-రైజింగ్ తెలంగాణకు మీ సలహాలు, సూచనలు అవసరం
– రాజ్యంగ నిర్మాతల స్ఫూర్తితో రైజింగ్ తెలంగాణ డాక్యుమెంట్
– దీని తయారీలో సహకరించిన వారికి ధన్యవాదాలు
– మూడు రంగాలుగా అభివృద్ధి విభజన
– గ్వాంగ్-డాంగ్ ప్రావిన్స్ అభివృద్ధి నమూనా మాకు ఆదర్శం
– రైజింగ్ తెలంగాణ సమ్మిట్లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి
తెలంగాణ ప్రజలు దశాబ్దాలుగా ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడారు. 2014లో, సోనియా గాంధీ, ఆనాటి ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ నాయకత్వంలో తెలంగాణ ఏర్పాటు కల సాకారమైందని, ఆవిధంగా భారతదేశంలో యువ రాష్ట్రంగా తెలంగాణ అవతరించిందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. సోమవారం తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025 లో ఆయన ప్రసంగిస్తూ వచ్చే పదేళ్లలో తెలంగాణను దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రంగా, ప్రపంచంలోనే ఉన్నత రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. ఇందులో భాగంగానే తెలంగాణ భవిష్యత్తు కోసం రోడ్ మ్యాప్ రూపొందించాల నుకున్నాం ఇందుకు మాకు స్ఫూర్తి దేశ స్వాతంత్య్రం అనంతరం మన నాయకులు కొత్త రాజ్యాంగాన్ని రూపొందించి భవిష్యత్తు కోసం రోడ్ మ్యాప్ వేసిన విధానమన్నారు. మహాత్మా గాంధీ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్, రాజ్యాంగ నిర్మాతల నుంచి స్ఫూర్తి పొందిన మేం దేశానికి స్వాతంత్రం సిద్ధించి వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న 2047 నాటికి మనమేం సాధించగమో చెప్పాలని నిపుణులను కోరా మన్నారు. ఆ విధంగా తెలంగాణ రైజింగ్-2047 దార్శనికతకు బీజం పడింది. మనమేదైనా గొప్పగా చేయాలని భావించినప్పుడు తెలంగాణ సంస్కృతిలో ముందుగా దేవుళ్ల ఆశీర్వాదం తీసుకుంటాం… ప్రజల మద్దతు కోరుతాం. భవిష్యత్తు కోసం మన కలలను నెరవేర్చుకోవడానికి ప్రజల ఆలోచనలు, అంచనాలు తెలుసుకున్నాం. అధికారులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, నీతి ఆయోగ్ నిపుణుల సహాయం తీసుకున్నామని తెలుపుతూ ఈ విజన్ రూపొందించడంలో సహయపడిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ గ్లోబల్ సమ్మిట్కు అన్ని రంగాలకు చెందిన ప్రతినిధులు ఇక్కడకు రావడం మన అదృష్టంగా భావిస్తున్నాం. వ్యాపార వేత్తలు, కార్పొరేట్ దిగ్గజాలు, విధాన నిర్ణేతలు, దౌత్యవేత్తలు, ప్రభుత్వ అధికారులు, నిపుణులకు ధన్యవాదాలు. ఈ సమ్మిట్ లో మీ సూచనలు, సలహాలు, అభిప్రాయాలను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. తెలంగాణలో అపారమైన అవకాశాలు ఉన్నాయి. మంచి సానుకూల వాతావరణం ఉంది. 2034 నాటికి ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలని మేం సంకల్పించామన్నారు. దేశంలో తెలంగాణ దాదాపు 2.9% జనాభా కలిగి ఉంది. దేశ జీడీపీలో తెలంగాణ నుంచి దాదాపు 5% వాటాను అందిస్తున్నాం. 2047 నాటికి భారతదేశ జీడీపీలో 10% వాటాను తెలంగాణ నుంచి అందించాలన్నది మా లక్ష్యం. సేవారంగం, తయారీ రంగం, వ్యవసాయ రంగం, ఇలా తెలంగాణను స్పష్టమైన 3 భాగాలుగా విభజించాం. మూడు భాగాలుగా విభజించి ప్రాంతాల వారీగా అభివృద్ధి లక్ష్యాలను నిర్ధేశించుకున్న రాష్ట్రాల్లో దేశంలోనే తెలంగాణ మొట్టమొదటి రాష్ట్రం. ఇందుకోసం కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (క్యూర్) పెరి అర్బన్ రీజియన్ ఎకానమీ (ప్యూర్) రూరల్ అగ్రికల్చర్ రీజియన్ ఎకానమీ (రేర్) మోడల్స్ నిర్ధేశించామన్నారు. ఈ సందర్భంగా చైనాలోని గ్వాంగ్-డాంగ్ ప్రావిన్స్ సాధించిన అభివృద్ధి గురించి ప్రస్తావించదలచుకున్నా. గ్వాంగ్డాంగ్ ఆర్థిక వ్యవస్థ చైనాలోని ఏ ప్రావిన్స్తో పోల్చినా అతిపెద్దది. 20 సంవత్సరాల్లో వారు ప్రపంచంలోనే అత్యధిక పెట్టుబడులను, వృద్ధి రేటును సాధించారు. తెలంగాణలో కూడా మేము అదే నమూనాను అనుసరించాలని భావిస్తున్నాం. చైనా, జపాన్, జర్మనీ, దక్షిణ కొరియా, సింగపూర్ దేశాల నుంచి మేమెంతో ప్రేరణ పొందామన్నారు. ఇప్పుడు మేం ఆ దేశాలతో పోటీ పడాలనుకుంటున్నాం. మా ఈ తెలంగాణ రైజింగ్ ప్రయాణంలో సహకరించడానికి, పెట్టుబడి పెట్టడానికి, మాకు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని ఆకాంక్షిస్తూ మీఅందరినీ ఆహ్వానించాం. ఈ విజన్ కష్టంగా అనిపించవచ్చు, కానీ ఆ విజన్ ను సాధించగలం. ఈ విషయంలో మా టీమ్ కు నేను చెప్పేదొక్కటే “ కష్టంగా ఉంటే, వెంటనే చేపడుదాం. అసాధ్యం అని అనుకుంటే.. వారికి కొంత గడువు ఇస్తా. ఇవాళ నేను నిన్నటి కంటే ఎక్కువ విశ్వాసంతో, నమ్మకంతో ఉన్నా. నిన్నటిది ఒక కల, ఒక ప్రణాళిక…ఇవాళ మీరందరూ మాతో చేరారు. ఈ ప్రయాణంలో భాగస్వాములుగా ఉండాలని ఆశిస్తున్నాం. మీ అందరి మద్దతుతో తెలంగాణ రైజింగ్ లక్ష్యాలన్నింటినీ సాధించగలమని బలంగా నమ్ముతున్నా. చివరగా… తెలంగాణ రైజింగ్ నిరంతర ప్రక్రియ. అందరూ ఇందులో భాగస్వాములు కావాలని” పిలుపునిచ్చారు.





