- వివరణ ఇచ్చే అవకాశం ఇవ్వకుండా ఏకపక్ష నిర్ణయం
- నియంతృత్వ పోకడలతో సభ వాయిదా వేశారు..
- మీడియా పాయింట్ వద్ద కెటిఆర్ ఆరోపణ
జగదీశ్రెడ్డిని ఉద్దేశపూర్వకంగానే సభ నుంచి సస్పెండ్ చేశారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. జగదీశ్రెడ్డి సస్పెన్షన్ తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ…స్పీకర్ పట్ల జగదీశ్రెడ్డి అగౌరవంగా మాట్లాడలేదు. అనని మాటను అన్నట్టుగా చిత్రీకరించారు. నిబంధనలకు విరుద్ధంగా సభలో ఏ మాట్లాడకపోయినా.. ఈ సమావేశాలు పూర్తయ్యే వరకు ఆయన్ను సస్పెండ్ చేయడం దారుణమని అన్నారు. స్పీకర్ పట్ల ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని, తాను చేసిన తప్పేంటని వివరణ అడిగే అవకాశం కూడా జగదీశ్రెడ్డికి ఇవ్వలేదు.
స్పీకర్ బాధపడి ఉంటే విచారం వ్యక్తం చేయాలని, సభ సజావుగా జరిగేందుకు సహకరించాలని ఆదేశించాలన్నారు. ఇదే విషయాన్ని స్పీకర్, మంత్రి శ్రీధర్బాబుకు స్పష్టంగా చెప్పాం. అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకోవాలని కోరాం. అయినా, పట్టించుకోకుండా నియంతృత్వ పోకడలతో సభను 5 గంటలపాటు వాయిదా వేశారు. ఆ తర్వాత నలుగురు ఎమ్మెల్యేలు, ముగ్గురు మంత్రులతో మాట్లాడించి.. జగదీశ్రెడ్డిని సస్పెండ్ చేస్తున్నట్టు ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారు. భవిష్యత్లో తగిన మూల్యం చెల్లించుకుంటారని కేటీఆర్ అన్నారు.





