అంబేడ్కర్‌పై అనుచిత వ్యాఖ్యలకు టిజెఎస్‌ ఆందోళన

ప్రజలకు అమిత్‌ షా క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 19 :  డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌పై కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా నిరసిస్తూ టిజెఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యాలయం వద్ద ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అమిత్‌ షా దిష్టిబొమ్మను దహనం చేసి, ఆయన చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో టిజెఎస్‌ గ్రేటర్‌ హైదరాబాద్‌ కమిటీ అధ్యక్షుడు ఎం.నర్సయ్య మాట్లాడుతూ, ‘‘డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ భారత రాజ్యాంగ శిల్పి మాత్రమే కాకుండా, దేశ సమానత్వ స్ఫూర్తికి ప్రతీక. దేశ ప్రజలు ఎప్పటికీ ఆయన సేవలను గౌరవంతో స్మరించుకుంటారు. అంబేడ్కర్‌ పై అమిత్‌ షా చేసిన వ్యాఖ్యలు అగ్ర కుల దురహంకారాన్ని ప్రదర్శిస్తూ, సబ్బండ వర్ణాలను అవమానించేలా ఉన్నాయి.

వెంటనే అమిత్‌ షా బహిరంగంగా క్షమాపణ చెప్పాలని, ఆయనను హోం మంత్రి పదవి నుంచి తప్పించాలని డిమాండ్‌ చేస్తున్నామని పేర్కొన్నారు. టిజెఎస్‌ నాయకుడు సర్దార్‌ వినోద్‌ కుమార్‌ మాట్లాడుతూ, ‘‘అణగారిన వర్గాల హక్కుల కోసం తన జీవితాన్ని అర్పించిన మహానేత అంబేడ్కర్‌ గురించి అమిత్‌ షా చేసిన అనుచిత వ్యాఖ్యలు భారత ప్రజల మనోభావాలను దెబ్బతీశాయన్నారు.  ఇది మానవ సమానత్వానికి, రాజ్యాంగ విలువలకు వ్యతిరేకంగా ఉంది. వెంటనే ఆయన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని జాతికి క్షమాపణ చెప్పాలని, హోంమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో టిజెఎస్‌ నాయకులు బట్టల రాంచందర్‌, మనేపల్లి లక్ష్మణ్‌, పుష్పానీల గౌడ్‌, జైపాల్‌ రెడ్డి, హన్మంతు గౌడ్‌, రంజిత్‌ కుమార్‌, మాణిక్యం, భాస్కర్‌, భూషణ్‌, సురేష్‌ కుమార్‌, సయ్యద్‌ అబ్రార్‌, కృష్ణ, రమణ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page