నువ్వు ఒక్కటి తిడితే నేను నూరు తిడుతా..
ఈటల…నీ పరువు తీసుకోకు…
బిజెపి ఎంపి రాజేందర్పై టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పైర్
నేను రౌడీలకు రౌడీని…గుండాలకు గుండాను…మంచి వాళ్లకు మంచి వాడిని…మర్యాద ఇస్తే మర్యాద ఇస్తా…తిడితే తిడుతా అని…నువ్వు ఒకటి తిడితే నేను నూరు తిడుతాననీ టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి బిజెపికి చెందిన మల్కాజిగిరి పార్లమెంటు సభ్యుడు ఈటల రాజేందర్పై తనదైనశైలిలో విరుచుకుపడ్డారు. జగ్గారెడ్డి సోమవారం గాంధీభవన్లో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఈటల రాజేందర్ నస వ్యక్తి అని, ఆయన తెలిసి మాట్లాడుతున్నాడో, తెలియక మాట్లాడుతున్నాడో చెప్పాలన్నార. ఈటల రాజేందర్న్ను కాంగ్రెసోళ్లం తిట్టడం మొదలు పెడితే తట్టుకోలేడన్నారు. రాజేందర్ పర్సనాలిటీ పెద్దది అని ప్రజలు అనుకోవాలని మాట్లాడుతున్నట్లు ఉందనీ, నీకు నువ్వు ఫీల్ కావొద్దని రాజేందర్కు జగ్గారెడ్డి హితవు పలికారు. నేను కౌన్సిలర్ అయినప్పుడు ఈటల అ, ఆ, ఇ, ఈ లు చదువుకుంటున్నాడనీ, ఈటల రాజేందర్ నస రాజకీయ నాయకుడని అందుకే కేసీఆర్ పార్టీ నుంచి బయటకు వెళ్లగొట్టాడన్నారు. అగ్రరాజ్యం అమెరికా వొత్తిడిని కూడా డోంట్ కేర్ అని పాకిస్థాన్పై యుద్ధం చేసిన వీరనారి దివంగత ప్రధానమంత్రి ఇందిరా గాంధీ అని జగ్గారెడ్డి గుర్తు చేశారు. 1971లో పాకిస్తాన్-భారత్కి భయంకర యుద్ధం జరిగిందనీ, అప్పుడు ప్రధానిగా ఇందిరా గాంధీ తీసుకున్న నిర్ణయాలు .. ధైర్యాన్ని యావత్ ప్రపంచం మెచ్చుకుందన్నారు. ఇందిరా గాంధీ యుద్ధం చేసే సమయంలో కూడా ప్రతిపక్షంతో కూడా విమర్శలేకుండా చేశారన్నారు. దేశ ప్రజల ఆలోచనే ఫైనల్ అని యుద్ధం చేసి గెలిచారనీ, ఇప్పుడు జరుగుతున్న యుద్ధం కంటే ఇందిరాగాంధీ చేసిన యుద్ధం మీదనే ఎక్కువ చర్చ జరుగుతుందనీ, కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు రాహుల్గాంధీ నాయనమ్మ చరిత్ర ఇది అన్నారు. బిజెపి నేతలకు గాంధీ కుటుంబంపై ఏడుపులు ఎక్కువ… చేతలు తక్కువ అన్నారు. నేను 19 ఏండ్ల చిన్న వయసులోనే కౌన్సిలర్ అయ్యాననీ, అప్పుడు నువ్వు చదువు కుంటున్నావన్నారు. ఇప్పుడు నా పర్సనాలిటీ పెద్దది అని నీకు నువ్వు ఫీల్ ఐతే ఎట్లా..?అని ప్రశ్నించారు. నీ లెక్క హైబ్రిడ్ రాజకీయం కాదు.. నాది నాటు రాజకీయం అన్నారు. బిజెపిలో రాజకీయంగా నువ్వు చిన్నోడివి… కాంగ్రెస్ పార్టీ నీకు ముత్తాత అవుతుందన్నారు. రండ అంటే అర్థం చెప్పు…కాంగ్రెస్ పార్టీ జవాబు చెబుతుందన్నారు.ఈ మధ్య పాకిస్తాన్-ఇండియా మధ్య యుద్ధం జరుగుతుంటే… ఇందిరా గాంధీని అందరూ జ్ఞాపకం తెచ్చుకుంటున్నారనీ, రాజకీయాల••తీతంగా ఇందిరా గాంధీ నిర్ణయాలపై ఇప్పుడు చర్చ జరుగుతుందన్నారు. అమెరికా అప్పట్లో కూడా యుద్ధం ఆపాలని చూసింది. కానీ, ఇందిరాగాంధీ ఊరుకోలేదన్నారు. భారత దేశ ప్రజల నిర్ణయంలో తలదూర్చొద్దు అని బాహాటంగానే ఇందిరా గాంధీ చెప్పారన్నారు. తప్పని పరిస్థితిలో పాకిస్తాన్ ప్రధాని తల వొంచాడనీ, 1971లో ఇండియాకు పాకిస్తాన్ తలవొంచిందన్నారు. ఇందిరా గాంధీనీ అటల్ బిహార్ వాజ్పాయ్… అపరకాళీగా ప్రశంసించారన్నారు. పార్లమెంట్ లో రాజకీయాల••తీతంగా వాజ్పాయ్ ఇందిరా గాంధీని పొగిడారన్నారు. కులం, మతం కాదు అప్పుడు అందరూ ఆమెను అభినందించారన్నారు. ఇందిరా గాంధీ వొస్తున్నారు అంటే..మూడు రోజుల ముందే సభ పెట్టే స్థలంలో ప్రజలు ఉండే వారనీ, నేను చిన్నగా ఉన్నప్పుడు ఆర్ఎస్ఎస్ శాఖకు పోయేవాడిననీ, మా ఇంట్లో మా అమ్మ దుర్గా మాత ఫోటో పక్కన ఇందిరా గాంధీ ఫోటో పెట్టి పూజించేదన్నారు. ఇకముందు రేవంత్రెడ్డిని పల్లెత్తు మాట అన్నా, కాంగ్రెస్ పార్టీపై నోరు పారేసుకున్నా రాజేందర్ ప్రతి మాటకు కౌంటర్ ఇస్తామన్నారు. కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీ పెట్టకపోయి ఉంటే ఈటల రాజేందర్ ఎవరు అని నిలదీశారు. ఎవరి పుణ్యాన రాజేందర్ లీడర్ అయ్యాడనీ, నీకే అంత ఉంటే మాకు ఎంత ఉండాలన్నారు. ఇప్పటికైనా రాజేందర్ కంట్రోల్లో ఉండాలనీ, రాజేందర్ ఒక్క తిట్టు తిడితే మేము వంద తిడుతామన్నారు. మాట విషయంలో కంట్రోల్లో ఉండకపోతే పరిస్థితులు వేరుగా ఉంటాయన్నారు. బిజెపి నేతలు మాట్లాడే దానికి తోక, తొండం ఉండదన్నారు. బిజెపి నేతలు మాట్లాడడం ఎక్కువ, పనులు చేయడం తక్కువంగా ఉంటాయన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వొద్దంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి పార్టీ ప్రభుత్వం యుద్ధం ఎందుకు ఆపిందన్నారు. ఇక ఇక్కడితోనైనా అన్నీ ఆపేయాలనీ, లేదంటే నీ పరువు నువ్వే తీసుకుంటావని ఎంపి ఈటల రాజేందర్ను టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి హెచ్చరించారు



