– లక్నవరం చెరువు కింద ప్రతీ ఎకరాకు నీరందిస్తాం
– మంత్రి దనసరి అనసూయ సీతక్క
గోవిందరావుపేట, ప్రజాతంత్ర, ఆగస్టు 1: లక్నవరం వద్ద పంట కాల్వలకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క శుక్రవారం నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొంతకాలంగా రైతులకు నాట్లు వేసుకోవడానికి నీటి కొరత ఉందని తెలుసుకుని ఇటీవల లక్నవరం సరస్సు తూముల మరమ్మతు పనుల అనంతరం నీటిని విడుదల చేశామన్నారు. ప్రస్తుతం లక్నవరం సరస్సు 28 అడుగుల నీటి మట్టం కలిగి ఉందని, మొత్తం 33 అడుగుల సామర్థ్యాన్ని సరస్సు కలిగి ఉందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర టిస్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, ములుగు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణితోపాటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా, బ్లాక్, మండల, గ్రామ నాయకులు రైతులు పాల్గొన్నారు.



