విమానం కూలిపోయిన భయానక క్షణాలను తలుచుకుని భారత సంతతికి చెందిన 40 ఏళ్ల బ్రిటిష్ పౌరుడు విశ్వాస్ కుమార్ రమేష్ చిగురుటాకులా వణికిపోయారు. ప్రస్తుతం హాస్పిటల్లో ఆయన చికిత్స పొందుతున్నారు. అకస్మాత్తుగా భవనంలోకి విమానం దూసుకుపోయి పేలిపోయిందని, సెకండ్లలోనే అంతా జరిగిపోయిందని తెలిపారు. తన సీటు సమీపంలో భారీ విధ్వంసం జరిగిందన్నారు. సీటు ఊడిపోయి పక్కకు పడడంతో అనూహ్యరీతిలో ప్రాణాలతో బయటపడ్డానన్నారు. ప్రమాద క్షణాలను గుర్తుచేసుకుంటూ… తాను విమానం నుంచి దూకలేదని, విమానం కూలగానే తన సీటు విరిగిపోవడంతో దూరంగా ఎగిరిపడ్డట్టు వైద్యులకు తెలిపారు.
ఈ ప్రమాదంలో ఆయన శరీరంపై పలుచోట్ల గాయాలు అయ్యాయి. వాటినుంచి కోలుకుంటున్న ఆయన తాజాగా మీడియాతో మాట్లాడారు. అంతా కళ్లముందే క్షణాల్లో జరిగిపోయింది. విమానం కింద పడగానే చనిపోయాననుకున్నా. కానీ ఎట్లా బతికానో అర్థం కాలేదన్నారు. కళ్లు తెరిచి చూసేసరికి హాస్టల్ భవనం శిథిలాల్లో వున్నట్టు తెలుసుకొని, చిన్నగా నడుచుకుంటూ బయటకు వచ్చానన్నారు. మంటల ధాటికి ఆయన ఎడమ చేతికి గాయమైంది.
కాగా విశ్వాస్కు ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. బ్రిటన్లో నివాసముంటున్న విశ్వాస్కుమార్. గుజరాత్లోని తన కుటుంబానికి కలిసేందుకు వచ్చారు. తిరుగు ప్రయాణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన ఎయిరిండియా విమానంలోని 11-ఏ సీటులో విశ్వాస్ కుమార్ కూర్చున్నారు. ప్రమాదం అనంతరం రక్తపుమరకలతో నడుచుకుంటూ వచ్చి ఆయన అంబులెన్సు ఎక్కారు. ఆ దృశ్యాలు వైరల్గా మారాయి





