తనను కలిసిన నేతలతో సీఎం రేవంత్
హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 2: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో తెలంగాణ జనసమితి(టీజేఎస్) బృందం బుధవారం భేటీ అయింది. పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం నేతృత్వంలో సీఎంను కలిసిన ఆ పార్టీ నేతలు ప్రజా సమస్యలు, ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చించారు. ఉద్యమకారులు, నిరుద్యోగులు, రైతుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్రజా సమస్యల పరిష్కారానికి జనసమితి సూచనలను స్వీకరించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని సీఎం స్పష్ఠం చేశారు. ఈ సందర్భంగా పలు ప్రజా సమస్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. సీఎంను కలిసిన వారిలో ఆ పార్టీ నేతలు అర్జున్, బద్రుద్దీన్, శ్రీనివాస్, శంకర్రావు, రమేష్ ముదిరాజ్, ఆశప్ప, సలీం, వినయ్ తదితరులు పాల్గొన్నారు.



