కరవ మంటే కప్పకు కష్టం. విడవమంటే పాముకు కష్టం. ఈ సామెత జన సామాన్యానికందరికీ తెలుసు. గోదావరి బనకచర్ల అనుసంధానం పథకం విషయంలో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం నేడు ఈ సంకటస్థితిలో పడింది. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఉన్నత స్థాయిలో ఇచ్చిన మాట ప్రకారం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పంపిన అభ్యర్థనపై అగమేఘాలపై కేంద్ర ప్రభుత్వ పర్యావరణ అంచనాల నిపుణుల కమిటీ సమావేశం కావడం, అనూహ్యంగా తెలంగాణా నుండి ప్రధానంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నుండి తీవ్ర ప్రతిఘటన వ్యక్తం కావడంతో కేంద్ర ప్రభుత్వం ఎటూ తోచని స్థితిలో పడింది . తుదకు కేంద్ర మంత్రి తెలంగాణ బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా రంగ ప్రవేశం చేయవలసి వచ్చింది. వాస్తవంలో బనకచర్ల వ్యతిరేకోద్యమాన్ని బిఆర్ఎస్ పార్టీ తొలుత మొదలు పెట్టింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు లో జరిగిన అవకతవకలపై ముప్పేట దాడి సాగిస్తున్న నేపథ్యంలో దాన్ని పక్క దారి పట్టించేందుకు బిఆర్ఎస్ పార్టీ గోదావరి బనకచర్ల అనుసంధానం ప్రముఖంగా తెర మీదకు తెచ్చింది. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పకనే చెప్పారు. జూన్ 20 వతేదీ ఢిల్లీలో పత్రికల వారితో మాట్లాడుతూ “మోదీ కి చంద్రబాబు నాయుడుకు సీట్లు కావాలి. మరో సారి గెలవడానికి బనకచర్ల ప్రాజెక్టు కావాలి. కెసిఆర్ తన పార్టీని బతికించుకోవడానికి ఈ వివాదం కావాలి.”అని అసలు రహస్యం విప్పారు.
అంతేకాదు. ఇంత వరకు ఎవరూ లేవనెత్తని మరో అంశం బహిర్గతం చేశారు. 2014 – 19 మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా గోదావరి పెన్నా అనుసంధానం గురించి పెద్ద హడావుడి చేశారు. 2016లోనూ 2018 లోనూ రెండు జీఓ లు జారీ చేశారు. మరి అప్పట్లో తెలంగాణాలో కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉండి ఎందుకు అభ్యంతరం లేవ నెత్త లేదని రేవంత్ రెడ్డి నిలదీశారు. వాస్తవంలో బిఆర్ఎస్ పార్టీ వద్దనే కాదు తెలంగాణ వైపు నుండి ఇందుకు సమాధానం లేదు. ఆ రోజుల్లో లేని అభ్యంతరం ఇప్పుడే ఎందుకు వచ్చింది? గతంలో కేసీఆర్ కూడా గోదావరి వరద జలాలు ఆంధ్ర ప్రదేశ్ వాడుకోవచ్చని చెప్పిన రుజువులు రేవంత్ రెడ్డి చూపారు కదా. గోదావరికి తెలంగాణ ఎగువ రాష్ట్రం. ఆంధ్ర ప్రదేశ్ దిగువ రాష్ట్రం. తెలంగాణ వాడుకోగా మిగిలితేనే ఆంధ్ర ప్రదేశ్ కు దక్కుతుంది. తాజాగా ఛత్తీస్ ఘడ్ ఇంద్రావతి పై ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం వద్ద అనుమతి పొందింది. ఇదే జరిగితే కింద వుండే తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ రెండు రాష్ట్రాలకు ఇబ్బందే. కాని ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. అయితే తెలంగాణ ఎందుకు అభ్యంతరం పెడుతోందో రేవంత్ రెడ్డి బయట పెట్టారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ట్రిబ్యునల్ కేటాయించిన 1486 టిఎంసి ల్లో వెయ్యి టిఎంసిలు ట్రిబ్యునల్ తో నిమిత్తం లేకుండా ఇవ్వడానికి ఆంధ్ర ప్రదేశ్ అంగీకరించితే తెలంగాణకు అభ్యంతరం లేదన్నారు. నికర జలాల్లో ఎక్కువ వాటా కోసం వరద జలాలకు అడ్డు చెప్పడం ఒకింత ఆశ్చర్యమే. ఇవన్నీ అటుంచి కేంద్ర ప్రభుత్వం గోదావరి కావేరి అనుసంధానం బొల్లాపల్లి నుండి ప్రారంభించుతుందనే సంకేతాలు వెలువడం కూడా తెలంగాణ అడ్డు చెప్పడానికి కారణంగా ఉంది. లేకుంటే హఠాత్తుగా ఇచ్చంపల్లి నుండి ప్రారంభించమనే ప్రతి పాదన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు తెస్తారు? ఇవీ కీలక మైన అంశాలు. గతంలో చంద్రబాబు నాయుడు ప్రతిపాదించిన గోదావరి పెన్నా అనుసంధానం ప్రాజెక్టుకు ప్రస్తుతం ప్రతి పాదిస్తున్న బనకచర్ల పథకానికి పెద్ద తేడా లేదు. కాకుంటే రాష్ట్ర విభజన చట్టం సెక్షన్ 46 మేరకు వెనుక బడిన రాయలసీమకు ప్రత్యేక పథకం కింద నిధులు పొందేందుకు బొల్లాపల్లి నుండి బనకచర్ల కు మరొక అనుసంధానం చేర్చబడింది. ఆ రోజుల్లో గోదావరి పెన్నా అనుసంధానానికి కేసీఆర్ అభ్యంతరం చెప్పలేదని బహిర్గతం చేయబోయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసలు తెలంగాణ వాదనలోని డొల్ల తనం బహిర్గతం చేశారు.
ఎటూ తేల్చుకోలేక కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం సంకటస్థితిలో పడినట్లే ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా నేడు ఇబ్బందికర పరిస్థితిలో చిక్కు కున్నారు. గతంలో తను గోదావరి పెన్నా అనుసంధానం ప్రకటించిన సమయంలో ఏలాంటి అడ్డంకి లేక పోవడం దృష్టిలో పెట్టుకొని లేదా కేంద్ర ప్రభుత్వం అనుకూలంగా వ్యవహరిస్తుందనే ధీమాతో కావచ్చు బనకచర్ల అనుసంధానానికి పెద్ద ఎత్తున ప్రచారం కల్పించారు. తీరా ఇప్పుడు డామిట్ కధ అడ్డం తిరిగింది. పైగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎవరికైతే గోదావరి వరద జలాలు ఇవ్వాలని ప్రస్తుతం గతంలో తను ప్రకటించిన పథకానికి అదనంగా బనకచర్ల అనుసంధానం చేర్చారో ఆ రాయలసీమలో ఎక్కువ మంది నేడు వ్యతిరేకిస్తున్నా ముఖ్యమంత్రి కి మరో గత్యంతరం లేక పోతోంది. బనకచర్ల అనుసంధానం పెడితేనే కేంద్ర ప్రభుత్వం నుండి ఎంతో కొంత నిధులు రాబట్టవచ్చు. లేకుంటే అసలుకే మోసం వస్తుంది. అందుకే తెలంగాణతో పోట్లాటకు కాకుండా ఇచ్చి పుచ్చుకొనే ధోరణి చంద్రబాబు నాయుడు వ్యక్తం చేస్తున్నారు.
బిఆర్ఎస్ పార్టీకి చెందిన మీడియా ఇచ్చిన వరస కథనాల కొనసాగింపుగా తెలంగాణ భవన్ లో పార్టీ నాయకులకు మాజీ మంత్రి హరీష్ రావు బనకచర్ల అనుసంధానం గురించి ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంలో కూడా చంద్రబాబు నాయుడు పైన విమర్శలు చేయడానికే ఎక్కువ సమయం కేటాయించి బనకచర్ల గురించి కేవలం ఒకే ఒక అంశం పేర్కొన్నారు భవిష్యత్తులో గోదావరి ట్రిబ్యునల్ వస్తే ఈ రోజు తీసుకొనే వరద జలాలను ఒక హక్కుగా కోరతారని మాత్రమే ఆరోపించారు. పైగా పోలవరం నుండి 80 టీఎంసీ లకు మించి కృష్ణ లో కలిస్తే ఆ నిష్పత్తిలో కృష్ణ జలాలు సాగర్ ఎగువ రాష్ట్రాలకు ఇవ్వ వలసి ఉన్న అంశం ప్రస్తావించారు. ఆంధ్ర ప్రదేశ్ గోదావరి వరద జలాలను తీసుకొంటే తెలంగాణ ఏ విధంగా నష్టపోతుందో వివరించక పోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనేమీ తక్కువ లేదని తెలియ జెప్పేందుకు అఖిలపక్ష సమావేశంతో పాటు దిల్లీ పర్యటన పెట్టుకొని కేంద్ర జల వనరుల శాఖ మంత్రిని కలిసి మెమోరాండం ఇవ్వడంతో బనకచర్ల ఎపిసోడ్ ప్రస్తుతం ఏకు మేకై కూర్చింది. గమనార్హమైన అంశమేమంటే తెలంగాణలో బనకచర్ల కు వ్యతిరేకంగా సాగే ప్రకటనలు వాగ్యుద్దాలు కన్నా రెండాకులు ఎక్కువగా రేవంత్ రెడ్డి బిఆర్ఎస్ బిజెపి నేతలు మధ్యనే ఎక్కువగా వాగ్వివాదాలు సాగుతున్నాయి. పరస్పరం దుమ్మెత్తి పోసుకుంటున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీని కేసీఆర్ ను లక్ష్యంగా చేసుకొని బనకచర్ల అనుసంధానం గురించి (అపెక్స్ కౌన్సిల్ సమావేశం విశేషాలు మినహాయించితే) పలు ఆరోపణలు చేశారు. ఇందులో కొన్ని వాస్తవాలకు భిన్నంగా ఉన్నాయి. 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి అన్ని విధాలా కెసిఆర్ అండదండలు ఇచ్చారు. చంద్రబాబు నాయుడును ఓడించితే తప్ప తన వ్యూహం ముందుకు సాగదని భావించి విజయం సాధించారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే శ్రీ శైలం జలాశయం వద్ద కేవలం 400 టియంసి ల లభ్యత మాత్రమే ఉందని గోదావరి నుండి 900 టిఎంసిలు తీసుకు వచ్చి కృష్ణ బేసిన్ లో రెండు రాష్ట్రాలు 1300 టిఎంసిలు వాడుకోవాలనే పథక రచన చేయించారు. రెండు రాష్ట్రాల ఇంజనీర్లు మూడు నాలుగు నెలల పాటు కసరత్తు చేశారు. ఆంధ్ర ప్రదేశ్ లో ఈ ప్రతిపాదన మీద వ్యతిరేకత వెల్లడైనా జగన్మోహన్ రెడ్డి మాత్రం వెనక్కి తగ్గలేదు.
కాని తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్లు కొందరు ఈ ప్రతిపాదన తెలంగాణకు లాభదాయకం కాదని కెసిఆర్ కు నచ్చ చెప్పడంతో కెసిఆర్ వెనక్కి తగ్గడంతో ఈ ప్రతిపాదన విరమింపబడింది. ఈ క్రమంలోనే కెసిఆర్ జగన్మోహన్ రెడ్డి పలుమార్లు విందు భోజనాలు ఆరగించారు.ఈ సందర్భంగా సుదీర్ఘ సంభాషణలు సాగించారు. ఇద్దరి మధ్య సుహృద్భావ సంబంధాలు వున్నా అంతర్ రాష్ట్ర జల వివాదాలను ఇచ్చి పుచ్చుకొనే ధోరణిలో పరిష్కారానికి పూనుకోలేదు. ఆంధ్ర ప్రదేశ్ తో అంతర్ రాష్ట్ర జల వివాదాలు కొనసాగుతుంటేనే తెలంగాణలో భావోద్వేగాలను పదిలంగా కాపాడుకోవచ్చునే వ్యూహాన్ని కెసిఆర్ అమలు జరిపారు.
కేసీఆర్ మరో వైపు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానించారు. కాంచీపురంలో దైవ దర్శనానికి వెళ్లి వస్తూ నగరిలో మాజీ మంత్రి రోజా ఇంట ఆతిథ్యం స్వీకరించుతూ ఆంధ్ర ప్రదేశ్ కు యువనేత ముఖ్యమంత్రిగా వచ్చాడని ఇద్దరం కలిసి రాయలసీమను బంగారు సీమ చేస్తామనడం జగన్మోహన్ రెడ్డిని పొగడటం అంతా కూడా పథకం మేరకు జరిగింది. తను చేపట్టే కొత్త సాగునీటి ప్రాజెక్టులు రీ ఇంజనీరింగ్ రీ డిజైన్ పేరుతో అమలు జరిపితే ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నుండి వ్యతిరేకత లేకుండా చేసుకోవడం వరకే తామిద్దరి మధ్య వున్న స్నేహ బంధాన్ని కెసిఆర్ పరిమితం చేశారు. ఫలితంగా తెలంగాణ చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డి లాంటి పలు పథకాలకు అపెక్స్ కౌన్సిల్ గండం తప్పింది. ఈ రోజు రేవంత్ రెడ్డి ఇవన్నీ తనకు తెలియదని చెబితే నమ్మేందుకు సిద్ధంగా ఎవరూ లేరు.
అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో జగన్మోహన్ రెడ్డి అడ్డు చెప్పి డీసెంట్ నోట్ పెట్టి వుంటే ట్రిబ్యునల్ నియామకం జరిగేది కాదు కదా! కెసిఆర్ ప్రతిపాదించిన గోదావరి శ్రీ శైలం జలాశయం అనుసంధానంపై ఆంధ్ర ప్రదేశ్ బాగా వ్యతిరేకత వ్యక్తమైన దశలో నవ్యాంధ్ర ప్రదేశ్ రిటైర్డ్ ఇంజనీరింగ్ అసోసియేషన్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డికి ఒక లేఖ రాశారు. గోదావరి బనకచర్ల అనుసంధానాన్ని అసోసియేషన్ ఆ లేఖలో ప్రతిపాదించినది. జగన్మోహన్ రెడ్డి హయాంలో సాగునీటి రంగం ప్రభుత్వ ప్రాధాన్యతల్లో లేక పోవడంతో ఈ ప్రతిపాదన పట్టించుకోబడలేదు. ఒక వేళ ఆనాడు జగన్మోహన్ రెడ్డి ఈ పథకంపై ఏమాత్రం వర్కవుట్ చేసి ఉంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముట్టుకొనే వారు కాదేమో.
ఎటూ తేల్చుకోలేక కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం సంకటస్థితిలో పడినట్లే ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా నేడు ఇబ్బందికర పరిస్థితిలో చిక్కు కున్నారు. గతంలో తను గోదావరి పెన్నా అనుసంధానం ప్రకటించిన సమయంలో ఏలాంటి అడ్డంకి లేక పోవడం దృష్టిలో పెట్టుకొని లేదా కేంద్ర ప్రభుత్వం అనుకూలంగా వ్యవహరిస్తుందనే ధీమాతో కావచ్చు బనకచర్ల అనుసంధానానికి పెద్ద ఎత్తున ప్రచారం కల్పించారు. తీరా ఇప్పుడు డామిట్ కధ అడ్డం తిరిగింది. పైగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎవరికైతే గోదావరి వరద జలాలు ఇవ్వాలని ప్రస్తుతం గతంలో తను ప్రకటించిన పథకానికి అదనంగా బనకచర్ల అనుసంధానం చేర్చారో ఆ రాయలసీమలో ఎక్కువ మంది నేడు వ్యతిరేకిస్తున్నా ముఖ్యమంత్రి కి మరో గత్యంతరం లేక పోతోంది. బనకచర్ల అనుసంధానం పెడితేనే కేంద్ర ప్రభుత్వం నుండి ఎంతో కొంత నిధులు రాబట్టవచ్చు. లేకుంటే అసలుకే మోసం వస్తుంది.
అందుకే తెలంగాణతో పోట్లాటకు కాకుండా ఇచ్చి పుచ్చుకొనే ధోరణి చంద్రబాబు నాయుడు వ్యక్తం చేస్తున్నారు . ఈ స్థితిలో శుభ పరిణామమేమంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఒక మెట్టు దిగి చంద్రబాబు నాయుడుతో చర్చలకు సిద్ధం కావడమే. అయితే బిఆర్ఎస్ ఏ మేరకు పొగ పెడుతుందో! గోదావరిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ట్రిబ్యునల్ కేటాయించిన 1486 టిఎంసి ల్లో రెండు రాష్ట్రాల వాటా గురించి తెలంగాణ గణాంకాలను ఆంధ్ర ప్రదేశ్ అంగీకరించడం లేదు. ఆంధ్ర ప్రదేశ్ చెప్పే లెక్కలను తెలంగాణ అంగీకరించడం లేదు. ఒక వేళ సంప్రదింపులు జరిగినా ఈ అంశంలో ఏకీభావం లేనపుడు ఎంత వరకు ఫల ప్రదమౌతుందో భవిష్యత్తులో తేలాలి. మరో చిక్కు ముడి లేక పోలేదు. కృష్ణలో 500 టిఎంసిలు గోదావరిలో వెయ్యి టిఎంసిలు డిమాండ్ ఆంధ్ర ప్రదేశ్ వైపు ఏ మాత్రం అంగీకారం కాక పోవచ్చు. ఇవన్నీ అటుంచి పోలవరం నుండి 80 టీఎంసీ లకు మించితే అదనపు జలాలను అదే నిష్పత్తిలో కృష్ణ జలాలను సాగర్ కు ఎగువ రాష్ట్రాలకు ఇవ్వాలని ట్రిబ్యునల్ తీర్పులో ఉంది . మాజీ మంత్రి హరీష్ రావు అప్పుడే గుర్తుచేశారు. దాని కొనసాగింపుగా తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్ల సంఘం 200 టీఎంసీ ల కృష్ణ జలాలకు టెండర్ పెట్టింది. ఈ మొత్తం ఎపిసోడ్ లో ఎవరు బకరాలు అవుతారో త్వరలో తేలనుంది.





