తెలుగు వర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డి పేరు

పొట్టి శ్రీరాములు త్యాగాలను ఎన్నటికీ మరువం
కొందరు ప్రజల్లో అపోహలు కలిగించేలా కుట్రలు
అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి17: తెలుగు వర్సిటీకి పొట్టి శ్రీరాములు పేరుకు బదులు.. సురవరం ప్రతాపరెడ్డి పేరు పెడుతున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి తెలిపారు. పొట్టి శ్రీరాములు వర్సిటీ పేరు మార్పు బిల్లును మంత్రి దామోదర రాజనర్సింహ సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. తెలుగు విశ్వ విద్యాలయానికి పొట్టి శ్రీరాములు పేరును తొలగిస్తూ సురవరం ప్రతాప్‌ ‌రెడ్డిపేరు పెట్టాలని రాష్ట్ర గత శాసనసభ సమావేశాల్లో సభ దృష్టికి వొచ్చిందన్నారు. ఈ మేరకు తెలుగు వర్సిటీకి పొట్టి శ్రీరాములు పేరును తొలగిస్తూ సురవరం ప్రతాపరెడ్డి పేరును పెడుతున్నట్లు చెప్పారు. పేరు మార్చినంత మాత్రాన పొట్టి శ్రీరాములు త్యాగాలను తక్కువగా చూడటం లేదన్నారు. పొట్టి శ్రీరాములు వర్సిటీ పేరు మార్చడం ఎవరికీ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. పొట్టి శ్రీరాములు వర్సిటీ ఏపీలో కొనసాగుతోందన్నారు.

తెలంగాణ వొచ్చాక అనేక వర్సిటీలకు పేర్లు మార్చుకున్నామని చెప్పారు. తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప వ్యక్తులను స్మరించుకోవడం ఎంతో అవసరమన్నారు. తెలంగాణ వచ్చాక ఆర్టీసీ, పబ్లిక్‌ ‌సర్వీస్‌ ‌కమిషన్‌ ‌పేర్లు మార్చుకున్నామని చెప్పారు. కొన్ని వర్సిటీలకు ప్రొఫెసర్‌ ‌జయశంకర్‌, ‌కొండా లక్ష్మణ్‌ ‌బాపూజీ, పీవీ నరసింహారావు పేర్లు పెట్టుకున్నామని తెలిపారు. అదే ఒరవడిలో తెలుగు వర్సిటీ పేరును మారుస్తున్నామన్నామని స్పష్టం చేశారు. ప్రభుత్వ నిర్ణయం ఒక వ్యక్తి కోసమో.. ఒక కులం కోసమో కాదన్నారు. సురవరం ప్రతాప్‌రెడ్డి తెలంగాణకు గొప్ప సేవ చేశారని గుర్తు చేశారు. నిజాంకు వ్యతిరేకంగా సురవరం ప్రతాప్‌రెడ్డి పోరాడారని సీఎం రేవంత్‌ ‌రెడ్డి అన్నారు. రాజకీయాలు కలుషితమయ్యాయో నాయకుల ఆలోచనలు కలుషితమయ్యాయో తెలియడం లేదన్నారు. పొట్టి శ్రీరాములు చేసిన కృషిని ఎవరూ తక్కువగా చూడటంలేదని.. వారి ప్రాణత్యాగాన్ని గుర్తించి అందరూ స్మరించుకోవాలన్నారు.

పరిపాలనలో భాగంగా కొన్ని పాలనా పరమైన నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు. రాష్ట్ర ఏర్పాటుకు కృషి చేసిన వారిని స్మరించుకుని వారి పేర్లు పెట్టుకున్నామని చెప్పారు. రాష్ట్ర పునర్విభజన తరువాత గత పదేళ్లుగా ఈ ప్రక్రియ కొనసాగుతోందన్నారు. కొన్ని వర్గాలకు కొందరు అపోహలు కలిగించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కేంద్ర పదవుల్లో ఉన్నవారు కూడా ఇలా చేయడం సమంజసం కాదన్నారు. ఎన్టీఆర్‌ ‌హెల్త్ ‌యూనివర్సిటీకి కాళోజీ పేరు పెట్టుకున్నామని.. ఇది ఎన్టీఆర్‌ ‌ను అగౌరవపరిచినట్టు కాదని తెలిపారు. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ యూనివర్సిటీకి ప్రొఫెసర్‌ ‌జయశంకర్‌ ‌పేరు పెట్టుకున్నామని చెప్పారు. వైఎస్‌ ‌పేరుతో ఉన్న హార్టికల్చర్‌ ‌యూనివర్సిటీకి కొండా లక్ష్మణ్‌ ‌బాపూజీ పేరు పెట్టుకున్నామన్నారు. వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీకి పీవీ పేరును పెట్టుకున్నామన్నారు. ఇందులో భాగంగానే పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాప్‌ ‌రెడ్డి పేరు పెట్టుకున్నామని చెప్పారు. ఏపీలో ఆ పాత పేర్లతో కొనసాగుతున్న యూనివర్సిటీలకు తెలంగాణలో పేర్లు మార్చుకున్నామన్నారు.

ఒకే పేరుతో రెండు యూనివర్సిటీలు ఉంటే పరిపాలనలో గందరగోళం ఉంటుందన్నారు. విశాల ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు బాధ్యతాయుత పదవుల్లో ఉన్నవారు కులాన్ని ఆపాదిస్తున్నారని మండిపడ్డారు. కుల, మత ప్రాతిపదికన విభజించి రాజకీయ ప్రయోజనాలు పొందాలనుకుంటే అది తప్పని అన్నారు. గుజరాత్‌లో సర్దార్‌ ‌వల్లభాయ్‌ ‌పటేల్‌ ‌పేరుతో ఉన్న స్టేడియం పేరు తొలగించి ప్రధాని మోదీ పేరు పెట్టారన్నారు. తాము అలాంటి తప్పిదాలు చేయలేదని.. చేయమని స్పష్టం చేశారు. చర్లపల్లి రైల్వే టెర్మినల్‌కు పొట్టి శ్రీరాములు పేరు పెట్టుకుందామన్నారు. చిత్తశుద్ధి ఉంటే కిషన్‌ ‌రెడ్డి, బండి సంజయ్‌ ‌కేంద్రం నుంచి అనుమతులు తీసుకురావాలని అన్నారు. బల్కంపేట నేచర్‌ ‌క్యూర్‌ ‌హాస్పిటల్‌కు రోశయ్య పేరు పెట్టుకుందామన్నారు. రోశయ్య సేవలను కీర్తించుకునేలా అక్కడ వారి విగ్రహాన్ని ఆవిష్కరించుకుందామని సీఎం రేవంత్‌ ‌రెడ్డి పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *