– సోలార్ పవర్పై సాధ్యాసాధ్యాల పరిశీలన
– ఐఐటి సంస్థలతో ఆడిటింగ్ జరిపేలా చర్యలు
– పెద్ద కంపెనీల నుంచి టెండర్ల ఆహ్వానం
– అధికారులకు సిఎం రేవంత్ ఆదేశం
హైదరాబాద్,ప్రజాతంత్ర,సెప్టెంబరు15 : వీధి దీపాల నిర్వహణకు పెద్ద కంపెనీల నుంచి వెంటనే టెండర్లు పిలవాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. బంజారాహిల్స్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో మున్సిపల్, పంచాయతీరాజ్, జీహెచ్ఎంసీ అధికారులతో సీఎం రేవత్రెడ్డి సక్ష సమావేశం సోమవారం నిర్వహిచారు. సమావేశంలో అధికారులకు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. వీధి దీపాలకు సోలార్ పవర్ను వినియోగించడంపై సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని సూచించారు. వీధి దీపాల పనితీరును నిర్ధారించడానికి ఐఐటీ లాంటి సంస్థలతో థర్డ్ పార్టీ ఆడిట్ చేయించాలని మార్గనిర్దేశం చేశారు. రాష్ట్రంలో వీధి దీపాల ఏర్పాటు, నిర్వహణలో సమూల మార్పులు తీసుకురావాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. వీధి దీపాల ఏర్పాటు, నిర్వహణ కోసం పెద్ద కంపెనీల నుండి టెండర్లను పిలవాలని సూచించారు. దీనివల్ల పారదర్శకత పెరిగి సేవల నాణ్యత మెరుగుపడుతుందని అభిప్రాయపడ్డారు. అంతేకాక రాష్ట్రంలోని వీధి దీపాలను కమాండ్ కంట్రోల్ సెంటర్తో అనుసంధానం చేసి, కేంద్రంగా పర్యవేక్షించే విధానాన్ని రూపొందించాలని సూచించారు. దీని ద్వారా ప్రతి దీపం స్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. వీధి దీపాల నిర్వహణలో ఆధునిక సాంకేతికతను ఉపయోగించాలని స్పష్టం చేశారు. కృత్రిమ మేధస్సు ద్వారా ఎప్పటికప్పుడు విశ్లేషణ జరిపి, సమస్యలను ముందుగానే గుర్తించి పరిష్కారాలు తీసుకోవాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో వీధి దీపాల నిర్వహణను పూర్తిగా గ్రామ పంచాయతీలకే అప్పగించాలని నిర్ణయించారు. సర్పంచ్లకు దీపాల ఏర్పాటు, నిర్వహణపై పూర్తి అధికారం ఇవ్వబడుతుందని, అయితే ఈ పనులపై ఎంపీడీవో స్థాయిలో పర్యవేక్షణ ఉండాలని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి వీధి దీపం, ప్రతి పోల్పై సర్వే చేయాలని ఆదేశించారు. దీని ద్వారా సమస్యలు, లోపాలు, అదనపు అవసరాలను గుర్తించి త్వరితగతిన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందన్నారు. వీధి దీపాల వ్యవస్థను ఆధునికీకరించడానికి తీసుకుంటున్న ఈ చర్యలు రాబోయే రోజుల్లో రాష్ట్రానికి ఒక మోడల్గా నిలుస్తాయని సీఎం రేవంత్ అభిప్రాయపడ్డారు. పారదర్శక విధానాలు, సాంకేతిక ఆధారిత పర్యవేక్షణ, గ్రాణ స్థాయి అధికారానికి బాధ్యత కల్పించడం ద్వారా వీధి దీపాల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించగలమన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. సమావేశంలో సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి, సీఎంఓ ముఖ్య కార్యదర్శి శేషాద్రి, సీఎంఓ కార్యదర్శి మాణిక్ రాజ్, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్.శ్రీధర్, మున్సిపల్ శాఖ కార్యదర్శి శ్రీదేవి, కోర్ అర్బన్ ఏరియా మున్సిపల్ సెక్రటరీ ఇలంబర్తి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్తోపాటు అనేకమంది ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




