– కేవలం అవినీతిని వెలికి తీసేపనిలో కమిషన్
– విచారణకు కె.సి.ఆర్. హాజరు కావాలి
– ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్
రాజకీయ కక్షతో కాదు, కేవలం అవినీతికి బాధ్యులను వెలికితీసే ఉద్దేశంతోనే కాళేశ్వరంపై విచారణ జరుగుతోందని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ స్పష్టం చేశారు. సామాజిక న్యాయానికి పెద్దపీట వేసే పార్టీ కాంగ్రెస్లో వివక్షకు అవకాశం లేదు. వివేక్, వంశీలపై ఎలాంటి వివక్ష లేదని పేర్కొన్నారు.తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్ట్పై జరుగుతున్న వివాదాల నేపథ్యంలో తాజాగా ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరంలో తప్పులు జరిగాయనే కారణంతోనే కమిషన్ కొంత సమయం తీసుకుని నివేదిక రూపొందించిందని ఆయన అన్నారు. కాళేశ్వరం విచారణలో కేసీఆర్, ఈటల, హరీష్ రావులపై ఘోష్ కమిషన్ నోటీసులు జారీ చేయడం ముఖ్యమైన పరిణామంగా పేర్కొన్నారు.
కాళేశ్వరంలో తప్పు జరిగిన విషయాన్ని కమిషన్ తేల్చిందని తెలిపారు. విచారణ కమిషన్ ను శంకించాల్సిన అవసరం లేదు, సాంకేతిక సమాచారం కోసం ఆలస్యం జరిగిందని అన్నారు. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా సరే, శిక్ష తప్పదని.. కేసీఆర్ అమెరికా పారిపోవాలని చూస్తున్నట్టున్నారని వ్యాఖ్యానించారు. అలాంటి పని చేయొద్దని హెచ్చరించారు.
నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల్లో ఒక్క పిల్లర్ అయినా కూలిందా? కానీ కన్నెపల్లె పంపు హౌస్ ఎందుకు మునిగిందని నిలదీశారు.మరోవైపు ఈటలను బీజేపీలోకి కావాలనే పంపించారా కేసీఆర్? బీఆర్ఎస్ లో అక్రమాలు చేసిన తర్వాతే ఆయన పార్టీ మారారన్న అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు సీల్డ్ కవర్ కోసం వెయిటింగ్లో ఉన్నారని ఎద్దేవా చేశారు.



