న్యాయవిద్యలో ప్రమాణాలు పెంచాలి!

హద్దులు మీరుతున్న వ్యవస్థలకు ముకుతాడు వేసి, వాటిని ముందుకు నడుపుతున్న న్యాయవ్యవస్థ సైతం అప్పుడప్పుడు గాడి తప్పడం సామాన్యులకు తెలియకపోయినా, కోర్టులకు, న్యాయమూర్తులకు సుపరిచితమే. హైకోర్టు జడ్జీలపైన, సుప్రీం న్యాయమూర్తులపైన గతంలో అవినీతి, అక్రమాలు, ఆశ్రీతపక్షపాతం వంటి ఆరోపణలు వచ్చాయి. ఇలాంటి ఆరోపణలతో కొంతమంది జడ్జీలు జైలుకు వెళ్లారు. మనదేశంలో ఉన్న మూడు రాజ్యాంగ వ్యవస్థలు ఒకదానికొకటి పరస్పరం ఆధారపడుతూనే వేటికవే స్వతంత్రంగా ఉండటం, ఒకరి స్వేచ్ఛాపరిధిలోకి మరొకరు తలదూర్చకపోవడం, తమ పరిధిని అతిక్రమించకుండా స్వీయ నియంత్రణ పాటించడం జరుగుతోంది. ఒక్కోసారి క్రీయాశీలత ఎక్కువైనపుడు వ్యవస్థల చొరబాటుతో ఘర్షణ వాతావరణం ఏర్పడుతోంది. అలాంటపుడు ఎవరికి ఎవరు ఎక్కువ? అనే ప్రశ్న తలెత్తుతోంది. పార్లమెంటరీ వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయవ్యవస్థల్లో ఎవరిది పైచేయి? అంటే చెప్పడం కష్టం. భారత్‌ ‌వంటి ప్రజాస్వామిక వ్యవస్థలో తుదకు ప్రజలదే పైచేయి. ప్రజలకు ప్రాతినిధ్యం వహించే పార్లమెంటుదే అగ్రపీఠం అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే పార్లమెంటు తప్పిదాలను సైతం సరిదిద్దే సదావకాశం న్యాయవ్యవస్థ ఉంది. కార్యనిర్వాహక వ్యవస్థను గాడిలోకి తెచ్చే బాధ్యతను కూడా న్యాయవ్యవస్థ చేపడుతోంది. న్యాయవ్యవస్థలో అవినీతిపై సీబీఐ కన్నేసి  ఉంచితే, సీబీఐలో అవినీతిపై న్యాయవ్యవస్థ కన్నేసి  ఉంచుతోంది. ఇలా పరస్పర ఆధారితంగా, స్వతంత్రంగా వ్యవహరించగలిగే సంప్రదాయ అలవాటు బహుశా మరే దేశంలోనూ లేదు.

 

భారత శిక్షా స్మృతి (ఐపీసీ) లో న్యాయస్థానానికి కూడా నిర్వచనం ఉంది, భారతదేశానికి కూడా నిర్వచనం ఇచ్చారు. ఐపీసీ ప్రకారం దేశం అంటే జమ్మూ కశ్మీర్‌ ‌మినహా మిగిలిన భూభాగమని పేర్కొనబడి ఉంది. ఈ చట్టం మొదటి సెక్షన్‌లోనే జమ్మూ కశ్మీర్‌ ‌మినహా యావత్‌ ‌భారతదేశానికి వర్తిస్తుందని చెప్పబడింది. ఒక చట్టం ఎవరికి ఏ ప్రాంతాలకు అన్వయిస్తుందో చెప్పడం వేరు, భారతదేశ సరిహద్దులను వివరించడం వేరు. జమ్మూ కశ్మీర్‌ ‌మినహా మిగిలినదే భారతదేశం అని ఈ సెక్షన్‌లో పేర్కొనడాన్ని గమనించాలి. ఐపీసీ ప్రకారం న్యాయం చెప్పేందుకు నియమితులైన అధికారి న్యాయమూర్తి. న్యాయ ప్రక్రియలో భాగమైన- ఏదైనా ఒక సివిల్‌ ‌లేదా క్రిమినల్‌ ‌వ్యవహారంలో నిర్దిష్టమైన తీర్పు చెప్పేందుకు చట్ట ప్రకారం అధికారం ఉన్న వారిని న్యాయమూర్తులుగానే పరిగణిస్తారు. అటువంటి సందర్భంలో తీర్పు ఇచ్చిన వారు కూడా న్యాయమూర్తి అవుతారు. తీర్పు ఇచ్చే అధికారం న్యాయపీఠంలో ఒకరి కంటే ఎక్కువ మందికి ఉన్నట్టయితే వారంతా న్యాయమూర్తులే. సాధారణంగా హైకోర్టు, సుప్రీం కోర్టు న్యాయమూర్తులను మాత్రమే మనం జడ్జీలు అంటాం. కానీ జడ్జీ అనే పదాన్ని విస్తృతార్ధంలో కూడా వినియోగిస్తున్నారు. మున్సిఫ్‌ ‌మెజిస్ట్రేట్లు, రెండో తరగతి మెజిస్ట్రేట్లు, ట్రిబ్యునల్‌ ‌చైర్మన్లు, మెంబర్లు, వినియోగదారుల ఫోరం సభ్యు లు, చైర్మన్‌ ‌మొదలైన వారు ఆయా సందర్భాల్లో న్యాయమూర్తులుగానే పరిగణించబడుతున్నారు. కొన్ని రకాల అధికారులు కూడా కొంతమేరకు న్యాయమూర్తులుగానే పరిగణించబడతారు.

 

లేబర్‌ ఆఫీసర్లు, ఆర్డీవోలు, కలెక్టర్లు, ఇన్ఫర్మేషన్‌ ‌కమిషనర్లు, రెగ్యులేటరీ కమిషన్‌ ‌స భ్యులు, నిత్యావసరాల చట్టంలో నియంత్రణాధికారులు ప్రత్యేక సందర్భాల్లో న్యాయమూర్తులే. ఐపీసీ సెక్షన్‌-19 ‌ప్రకారం న్యాయప్రక్రియలో భాగంగా తీర్పునిచ్చే వ్యక్తి మాత్రమే న్యాయమూర్తి. దానికి కొనసాగింపుగా న్యాయబద్ధంగా వ్యవహరించేందుకు అధికారమున్న వ్యక్తి కూడా న్యాయమూర్తిగానే వ్యవహరిస్తారని ఈ సెక్షన్‌ ‌చెబుతోంది. న్యాయస్థానాల్లో న్యాయమూర్తి, ఫిర్యాదిదారుడు, అభియోగాలు మోపబడిన వారు ఉంటారు. ఇందులో వ్యక్తిగత కేసులు మినహా ఫిర్యాదిదారుడిగా చాలా సందర్భాల్లో ప్రభుత్వమే ఉంటుంది. ఇటు ప్రభుత్వం తరఫున, అటు అభియోగాలు ఎదుర్కొంటున్న వ్యక్తులు లేదా సంస్థల తరఫున హాజరయ్యేది న్యాయవాదులే. ఇరువర్గాల వాదనలు విని న్యాయమూర్తి తీర్పును ఇస్తారు. మొత్తంగా చూస్తే న్యాయవాది పాత్ర చాలా కీలకం. మనదేశంలో ప్రస్తుతం 16 లక్షలకు పైగా న్యాయవాదులున్నారు. యూపీలో 3 లక్షల మంది, బిహార్‌లో లక్షన్నర మంది న్యాయవాదులున్నారు. ఏపీ, తెలంగాణల్లో లక్ష మంది న్యాయవాదులున్నారు. మిగిలిన రాష్ట్రాల్లో 60వేల నుండి 90 వేలు చొప్పున ఉన్నారు. వీరికి శిక్షణ కోసం న్యాయవిద్యా కళాశాలున్నాయి. అత్యున్నత ప్రమాణాలున్న న్యాయవిద్యా కళాశాలలు బహు స్వల్పమే. రోజురోజుకూ నాసిరకం కాలేజీలు ఎక్కువ కావడంతో న్యాయవిద్య దిగజారుతోంది. ఆ ప్రభావం న్యాయస్థానాల్లో, తీర్పుల్లో, కేసుల పరిష్కారంలో, వివాదాల నియంత్రణలో కనిపిస్తోంది. కేసులకు అనుగుణంగా తర్ఫీదు పొందడంలో న్యాయవాదులు విఫలం కావడం న్యాయస్థానాలకు సైతం తలనొప్పిగా మారింది.
ప్రపంచ వ్యాప్తంగా న్యాయవ్యవస్థ 16వ శతాబ్దంలోనే విచ్చుకున్నా, 1748 తర్వాత దానికో స్వరూపం రావడం మొదలైంది. 1689లో మాంటెక్‌, 1729‌లో ఎండ్మండ్‌ ‌బుర్కే, 1775లో షెల్లింగ్‌, 1798‌లో గోస్తావ్‌ ‌హ్యుగో, 1770లో హేగెల్‌, 1732‌లో జెర్మి బెంథమ్‌, 1790‌లో జాన్‌ ఆస్టిన్‌, 1835‌లో సర్‌ ‌థామస్‌ ఎస్కైన్‌ ‌హాలండ్‌ ‘‌న్యాయం’ అనే పదాన్ని, న్యాయపాలనను నిర్వచిస్తూ వచ్చారు. 1771లో తిబూత్‌ ‌కోడిఫికేషన్‌తో చట్టాలకు లిఖిత రూపం మొదలైంది.

 

మనం అనుసరిస్తున్న నేర విచారణ ప్రక్రియా స్మృతి 1898లో రూపొందించిందే. కాంట్రాక్టు లా, క్రిస్టియన్‌ ‌మ్యారేజీ యాక్టు 1872లో రూపొందినవే. నెగోషియబుల్‌ ఇనుస్ట్రుమెంట్‌ ‌యాక్టు 1881లో రాగా, స్టాంప్స్ ‌యాక్టు 1899లోనూ, రిజిస్ట్రేషన్‌ ‌యాక్టు 1908లో, ఇన్‌కం టాక్స్ ‌యాక్టు 1961లో, లిమిటేషన్‌ ‌యాక్టు 1963లో వచ్చాయి. ఐపీసీని తొలుత రూపొందించింది 1860లోనే. అనేక సవరణలు చేసుకుంటూ అవే చట్టాలను అమలు చేసుకుంటున్నాం. ఇంత వరకూ దేశంలో లక్షకు పైగా చట్టాలకు రూపకల్పన జరిగింది. సిద్ధాంత న్యాయశాస్త్రాలు, కార్యపద్ధతి న్యాయ శాస్త్రాలు ఉన్నాయి. సిద్ధాంత న్యాయశాస్త్రం ఏయే విషయాలు హక్కును, బాధ్యతను ఏర్పరుస్తాయనే దానిని నిర్వచించగా, కార్యపద్ధతి న్యాయశాస్త్రం ద్వారా కేసులకు సిద్ధాంత న్యాయశాస్త్రం వర్తిస్తుంది. శాస్త్రం ప్రకారం నిర్ణయించిన హక్కు లు, విధులు, బాధ్యతలను అమలు పర్చడం గురించి వివరిస్తుంది. వాస్తవికంగా రాష్ట్రాల వారీ రూపొందించిన చట్టాలపై సరైన గణాంకాలే లేవు. సమగ్రమైన క్యాటలాగ్‌ ‌లేదంటే ఆశ్చర్యం. కేంద్ర చట్టాలను ఇండియా కోడ్‌ ‌పేరిట ఒకే చోట డిజిటల్‌ ‌రూపంలో పొందుపరిచే ప్రయత్నం జరుగుతోంది. 111 చట్టాలు పూర్తిగా రద్దయ్యాయి. వీటికి అనుబంధంగా ప్రక్రియా స్మృతులు ఉండనే ఉన్నాయి. ఇన్ని చట్టాలపై అవగాహన పెంచుకునే సౌకర్యం, సౌలభ్యం నేడు న్యాయవిద్యలో లోపించాయనేది బహిరంగ రహస్యం. న్యాయబద్ధమైన నైతికత, న్యాయవాదులకు జవాబుదారీతనం, న్యాయప్రక్రియతో న్యాయవాదుల సంబంధాలు సక్రమంగా లేకపోవడంతో మొత్తం న్యాయవ్యవస్థ కుంగుబాటుకు గురవుతోంది. కోట్లాది కేసులు కోర్టుల్లో నలుగుతున్నాయి.
-చరణ్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *