– గిరిజన కెనో స్ప్రింట్ నేషనల్ ఛాంపియన్షిప్ ప్రారంభం
– క్రీడా వారసత్వ పరిరక్షణకు కట్టుబడి వున్నాం
– వెలుగులోకి గిరిజన యువతలో క్రీడా ప్రతిభ
– మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 28: గిరిజన విద్యార్థులు అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో రాణించాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పిలుపునిచ్చారు. మంగళవారం గిరిజన కెనో స్ప్రింట్ నేషనల్ ఛాంపియన్షిప్ క్రీడను ట్రైకార్డ్ చైర్మన్ బెల్లయ్య నాయక్, ఖానాపూర్ శాసనసభ్యులు వెద్మ బొజ్జు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ సబ్య సాచి ఘోష్, గురుకులాల సెక్రటరీ సీతాలక్ష్మి, జిల్లా కలెక్టర్ హరిచందన దాసరిలతో కలసి మంత్రి ప్రారంభించి క్రీడాలను తిలకించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన కెనో స్ప్రింట్ నేషనల్ ఛాంపియన్షిప్ – 2025” ను గిరిజన సాంస్కృతిక పరిశోధన శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో గిరిజన సంక్షేమ శాఖ పర్యవేక్షణలో తేదీ 28 నుండి 30 వరకు మూడు రోజుల పాటు హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్ లో నిర్వహించనున్నామని మంత్రి తెలిపారు. అంతర్జాతీ య స్థాయిలో ఈ క్రీడకు ఎంతో ప్రాధాన్యత ఉన్నదని అలాగే తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ మహానగరంలో ఈ క్రీడలు నిర్వహించటం పది రాష్ట్రాల పిల్లలు ఈ క్రీడలలో పాల్గొనటం ఎంతో సంతోషాన్నిస్తున్నదని మంత్రి తెలిపారు. గిరిజన యువత సాధికారతకు, వారి సంప్రదాయ క్రీడా వారసత్వ పరిరక్షణకు రాష్ట్రం కట్టుబడి ఉన్నదని, భగవాన్ బిర్సా ముండా ఆత్మస్ఫూర్తితో, గిరిజన సమాజం యొక్క ధైర్యం, ఐక్యత, సాంస్కృతిక ఔన్నత్యమును ప్రతిబింబించే వేదికగా ఈ క్రీడా ఉత్సవం నిలుస్తుందని అన్నారు. ఈ తరహా క్రీడల ద్వారా గిరిజన ప్రాంతాల నుండి క్రీడా ప్రతిభను వెలికితీసి, వారికి జాతీయ స్థాయిలో ప్రోత్సాహం అందిస్తూ నీటి క్రీడల కేంద్రముగా అభివృద్ధి చేయడమే లక్ష్యమని అన్నారు. ఈ జాతీయ స్థాయి క్రీడా మహోత్సవం భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి పురస్కరించుకొని జన జాతీయ గౌరవ వర్ష్ (జేజేజీవీ) లో భాగంగా, భారత ప్రభుత్వ గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖ మార్గదర్శకత్వంలో చేపట్టామన్నారు. ట్రై కార్ చైర్మన్ బెల్లయ్య నాయక్ మాట్లాడుతూ గిరిజన విద్యార్థులకు క్రీడల్లో ప్రత్యేక తర్ఫీద్ అందించి వారు ఎంచుకున్న క్రీడల్లో రాణించే విధంగా కోచ్ లు ప్రత్యేక కృషి చేయాలన్నారు. అదేవిధంగా ఖానాపుర్ శాసనసభ్యులు వెధ్మ బొజ్జు మాట్లాడుతూ కేనో స్ప్రింట్ నేషనల్ ఛాంపియన్షిప్ క్రీడలు నిర్వహించటం గర్వించదగ్గ విషయమని గిరిజన పిల్లలకు ప్రత్యేక మెళకువలు అందిస్తే అంతర్జాతీయ స్థాయిలో రాణించవచ్చన్నారు. స్పెషల్ చీఫ్ సెక్రటరీ సభ్యసాచి ఘోష్ మాట్లాడుతూ గిరిజన యువతలో క్రీడాస్ఫూర్తి, ఐక్యతను అలాగే జాతీయ గౌరవాన్ని పెంపొందిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. క్రీడలలో ప్రాక్టీస్ పెర్ఫార్మన్స్ ఎంతో అవసరం అని క్రీడలకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇవ్వటంతో గిరిజన పిల్లలు అనేక క్రీడల్లో దేశ అంతర్జాతీయ స్థాయిలో రాణించనున్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. జిల్లా కలెక్టర్ హరి చందన దాసరి మాట్లాడుతూ గిరిజన విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన తోపాటు, పాఠశాలలో కళాశాలలో మౌలిక వసతులు కల్పించడం జరిగిందనఅన్నారు. ఈ దిశగా అంతర్జాతీయ ప్రమాణాలతో క్రీడాభివృద్ధికి కృషి చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ సముజ్వాల, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





