ఏషియన్ అసోసియేషన్ ఆఫ్ ఓపెన్ యూనివర్సిటీస్ (ఏఏఓయూ) కార్యనిర్వాహక సభ్యులుగా డా.బి.ఆర్. అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వైస్-ఛాన్సలర్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి ఎంపికయ్యారు. 2026-2028 కాలానికి కార్యనిర్వాహక సభ్యులుగా ఘంటా చక్రపాణి ని నియమిస్తూ ఏషియన్ అసోసియేషన్ ఆఫ్ ఓపెన్ యూనివర్సిటీస్ సెక్రటరీ జనరల్ ప్రొఫెసర్ రహమ్మత్ బుదిమాన్ అధికారిక సమాచారాన్ని పంపించారు. ఆసియా ఖండంలోని అన్ని ఓపెన్ యూనివర్సిటీ లు ఇందులో సభ్యులుగా ఉంటాయి. బీజింగ్లో ఇటీవల జరిగిన 2025 సంవత్సరపు సాధారణ సర్వ సభ్య సమావేశంలో ఏఏఓయూ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి మాట్లాడుతూ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఏఏఓయూకు కార్యనిర్వాహక సభ్యులుగా ఎంపిక కావడం తన బాధ్యతను మరింత పెంచిందన్నారు. తెలంగాణలో సార్వత్రిక విద్య గ్రామీణ ప్రాంతంలో మరింత విస్తరించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అందరికీ అందుబాటులో ఉన్నత విద్య ఉండేలా ప్రయత్నం చేస్తానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఘంటా చక్రపాణి ని రిజిస్ట్రార్ డా. ఎల్వీకే రెడ్డి, అకాడమిక్ డైరెక్టర్లు ప్రొఫెసర్ పుష్పా చక్రపాణి, ప్రొఫెసర్ రావీంద్రనాథ్ సోలమన్, రాణి రజిత మాధురి, తెలుగు ప్రొఫెసర్ ఎన్. రజని, భోజు శ్రీనివాస్, రమా దేవి, దయాకర్ స్టూడెంట్ సెల్ డైరెక్టర్ డాక్టర్ వై. వెంకటేశ్వర్లు, డాక్టర్ బర్ల మహేందర్ తదితరులు అభినందించారు.
ఏఏఓయూ కార్యనిర్వాహక సభ్యుడిగా వీసీ డా.చక్రపాణి





