బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. కాంగ్రెస్ సర్కార్పై కేటీఆర్ చేసిన రూ.25వేల కోట్ల అవినీతి ఆరోపణల కేసులో సుప్రీం నోటీసులిచ్చింది. కాంగ్రెస్ నాయకురాలు ఆత్రం సుగుణ దాఖలు చేసిన పిటిషన్పై శుక్రవారం సుప్రీంలో విచారణ జరిగింది. జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ సతీశ్ చంద్రశర్మతో కూడిన ధర్మాసనం పిటిషన్ను విచారించింది. మూసీ ప్రక్షాళన పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం రూ.25 వేల కోట్ల కుంభకోణానికి పాల్పడిందంటూ కేటీఆర్ గతంలో ఆరోపణలు చేశారు.
దీంతో కేటీఆర్ చేసిన ఆరోపణలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ నాయకురాలు ఆత్రం సుగుణ.. ఉట్నూరు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ నేత ఫిర్యాదుతో కేటీఆర్పై పోలీసులు కేసు నమోదు చేశారు. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని గతంలోనే కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. వాదనలు విన్న హైకోర్టు.. కేటీఆర్పై నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టి వేస్తూ తీర్పు ఇచ్చింది. అయితే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుగుణ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై శుక్రవారం విచారణ జరుగగా.. పిటిషన్పై సమాధానం చెప్పాలంటూ కేటీఆర్కు సుప్రీం ధర్మాసనం నోటీసులు జారీ చేసింది.




