– తమ ప్రభుత్వ హయాంలో శరవేగంగా పనులు
– మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 16: ఉప్పల్ రింగ్ రోడ్డు నుంచి నారపల్లి వరకు ఎనిమిది కిలోమీటర్ల మేరకు నిర్మిస్తున్న ఫ్లైఓవర్ పేనులు శరవేగంగా జరుగుతున్నాయని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.
ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డిలతో కలిసి ఫ్లైఓవర్ పనులను బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ యాదగిరిగుట్ట భువనగిరి-వరంగల్ హైవేపై దాదాపు ఎనిమిదేళ్ల క్రితం ప్రారంభించిన ఫ్లైఓవర్ పనులు ఆర్థిక వనరులు, ఇతర కారణాల వల్ల తీవ్ర జాప్యం జరిగిందన్నారు. తమ ప్రభుత్వం రాగానే ఫ్లైఓవర్పై ప్రత్యేక దృష్టి సారించి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సైతం చర్చలు జరిపి పనుల్లో వేగం పెంచామన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మొన్నటి వరకు పనులు నిర్వహించిన కాంట్రాక్టర్ను సైతం మార్చి కొత్తవారికి పనులు అప్పగించామని, ప్రత్యేక శ్రద్ధతో పనుల్లో వేగాన్ని పెంచి పరితగతిన పూర్తిచేస్తామని చెప్పారు. నగరంలో పివి ఎక్స్ప్రెస్ హైవే తర్వాత అతిపెద్ద ఫ్లైఓవర్ ఉప్పల్ ఫ్లైఓవర్ అవుతుందన్నారు. వచ్చే దసరా నాటికి ఫ్లైఓవర్ పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని మంత్రి కోమటిరెడ్డి చెప్పారు.



