గోలకొండ కేంద్రంగా కుతుబుషాహీలు ఇప్పటి తెలంగాణ, ఆంధ్రా, కర్నాటక, ఒరిస్సా, తమిళనాడు తదితర ప్రదేశాలను పాలించారు. వీరి పాలన 1518లో ప్రారంభమై 1687లో ఔరంగజేబు దాడితో ముగిసింది. కుతుబుషాహీల పాలనలోనే ఇక్కడి గనుల నుంచి కోహినూరు వజ్రాన్ని వెలికి తీశారు. అలాగే సాహిత్య, కళా రంగాకు కుతుబ్షాహీ రాజులు చేసిన సేవ ప్రసిద్ధమయింది. హైదరాబాద్ నగర నిర్మాతలైన ఈ పాలకులు ఉర్దూ, పర్షియన్, సంస్కృతంతో పాటు తెలుగు సాహిత్యాన్ని స్వయంగా సృజించారు. అంతకుమించి పోషించారు. కుతుబుషాహీ రాజుల్లో నాలుగోవాడైన ఇబ్రహీం కుతుబ్షా వలీ 1550 నుంచి 1580 వరకు పాలన జేసిండు. తెలుగు సాహిత్యానికి ఈయన చేసిన సేవలను గుర్తిస్తూ కవులీతణ్ణి ‘మల్కిభరాముడి’గా కీర్తించినారు. కుతుబుషాహీల కాలంలోనే పొన్నగంటి తెలగన్న తొలి అచ్చ తెలుగు కావ్యాన్ని ‘యయాతి చరిత్ర’ పేరిట నిర్మించిండు. అద్దంకి గంగాధర కవి – తపతీ సంవరణోపాఖ్యానాన్ని, సారంగు తమ్మయ్య – వైజయంతీ విలాసము అనే ప్రబంధాలను సృజించిండ్రు. కంచర్ల గోపన్న ‘దాశరథి శతకము’ని వెలువరించిండు. క్షేత్రయ్య గోలకొండ కోటలో తన సాహితీ పాండిత్యాన్ని ప్రదర్శించిండు.
మరింగంటి కవులు రచనలు చేసిండ్రు. వీళ్లే గాకుండా చరిగొండ ధర్మన్న, కామినేని మల్లారెడ్డి, నేబతి కృష్ణమంత్రి, పోశెట్టి లింగకవి, చిత్రకవి పెద్దన, గంగాధరయ్య, శంకరకవి, గణేశ్వర కవి, సిద్ధరామకవి, ఎనుములపల్లి పెద్దనామాత్యుడు, మారేపల్లి వెంకటనర్సయ్య, కందుకూరి రుద్రకవి, పైడిమర్రి వేంకటపతి (ముంగిలి: సుంకిరెడ్డి నారాయణరెడ్డి) తదితర అనేక మంది కవులు కుతుబుషాహీల పాలనలో సాహితీ సృజన చేసిండ్రు. కుతుబ్షాహీల సాహిత్య సేవ గురించి సురవరం ప్రతాపరెడ్డి, ఆదిరాజు వీరభద్రరావు, బిరుదురాజు రామరాజు, బి.ఎన్.శాస్త్రి, సుంకిరెడ్డి నారాయణరెడ్డి తదితరులు రాసిండ్రు. అయితే ఇంతమంది చరిత్రకారుల దృష్టిని తప్పించుకున్న కవి పండితుడు కుముద. ఈయన గురించి ఇప్పుడు చర్చించుకుందాం.కుముద పేరుగల ఈ బ్రాహ్మణ పండితుడు గోలకొండ నవాబుల సంస్థానంలో ఉన్నాడు. ఈయన రచనల గురించి మాత్రం ఇప్పటివరకు ఎక్కడా సరియైన సమాచారం లభించడం లేదు. ఆయన ప్రతిభాపాటవాలు పేర్కొనడానికి ఒక్క పద్యం కూడా దొరకలేదు. తొలిసారిగా ఈయన గురించి 1945లో మద్రాసు విశ్వవిద్యాలయ సంస్కృత ఆచార్యులు వి.రాఘవన్ ‘Kumuda, an unknown Telugu poet ?’ అని ఒక వ్యాసం రాశారు. (ఆంధ్రా హిస్టారికల్ రీసెర్చ్ జర్నల్).
పాండిచ్చేరిలో ఫ్రెంచ్ అధికారి డూప్లెక్స్ దగ్గర దుబాసిగా పనిచేసిన యాదవ సామాజిక వర్గానికి చెందిన ఆనందరంగ పిళ్లై (1709-1761) ఆస్థాన కవి కస్తూరి రంగయ్య. ఈయన ఆనంద రంగరాట్ఛందముతో పాటు సాంబ నిఘంటువు, కృష్ణార్జున చరిత్రము, పద్మనాయక చరిత్రము తదితర రచనలు చేసిండు. ‘లక్ష్మణ చూడామణి’ అనే మారు పేరుగల ఈ లక్షణ గ్రంథము ఆనందరంగరాట్ఛందముకు కస్తూరి రంగయ్య పీఠిక రాస్తూ ఈ కుముద కవి గురించి రాసిండు. ఈ గ్రంథాన్ని వావిళ్లవారు మొదటి సారిగా 1922లో వెలువరించారు. ఇందులో ఆనంద రంగ పిళ్ళై పూర్వీకుడైన (ఆరుతరాల ముందటివాడు) గర్భధారక అనే వితరణశీలి దానశీలతను తెలుసుకున్న గోలకొండ సంస్థానంలోని కుముదతో పాటు మొత్తం ఎనిమిది మంది కవులు అయనవరం బయలుదేరిండ్రు. ఈ అయనవరం ఇప్పటి చెన్నయ్ నగరానికి శివారు గ్రామం. అయనవరం చేరుకున్న కుముద అతని సహచరులైన మరో ఏడు మంది కవులకు అక్కడ కళ్లంలో వడ్లగింజలు ఏరుకుంటున్న గర్భధారకుడు కనిపించారు.
దాంతో తామెంతో ఆశతో భూరి విరాళాలు ఆశించి అయనవరం వస్తే ఇక్కడ అతను పరిగె ఏరుకునే పిసినారిలాగా కనిపించే సరికి అవాక్కయ్యారు. అయినప్పటికీ దానం ఆశించి రావడంతో సంయమనంతో ఉండి పరిగెలో గింజలు ఏరుకున్న గర్భధారకుడిని కలిశారు. దీంతో గర్భధారకుడు గోలకొండ నుంచి వచ్చిన పండితులకు షడ్రసోపేతమైన విందు ఏర్పాటు చేయడమే గాకుండా భోజనానంతరం వారికి ధనకనకవస్తు వాహనాది సమస్త దానాలు యిచ్చి మెప్పించాడు. వారితో గర్భధారకుడు మాట్లాడుతూ కళ్లంలో గింజలు ఏరుకుంటున్న నన్ను చూసి మీరు విస్మయం చెంది ఉంటారు. నిజానికి నాకు ప్రతి గింజా ఒక మణితో సమానమని అందుకే తాను వాటిని ఏరినాను అని జవాబిచ్చాడు. దీని ద్వారా ఆయన వ్యవసాయానికి ఇచ్చే ప్రాధాన్యత, రైతులకిచ్చే గౌరవం అర్థమయితుంది.
గర్భధారకుడి నుంచి దానాలు స్వీకరించిన కుముద బృందం తిరిగి గోలకొండకు చేరుకొని అప్పటి నవాబు బహుశా ఇబ్రహీం కుతుబ్షాకు (1550 ప్రాంతం) గర్భధారకుడి దానగుణాన్ని గురించి గొప్పగా చెప్పారు. దాంతో నవాబు ఆయన దానశీలతకు మెచ్చి తన ఆస్థానానికి అతణ్ణి రప్పించి, ఉచిత రీతిన సత్కరించి ఇప్పటి చెన్నయ్ని ఆనుకొని ఉన్నటువంటి వేత్రపుర (పెరంబూరు)ని జాగీరు గ్రామంగా గర్భధారకుడికి రాసిచ్చాడు. ఇది మొదలు గర్భధారకుడి కుటుంబం ఆ జాగీరు గ్రామాన్ని పెంచి పోషించారు. ఈ గర్భధారకుడి కుటుంబంలో ఆరోతరానికి చెందిన వాడు ఆనందరంగ పిళ్ళై. ఈయన గురించి కస్తూరి రంగయ్య తన ఆనందరంగరాట్ఛందము పీఠికలో రాయగా, సంస్కృతములో శ్రీనివాస అనే పండితుడు 1752లో చంపూ కావ్యాన్ని రాసిండు. అట్లాగే ఆనందరంగ పిళ్ళై రాసిన డైరీలు కూడా ఆనాటి చరిత్రకుపకరించే విలువైన పరికరాలు.
ఆనందరంగరాట్ఛందములో కస్తూరి రంగయ్య రాసిన పద్యాల వివరాలు చూసినట్లయితే ఈ కుముద గురించి తెలుస్తుంది. 1922లో అచ్చయిన ఈ గ్రంథంలోని పీఠికలో ఇట్లా రాసి ఉంది.
ఆనందరంగరాట్ఛందములో కస్తూరి రంగయ్య రాసిన పద్యాల వివరాలు చూసినట్లయితే ఈ కుముద గురించి తెలుస్తుంది. 1922లో అచ్చయిన ఈ గ్రంథంలోని పీఠికలో ఇట్లా రాసి ఉంది.
‘‘క. నెరయోధ తదీయ కళా
ధరునకుఁ గౌముదికి గర్భదారకుఁడనఁగా
వరపుత్రుఁడొకడు పుట్టెను
గరికఅభముఠీవి బలవికాస ప్రౌడిన్
ధరునకుఁ గౌముదికి గర్భదారకుఁడనఁగా
వరపుత్రుఁడొకడు పుట్టెను
గరికఅభముఠీవి బలవికాస ప్రౌడిన్
వ. అతఁడు దినదిన ప్రవర్ధామానుండై నిఖిల విద్యానిధానుండై వదాన్య గుణ విభాస మానుండై యయనగరము పాలించుచుండెఁ దదీయ కీర్తి నిఖిల దేశంబుల నిండి మెండు కొనినం జూచి కుముదుండు మొదలగు గల కవి దిగ్గజంబు లెనమండ్రు గోలకొండ నుండి వెలువడి యాగర్భదారక నృపాలుని రాజధాని యైన యయనపురంబుఁ జేరి నగరి వాకిట వచ్చునెడ నందు వడ్ల కణజంబు ముందఱఁ జిందియున్న ధాన్య బేర్పఱించు నేర్పరియే గర్భదారకుండని యచ్చటి వారలచే నెఱింగి యిట్టి వాఁడు మనకేమి త్యాగమీయఁబోయెడి నెందుకు వచ్చితిమని మంతనంబునం గొంత చింతించి యంతలో నిసుమంత దిటవు దెచ్చుకొని యతని చెంతంజేరి యాశీర్వదించిన రాజన్యమూర్ధన్యుండు వారి యంతరంగం బెఱిగి చిఱునవ్వు నవ్వుచు యవ్విద్వన్నికరంబును దన యతఃపురంబునకుం దోడ్కొని పోయి రంగలరారు బంగారె పళ్లెంబులఁజిరత్నంబు అగు నవరత్నంబులుంచి వేఱు వేఱ వడ్డించి భుజియింపుఁడని యుపచరించిన నయ్యర్థు అతని సమర్ధతకు హెచ్చుగా మెచ్చినం జూచి యనంతరంబ షడ్రసోపేతంబుగా భోజనంబుఁ జేయించి వలయు ధనకనకవస్తువాహనభూషణాంబ రంబులు బహుమతు లొసంగి యెసంగిన ప్రేమకు వీడ్కొలిపలిన వారలుప్పొంగి.
సీ. శిబినృపాలుఁడు ఘన శ్రీమంతుఁడైయుండి
తూఁచి యిచ్చిన యట్టికోఁచఁదనము
వైరోచనుఁడు చక్రవర్తియై యుండియుఁ
గొలిచి యిచ్చిన యట్టి పలుచఁదనము
పుడమిలోధారధరుఁడు ఘనుఁడైయుండి
మొలులునెట్టటయిచ్చు ములుచఁదనము
నెరదాత యనుపేరఁబరఁగి రాధేయుండు
బదులుకు బదులిచ్చు పరుసుఁదనముతే. సారె నిందించి నీకీర్తి సన్నుతించు
వారికిని వారి… యవ్వారిగాను
ధన మొసంగెడుదాతల దాత వీవె
ప్రకటగుణశీల గర్భదారక నృపాల
తూఁచి యిచ్చిన యట్టికోఁచఁదనము
వైరోచనుఁడు చక్రవర్తియై యుండియుఁ
గొలిచి యిచ్చిన యట్టి పలుచఁదనము
పుడమిలోధారధరుఁడు ఘనుఁడైయుండి
మొలులునెట్టటయిచ్చు ములుచఁదనము
నెరదాత యనుపేరఁబరఁగి రాధేయుండు
బదులుకు బదులిచ్చు పరుసుఁదనముతే. సారె నిందించి నీకీర్తి సన్నుతించు
వారికిని వారి… యవ్వారిగాను
ధన మొసంగెడుదాతల దాత వీవె
ప్రకటగుణశీల గర్భదారక నృపాల
చ. ఇక నినువంటి దాత గలఁడే త్రిజగంబులలోన నెననఁగా
సకలగుణాభిరామ యని సారెకు సన్నుతిఁజేసి గోలకొం
డకుఁ జని గర్భదారకు గాణాతిశయంబుల నెల్ల మేలు త
ప్పక మకరాంక భూపతికిఁ బల్కిన నాతఁడు సంతసింపుచున్’’
ఈ పద్యాలు గర్భధారకుడి దగ్గరికి కుముద సంభావన ఆశించి వచ్చిన విషయం రికార్డయింది. అలాగే ఇక్కడ మకరాంక భూపతి అంటే గోలకొండ నవాబుల చిహ్నం చేపముద్ర. దాన్ని ధరించిన నవాబు గురించి ఇక్కడ పేర్కొన్నాడు. గర్భధారకుడికి వేత్రపురము (పెరంబూరు- ఇది కూడా చెన్నయ్ శివారు గ్రామం) దానంగా ఇవ్వడాన్ని ఈ క్రింది పద్యం ద్వారా తెలుసుకోవచ్చు.తే. గర్భదారకు బిలిపించి గారవించి
ఛత్రపతి యను పేరును వేత్రపురము
కోటి రాజ్యంబు రథరథ్య పంజరములు
సన్నుతు లొసంగి పనుప నుత్సాహలీల
ఛత్రపతి యను పేరును వేత్రపురము
కోటి రాజ్యంబు రథరథ్య పంజరములు
సన్నుతు లొసంగి పనుప నుత్సాహలీల
ఉ. వేత్రపురంబుఁ జేరి కడు వేడుక మీఱఁగ దానధర్మముల్
పాత్ర మెఱింగి సేయుచు నపారయశంబును గాంచి యెంతయుం
బుత్రులు లేమి డెందమునఁ బ్రొక్కుచు నుండెడు గర్భదారక
చ్ఛత్రపతిక్షమాపతికి సారసనేత్రు దయాసగ్రతన్
క. శ్రీలక్ష్మమాంబయం(దలి)దును
కోల యనరనాథశౌరి సూనృత భాషా
శీలుఁడు వడనుల ధరణీ
పాలుఁడు దిరుమల విభుండుఁ బ్రభవించి రొగిన్
ఈ గర్భధారకుడికి వేత్రపుర ప్రాంతాన్ని జాగీరుగా ఇవ్వడమే గాకుండా ‘ఛత్రపతి’ అని బిరుదుని కూడా ఇచ్చారు. ఈ పద్యాల ద్వారా కుముద అనే బ్రాహ్మణ పండితుడి గురించి మాత్రమే గాకుండా గర్భధారకుడు అనే వితరణశీలి గురించి, వీరందరికి మించిన దానశీలి గోలకొండ నవాబు ఇబ్రహీం కుతుబ్షా గురించి కూడా తెలుస్తుంది.
ఇప్పటికైనా గోలకొండ నవాబులు, వారి ఆస్థాన పండితులు, వారు సృజించిన సాహిత్యం గురించి లోతైన అధ్యయనం జరగాల్సిన అవసరమున్నది. ఒక్క కుముద గురించే కాదు. గోలకొండ నవాబుల ఆస్థానంలో క్షేత్రయ్యతో సాహితీ వాదన చేసిన తులసీమూర్తి, గణనాథుడి గురించి కూడా సాహిత్యంలో పెద్దగా రికార్డు కాలేదు. అట్లాగే గోలకొండలోనే తెలుగులో శృంగార మంజరి గ్రంథాన్ని రాసి సంస్కృతంలోకి తర్జుమా చేసిన అక్బర్షా గురించి కూడా అందరికీ తెలియాల్సిన అవసరమున్నది. అందుకు అకాడెమీలు, అకడెమీషియన్స్, స్కాలర్స్ కృషి చేయాలి.
– డా. సంగిశెట్టి శ్రీనివాస్
– డా. సంగిశెట్టి శ్రీనివాస్