- ఖమ్మం జిల్లాలో 9326 ఇందిరమ్మ ఇళ్ల మంజూరు
- భూభారతితో భూ సమస్యలు పరిష్కారం
- పేద ప్రజలకు సన్నబియ్యం సరఫరా
- జిల్లాలో 5298 కుటుంబాలకు రేషన్ కార్డుల జారీ
- మహిళల ఎదుగుదల కోసం ఇందిరా మహిళా శక్తి
- మాపాప-మా ఇంటి మణిదీపం కార్యక్రమంపై కలెక్టర్కు ప్రశంసలు
- ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క
ఖమ్మంటౌన్,జూన్2, ప్రజాతంత్ర : పేదల సంక్షేమం, ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పన లక్ష్యంగా ప్రజా పాలన అందిస్తున్నామని డిప్యూటీ ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka ) అన్నారు. సోమవారం ఖమ్మంలో నిర్వహించిన రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గోన్నారు. ఉదయం ముఖ్య అతిథి అమర వీరుల స్థూపం వద్ద నివాళులర్పించిన అనంతరం పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో పోలీసు గౌరవవందనం స్వీకరించి జాతీయ పతాకావిష్కరణ చేసి తన సందేశాన్ని ప్రజలకు తెలియజేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని, భారత దేశంలోనే, ప్రపంచ స్థాయిలో అగ్రస్థానంలో నిలిపేందుకు గౌరవ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రైజింగ్ –2047 విజన్ తో ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందనీ, పేదల సంక్షేమం, సమగ్ర పాలసీల రూపకల్పన, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాల అభివృద్ధి, పారదర్శక సుపరి పాలన లక్ష్యాలుగా తెలంగాణ రైజింగ్ –2047 విజన్ పాలసీ రూపోందించా మన్నారు. ఈ లక్ష్యాల సాధనకు ప్రభుత్వం ఇప్పటికే వెల్ఫేర్ అండ్ సోషల్ జస్టిస్ పాలసీ, గ్రీన్ ఎనర్జీ పాలసీ, ఇన్ఫ్రా అండ్ ఇండస్ట్రియల్ పాలసీ, టూరిజం పాలసీలను సిద్ధం చేసిందని అన్నారు.తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను ప్రక్షాళన చేసి, గ్రూప్ పరీక్షలు విజయ వంతంగా నిర్వహించామని, నిరుద్యోగ యువతకు భవిష్యత్తుపై ఆశలను కల్పిస్తూ ఏడాది కాలంలోనే 55 వేలకు పైగా ప్రభుత్వ ఖాళీలను భర్తీ చేసి నియామక పత్రాలను అందజేశామని తెలిపారు.
భవిష్యత్తు తరాలకు స్వచ్ఛమైన పర్యావరణహిత ఇంధనాన్ని అందుబాటులో ఉంచాలనే ఉద్దేశంతో ప్రభుత్వం తెలంగాణ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ 2025 ను రూపొందించిందని, ఇందులో భాగంగా 2030 నాటికి 20 వేల మెగావాట్ల సామర్ధ్యం కలిగిన పునరుత్పాదక ఇంధన వనరుల ఆధారిత విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.ఆడబిడ్డలు ఆనందంగా ఉన్న ఇంట మహాలక్ష్మి తాండవిస్తుందనీ, ప్రభుత్వం మహాలక్ష్మి పథకం ప్రవేశపెట్టి మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించిందనని, దీని ద్వారా జిల్లాలో ఇప్పటి వరకు మహిళలకు రూ.167. 89 కోట్లు ఆదా అయ్యాయని అన్నారు. గ్యాస్ సిలిండర్ ను సబ్సిడీ పై 500 రూపాయలకే ప్రజా ప్రభుత్వం సరఫరా చేస్తున్నదనీ, ఖమ్మం జిల్లాలో ఇప్పటి వరకు 242146 కుటుంబాలకు గ్యాస్ సిలిండర్లను సబ్సీడిపై సరఫరా చేసి సంబంధిత లబ్దిదారుల బ్యాంక్ ఖాతాలలో రూ.26.30 కోట్లు సబ్సీడీ సొమ్ము జమ చేశామని డిప్యూటీ సీఎం తెలిపారు.గృహ జ్యోతి పథకం క్రింద 200 యూనిట్ల లోబడి విద్యుత్ వినియోగిస్తున్న ప్రజలకు ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ అందిస్తున్న దని, జిల్లాలో రూ.130.18 కోట్ల సబ్సిడీ చెల్లించి 243647 కుటుంబాలు లబ్ది పొందినట్లు తెలిపారు.నిరుపేదలకు ప్రభుత్వం సొంతింటి కలను నెరవేర్చేందుకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రవేశ పెట్టిందని, ఖమ్మం జిల్లాలో 9326 మంది లబ్దిదారులకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసిందని, ఇంటి నిర్మాణ పురోగతి ప్రకారం నాలుగు దశలలో గ్రీన్ ఛానల్ ద్వారా ప్రభుత్వం లబ్ధిదారులకు నేరుగా రూ.5 లక్షలు జమ చేస్తుందని తెలిపారు.ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం క్రింద మన జిల్లాలో మహిళా మార్ట్, క్యాంటీన్, 64 స్త్రీ టీ షాపులు ఏర్పాటు చేశామని, రూ.379.43 లక్షలతో 613 క్యాటిల్ షెడ్లు, రూ.57.13 లక్షలతో 28 పౌల్ట్రీ షెడ్లు పూర్తి చేశామని అన్నారు.మధిర నియోజకవర్గంలో మహిళల ఆర్థిక సాధికారతను పెంచేందుకు ఇందిరామహిళా డెయిరీ ప్రాజెక్ట్ చేపట్టామన్నారు. ఇందులో భాగంగా 21 వేల మంది స్వయం సహాయక సంఘ సభ్యులకు రెండు పాడి గేదెలను ఇచ్చి, వారి నుండి పాలు సేకరించి, డెయిరీ ద్వారా ఆ పాలను విక్రయిస్తామని, ఇందిరా మహిళా డెయిరీ ద్వారా వచ్చే లాభాలు కూడా సంఘ సభ్యులకు జమ చేస్తామని అన్నారు.
రైతు సంక్షేమానికి మొదటి ప్రాధాన్యత కల్పించిందని, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రైతులకు ఇచ్చిన మాట ప్రకారం ఖమ్మం జిల్లాలో లక్షా 31760 మంది రైతులకు సంబంధించి రెండు లక్షల రూపాయల వరకు మొత్తం రూ.912.10 కోట్ల రుణ మాఫీ చేసామని అన్నారు.పెట్టుబడి సహాయాన్ని రూ.12 వేలకు పెంచి ఖమ్మం జిల్లాలో 28 31 మంది రైతుల ఖాతాలో రూ.259.74 కోట్లు రైతు భరోసా నిధులు జమ చేసామని డిప్యూటీ సీఎం అన్నారు.అకాల వర్షాలకు పంట నష్టపోయిన 28 407 ఎకరాలకు పది వేల రూపాయల చొప్పున పరిహారం జమ ఛేశామన్నారు. యాసంగి సీజన్ లో 32 102 మంది రైతుల వద్ద నుండి 21.66 లక్షల క్వింటాళ్ల వరి ధాన్యం కొనుగోలు చేసి, 48 గంటలలోగా చెల్లింపులు చేసామని తెలిపారు.
సన్న రకం ధాన్యానికి 500 రూపాయల బోనస్ ప్రభుత్వం అందిస్తున్నదని, జిల్లాలో 47494 మంది రైతులకు రూ.136.33కోట్లు బోనస్ అందించామని తెలిపారు. జిల్లాలో ఆయిల్ పామ్ పంటను సాగు చేస్తున్న 2118 మంది రైతులకు 21 కోట్ల సబ్సిడీతో 7801 ఎకరాలలో డ్రిప్ సౌకర్యం కల్పించామని అన్నారు.
ఖమ్మం నగర కార్పొరేషన్ పరిధిలో 229 కోట్లతో చేపట్టిన త్రాగునీటి సరఫరా పనులు తుది దశలో ఉన్నాయని, వైరా పట్టణంలో దాదాపు రూ.28 కోట్లు, మధిర పట్టణంలో రూ.17 కోట్లతో త్రాగునీటి పనులు చేపట్టామని, మధిర పట్టణంలో రూ.128 కోట్ల అంచనాతో చేపట్టిన భూగర్భ త్రాగునీటి సరఫరా పనులు పురోగతిలో ఉన్నాయని తెలిపారు.రాజీవ్ ఆరోగ్య శ్రీ కవరేజిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచి 163 కొత్త వ్యాధులను ఆరోగ్య శ్రీ పరిధిలోకి తెచ్చామని, జిల్లాలో 25230 మంది రోగులకు రూ.61.86 కోట్లు విలువ గల శస్త్ర చికిత్స లను ఆరోగ్యశ్రీ పథకం క్రింద ఉచితంగా నిర్వహించామనన్నారు. రూ. 130 కోట్లతో ప్రభుత్వ వైద్య కళాశాల నూతన భవనాల నిర్మాణం జరుగుతుందని, ప్రభుత్వ ఆసుపత్రులలో మొత్తం 2272 ప్రసవాలు విజయ వంతంగా నిర్వహించామని, రూ. 23 కోట్ల నిధులతో 50 పడకల ఐసియు వార్డ్ నిర్మాణం జరుగుతుందని తెలిపారు. భావితరాల మెరుగైన భవిష్యత్తుకు మంచి విద్యే పునాదనీ, జిల్లాలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా రూ.21.51కోట్లు ఖర్చు చేసి 955 పాఠశాలల్లో అభివృద్ది పనులు పూర్తి చేశామని తెలిపారు. వుయ్ కెన్ లెర్న్ అనే వినూత్న కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో ఆంగ్లం పెంపుకు కృషి చేశామని, గత సంవత్సరం 34 ప్రభుత్వ పాఠశాలలో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని రాబోయే సంవత్సరంలో అన్ని ప్రభుత్వం స్కూళ్లలో చేపట్టనున్నట్లు డిప్యూటీ సీఎం తెలిపారు.
మధిర ప్రాంతంలో రూ.4 కోట్లు, సిరిపురంలో రూ.5 కోట్లతో , కూసుమంచి మండలంలో రూ.5.50కోట్లతో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నూతన భవన నిర్మాణ పనులు చేపట్టామని అన్నారు.అంతర్జాతీయ స్థాయిలో సౌకర్యాలను కల్పిస్తూ ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో 20 నుంచి 25 ఎకరాల విస్తీర్ణంలో ఎస్సీ, ఎస్టీ , బీసీ, మైనార్టీ విద్యార్థుల కోసం సమీకృత రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలలను మధిర నియోజకవర్గంలోని బోనకల్ మండలం లక్ష్మీపురంలో, ఖమ్మం నియోజకవర్గంలోని రఘునాథ పాలెంలో, పాలేరు నియోజకవర్గం ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్ లలో నిర్మిస్తున్నామని తెలిపారు.
ఎస్సీ వర్గీకరణ, బీసి లకు 42 శాతం రిజర్వేషన్ తో సామాజిక తెలంగాణ సాధనకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ క్రింద ప్రస్తుతం సంవత్సరం జిల్లాలోని 8 280 మంది ఎస్సీ విద్యార్థులకు రూ.20 కోట్లు, 17177 మంది బీసీ, ఈబీసీ విద్యార్థులకు రూ.52.18 కోట్లకు పైగా నిధులను విడుదల చేశామని అన్నారు.ఇందిరా సౌర గిరి జల వికాస పధకం కిద రూ.12600 కోట్ల ఖర్చుతో 6. 3 లక్షల ఎకరాల్లో 2 లక్షల మంది గిరిజన రైతులకు చెందిన భూముల్లో బోర్, సౌర పలకలు అమర్చడం, డ్రిప్ ఇరిగేషన్ ఇతర సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు.మోడల్ సోలార్ విలేజెస్, కార్యక్రమంలో భాగంగా ఖమ్మం జిల్లాలోని బోనకల్ గ్రామాన్ని సౌర మోడల్ గ్రామాలుగా రూపొందిస్తామని, ప్రధానమంత్రి కుసుమ్ ఏ పధకంలో భాగంగా రాష్ట్రంలో 1500 మెగావాట్ల సామర్ధ్యం కలిగిన సౌర ప్లాంట్లను రైతులకు చెందిన భూముల్లో ఏర్పాటు చేస్తున్నామని అన్నారు.గత యాసంగి పంట ఎండిపోకుండా సీతారామ ప్రాజెక్టు లు ప్రజా ప్రభుత్వం రూ.100 కోట్ల రూపాయలతో నిర్మించిన రాజీవ్ కెనాల్ ను వినియోగించి 1.25 లక్షల ఎకరాలను స్థిరీకరణ చేశామని, సీతారామ ఎత్తిపోతల పథకంలో భాగంగా పాలేరు లింక్, సత్తుపల్లి యాతాలకుంట ట్రంక్ కెనాల్ పనులు వేగవంతంగా పూర్తి చేస్తున్నామని అన్నారు.రఘునాధపాలెం మండలంలో రైతులకు సాగునీరు అందించేందుకు ప్రత్యేకంగా మంచుకొండ ఎత్తిపోతల పథకాన్ని ప్రతిపాదించి రికార్డు సమయంలో పూర్తి చేసి, చెరువులను నింపి ఆయకట్టు స్థిరీకరణ సాధించామని అన్నారు. మున్నేరు నది నుండి పాలేర్ లింక్ కెనాల్ వరకు రూ.102. 92 కోట్లు అంచనా వ్యయంతో లింక్ కెనాల్ నిర్మాణానికి టెండర్లు పిలిచినట్లు తెలిపారు. ఖమ్మం నగరాన్ని వరదల నుండి కాపాడడానికి మున్నేరు నది కిరువైపులా ప్రొటెక్షన్ వాల్ నిర్మాణానికి రూ.525.36 కోట్లతో చేపట్టగా, పనులు వేగంగా జరుపుతున్నట్లు తెలిపారు.ఖమ్మం జిల్లాలో నూతనంగా 5 298 కుటుంబాలకు రేషన్ కార్డ్ లు జారీ చేశామని అన్నారు. ఉగాది పర్వదినం నుండి ఖమ్మం జిల్లాలో తెల్ల రేషన్ కార్డులు ఉన్న 384734 కుటుంబాలకు ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున నెలకు 66 64 572 కిలోల సన్న బియ్యాన్ని 748 చౌక ధరల దుకాణాల ద్వారా సరఫరా చేస్తున్నామని అన్నారు.భూ వివాదాలకు తావు లేకుండా, భూ యాజమాన్య హక్కులు పూర్తిగా పరి రక్షించడానికి ప్రభుత్వం ఒక చారిత్రాత్మక సంస్కరణగా భూ భారతి చట్టాన్ని ఏప్రిల్ 14, 2025న ప్రవేశ పెట్టిందని, మన ఖమ్మం జిల్లాలో నేలకొండపల్లి మండలంలోని అన్ని గ్రామాల్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో రైతుల నుండి 3224 దరఖాస్తులను స్వీకరించి, ప్రత్యేక టీముల ద్వారా ప్రతి దరఖాస్తును పరిశీలించి, అర్హత కలిగిన దరఖాస్తుదారులందరి సమస్యలు పరిష్కరించినట్లు తెలిపారు.
మధిర నియోజకవర్గంలోని బోనకల్ మండలాన్ని రెండవ పైలట్ మండలంగా ఎంపిక చేసి, రెవెన్యూ సదస్సులు నిర్వహించామని, జూన్ ౩ నుండి తెలంగాణ రాష్ట్రంలోని అన్ని మండలాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించి, రైతులందరి సమస్యలు పరిష్కరించుటకు ఆదేశాలు జారీ చేసామని తెలిపారు.అమ్మాయి పుట్టడం అదృష్టమనే భావన కలగాలని, జిల్లా కలెక్టర్ “మా పాప- మా ఇంటి మణిదీపం” అనే కార్యక్రమం చేపట్టి ఆడపిల్ల పుట్టిన ఇంటికి కలెక్టర్, జిల్లా స్థాయి అధికారులు వెళ్లి, వారికి శుభాకాంక్షలు తెలిపి, స్వీట్లు పండ్లు ఇచ్చి, వారిని సన్మానించి, ఆడపిల్ల ఔన్నత్యం తెలుపుతూ మంచి సందేశం ఇవ్వడం జరుగుతున్నదని, ఈ కార్యక్రమం పట్ల ప్రజల్లో మంచి స్పందన రావడంతో పాటు, అమ్మాయిని అబ్బాయి లతో సమానంగా పెంచాలనే భావన ప్రతి తల్లిదండ్రుల్లో కలుగుతున్నదని, మంచి కార్యక్రమం చేపట్టిన జిల్లా కలెక్టర్ ని డిప్యూటీ సీఎం ప్రత్యేకంగా అభినందించారు.కళ్యాణ లక్ష్మి , షాదీ ముబారక్ పథకాల క్రింద ఆడపిల్ల వివాహాల నిమిత్తం ప్రభుత్వం గత సంవత్సరంలో 5072 మంది లబ్ధిదారులకు రూ.5077 88 352 లు పంపిణీ చేసిందని అన్నారు.కోదాడ-ఖమ్మం నాలుగు వరుసల జాతీయ రహదారి నిర్మాణం రూ.1583 కోట్లతో పూర్తి చేసుకున్నామని, ఖమ్మం-దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ నాలుగు వరుసల జాతీయ రహదారి పనులు నాలుగు ప్యాకేజీల్లో రూ.2925 కోట్లతో పనులు 90 శాతానికి పైగా పూర్తయినట్లు తెలిపారు. ఖమ్మం పట్టణ ముఖ ద్వారమున ఉన్న మున్నేరు నదిపై 180 కోట్లతో తీగల వంతెన నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయని తెలిపారు.జిల్లాలోనీ ఖిలా రోప్ వే, పాలేరు లేక్ పార్క్, నేలకొండపల్లి బౌద్ద స్తూపం, ఇతర పర్యాటక ప్రాంతాల అభివృద్ధికీ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
అనంతరం ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాలు త్యాగం చేసిన అమర వీరుల కుటుంబ సభ్యులను డిప్యూటీ సీఎం సన్మానించారు.దేశ భక్తి గేయాలపై చిన్నారులు ప్రదర్శించిన ప్రదర్శనలు వీక్షకులను ఆకట్టుకున్నాయి.వివిధ శాఖల ద్వారా అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమం ప్రతిబింబించేలా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ, పౌర సరఫరాలు, ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ సంక్షేమ శాఖల, గృహ నిర్మాణం, రవాణ, అటవీ శాఖలకు సంబంధించిన శకటాలను ప్రదర్శించారు.రాష్ట్ర అవతరణ దినోత్సవం వేడుకల సందర్భంగా పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో వ్యవసాయ, ఉద్యానవన, వైద్య ఆరోగ్య, గ్రామీణ అభివృద్ధి, అటవీ, విద్యుత్, మైనార్టీ శాఖల ద్వారా స్టాల్స్ ఏర్పాటు చేసారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, సిపి సునీల్ దత్, వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్, డిసిసిబి చైర్మన్ దొండపాటి వెంకటేశ్వరరావు, ఖమ్మం మునిసిపల్ కమీషనర్ అభిషేక్ అగస్త్య, అదనపు కలెక్టర్ లు డాక్టర్ పి. శ్రీజ, పి. శ్రీనివాస రెడ్డి, డి.ఎఫ్.ఓ. సిద్ధార్థ్ విక్రమ్ సింగ్, జెడ్పీ సి.ఈ.ఓ. దీక్షా రైనా, డి.ఆర్.ఓ. పద్మశ్రీ, డిఆర్డీవో సన్యాసయ్య, జిల్లా అధికారులు, ఖమ్మం ఆర్డీఓ. నరసింహా రావు, సంబంధిత అధికారులు, తెలంగాణ అమరవీరుల కుటుంబాల సభ్యులు, విద్యార్థిని, విద్యార్థులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.





