మానియా చరిత్రలో తొలిసారిగా దళితుడిని వైస్ చాన్స్లర్గా నియమించిన ఘనత తమ ప్రభుత్వానిదేనని గుర్తుచేశారు. విద్యా కమిషన్ చైర్మన్గా ఆకునూరి మురళిని నియమించామన్నారు. అలాగే అసెంబ్లీ స్పీకర్గా గడ్డం ప్రసాద్ కుమార్ను ప్రజా ప్రభుత్వంలో ఎంపిక చేసుకున్నామని వివరించారు. వీరందరికీ కేవలం కులం ప్రాతిపదికన గుర్తింపు రాలేదు. చదువుకున్నారు కాబట్టే వారికి ఈ గుర్తింపు వచ్చిందని విద్యార్థులకు సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. దేశ భవిష్యత్ తరగతి గదుల్లోనే ఉందన్నారు. అన్ని రంగాల్లో రాణించాలని మనస్పూర్తిగా తాను కోరుకుంటున్నానని తెలిపారు. సమాజంలో రుగ్మతలు, అసమానతలు తొలగించాలని ఈ సందర్భంగా విద్యార్థులకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్లు అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి అన్నారు. ఉన్నత శిఖరాలకు ఎదగాలంటే చదువుతోనే సాధ్యమవుతుంది. యంగ్ ఇండియా నా బ్రాండ్.. నా బ్రాండ్ అంబాసిడర్లు మీరేనన్నారు. కార్యక్రమంలో డిప్యూటి సిఎం మల్లు భట్టి విక్రమార్క తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు విద్యార్థులు ఏర్పాటు చేసిన చిత్రప్రద్శనను ముఖ్యమంత్రి ఆసక్తిగా తిలకించారు.




