-ఇద్దరు పంచాయతీ కార్యదర్శల సస్పెన్షన్
రంగారెడ్డి, ప్రజాతంత్ర, మార్చి 11: రంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ అమలులో అలసత్వం వహించిన అధికారులపై జిల్లా యంత్రాంగం కఠిన చర్యలు చేపట్టింది. విధి నిర్వహణలో నిర్లక్ష్యం, నిబంధనల ఉల్లంఘనను తీవ్రంగా పరిగణించిన జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి సంబంధిత సిబ్బందిపై వేటు వేశారు. ప్రజా పాలన కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో విజయవంతం చేయడంలో విఫలమైన ఇద్దరు పంచాయతీ కార్యదర్శులను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఫరూక్ నగర్ మండల పరిధిలోని బూర్గుల గ్రామ పంచాయతీ కార్యదర్శి ఎం.సరోజపై ఈ చర్యలు తీసుకున్నారు. పై అధికారుల నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండానే విధులకు గైర్హాజరు కావడం, కార్యాలయ రికార్డుల నిర్వహణలో అస్తవ్యస్తంగా వ్యవహరించడం ప్రధాన కారణాలుగా నిలిచాయి. ఇదే మండలంలోని కాశిరెడ్డిగూడ పంచాయతీ కార్యదర్శి కె.వాసవాచారి కూడా విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించారు. ప్రజా పాలన లక్ష్యాలను చేరుకోవడంలో విఫలమవ్వడం, రోజువారీ కార్యక్రమాలను నిర్లక్ష్యం చేయడంతో ఆయనపై కూడా వేటు పడింది. ఈ నెల 9న జిల్లా పంచాయతీ అధికారి (డిపివో) సురేష్ మోహన్ మండలంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. 99 రోజుల ప్రణాళికలో భాగంగా గ్రామాల్లో పనుల తీరును పరిశీలించిన ఆయన పలు లోపాలను గుర్తించి కలెక్టర్కు నివేదిక సమర్పించారు. ఈ నివేదిక ఆధారంగా క్రమశిక్షణ చర్యలు అమలయ్యాయి. కేవలం కార్యదర్శులనే కాక పర్యవేక్షణలో విఫలమైన ఉన్నతాధికారులను కూడా కలెక్టర్ వదలలేదు. మండలంలోని కార్యదర్శులకు దిశానిర్దేశ చేయడంలో విఫలమైన మండల పంచాయతీ అధికారి (ఎంపీవో) ఎం.జయంత్ రెడ్డికి ఛార్జ్ మెమో జారీ చేశారు. కందుకూరు మండలంలోని కందుకూరు, ముచ్చర్ల, కొత్తగూడ గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ అధ్వానంగా ఉన్నట్లు గుర్తించారు. ముఖ్యంగా తడి, పొడి చెత్త సేకరణలో నిర్లక్ష్యం వహించినందుకు కార్యదర్శులు ఇంద్రసేన రెడ్డి, శ్రీహరి, నరేందర్ గౌడ్లకు డీపీఓ షోకాజ్ నోటీసులు అందజేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.