– క్రీడా విధానం, ప్రోత్సాహం విషయంలో మనవైపే చూడాలి
– గ్రామస్థాయి నుంచి క్రీడాకారులకు తర్ఫీదు
– అన్ని రకాల వసతులు, బడ్జెట్ కేటాయింపులకు సిద్దం
– తెలంగాణ స్పోర్ట్సు హబ్ బోర్డు మొదటి సమావేశంలో సిఎం
హైదరాబాద్,ప్రజాతంత్ర,ఆగస్ట్28: క్రీడా ప్రపంచానికి హైదరాబాద్ దికగా మారాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబం తమ పిల్లలు ఐటీ రంగంలో ఉండాలని కోరుకుంటున్నారని, అలానే క్రీడా సంస్కృతి రావాలని తాను అభిలషిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఖేలో ఇండియా, కామన్ వెల్త్, ఒలింపిక్స్ ఇలా ఏ పోటీలు నిర్వహించినా వాటిలో తెలంగాణకు అవకాశం కల్పించాలని తెలంగాణ స్పోర్ట్సు హబ్ మొదటి సమావేశం తీర్మానం చేసింది. రాష్ట్రంలో స్టేడియాల నిర్వహణ, వసతుల మెరుగుకు, కోచ్లు, ట్రైనర్లకు శిక్షణ, క్రీడా పాలసీలో వివిధ అంశాలపై ప్రణాళిక రూపకల్పన, అమలుకు సబ్ కమిటీల ఏర్పాటుకు బోర్డు తీర్మానాలు చేసింది. ముఖ్యమంత్రి మాట్లాడుతూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో క్రీడా విధానం, క్రీడల ప్రోత్సాహం విషయంలో ప్రతిఒక్కరూ హైదరాబాద్ గురించి మాట్లాడుకోవాలనేదే తన లక్ష్యమన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించిన క్రీడాకారులకు ప్రోత్సాహాకాలు ఇవ్వడంతోపాటు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించామని సీఎం తెలిపారు. క్రీడా రంగం ప్రాధాన్యతను పెంచేందుకు యంగ్ ఇండియా స్పోర్ట్సు యూనివర్సిటీని ఏర్పాటు చేశామన్నారు. హైదరాబాద్తోపాటు తెలంగాణవ్యాప్తంగా పెద్ద ఎత్తున స్టేడియాలు, అధునాతన పరికరాలు అందుబాటులో ఉన్నా ఆశించిన స్థాయిలో ఫలితాలు లేవని, వాటిని సద్వినియోగం చేసుకోవడంతోపాటు క్రీడా రంగంలో తెలంగాణను అగ్రగామిగా నిలిపేందుకు బోర్డు తగిన కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సీఎం కోరారు. క్రీడా రంగం అభివృద్ధికి నిధులు, నిపుణులు, నిర్వహణ అవసరమైనందునే బోర్డులో ప్రముఖ కార్పొరేట్లు, క్రీడాకారులు, క్రీడా నిర్వాహకులకు చోటు కల్పించామని తెలిపారు. ఇప్పటివరకు ఉన్న క్రీడా పోటీల విధానాన్ని మార్చుతూ గ్రామ, మండల, శాసనసభ నియోజకవర్గ స్థాయి పోటీలు నిర్వహిస్తామన్నారు. శాసనసభనియోజకవర్గ స్థాయిలో విజేతలుగా నిలిచిన జట్ల మధ్య పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి పోటీలు నిర్వహించి అంతిమంగా రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించి రాష్ట్ర స్థాయి జట్లను ఎంపిక చేస్తామన్నారు. క్రీడా సామగ్రిపై పన్నుల తగ్గింపునకు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతామని, తమ స్థాయిలో అవసరమైన ప్రోత్సాహాకాలు అందిస్తామని తెలిపారు. యంగ్ ఇండియా స్పోర్టస్ యూనివర్సిటీలో ఫిజియోథెరపీ, ఇతర క్రీడా సంబంధిత కోర్సులు ప్రవేశపెడతామని తెలియజేశారు. స్టేడియాలు పెద్ద సంఖ్యలో ఉన్నా తగిన సంఖ్యలో కోచ్లు లేరని, ఉన్న కోచ్లకు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలకు తగినట్లు శిక్షణ ఇప్పించాల్సి ఉందన్నారు. ఇండియా క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ కపిల్దేవ్ మాట్లాడుతూ తొలుత క్రీడా సంస్క•తిని పెంపొందిం చాలని, ప్రతి విద్యార్థి ఏదో ఒక క్రీడలో పాల్గొనేలా చూస్తే ఫలితాలు అవే వస్తాయని అభిప్రాయపడ్డారు. ప్రముఖ షూటర్ అభినవ్ భింద్రా మాట్లాడుతూ ప్రతిపాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడు, వ్యాయామ సంచాలకుడు ఉండేలా చూడాలన్నారు. ఆధాని ఫౌండేషన్ శతాధానీ మాట్లాడుతూ పాఠశాల స్థాయిలోనే క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలని., వ్యాయామ అక్షరాస్యత పై అవగాహన పెంపొందించాల్సి ఉందన్నారు. బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్ మాట్లాడుతూ గ్రామ స్థాయి నుంచి క్రీడా పోటీలు దశలవారీగా ఉండాలని.. అప్పుడు మెరుగైన క్రీడాకారుల ఎంపిక సాధ్యమవుతుందన్నారు. హబ్ కో ఛైర్పర్సన్ ఉపాసన కొణిదెల మాట్లాడుతూ ఫిజియోథెరపిస్టు కోర్సులను క్రీడా యూనివర్సిటీలో ప్రారంభించాలని కోరారు. అలాగే స్పోర్టస్ సామగ్రిపై పన్నుల భారం భారీగా ఉందని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. హబ్ ఛైర్పర్సన్ డాక్టర్ సంజీవ్ గోయెంకా మాట్లాడుతూ ప్రపంచ ప్రముఖ కంపెనీల సీఈవోలు ఈ ప్రాంతం నుంచే ఉన్నందున వారి సేవలను క్రీడాభివృద్దికి వినియోగించుకోవాలన్నారు. విశ్వ సముద్ర ఫౌండేషన్ చింతా శశిధర్ మాట్లాడుతూ క్రీడల్లో రాణించే వారికి అవసరమైన సామగ్రిని పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచితే మరింత మెరుగైన ఫలితాలు వస్తాయన్నారు. క్రీడా నిర్వాహకులు బియ్యాల పాపారావు మాట్లాడుతూ ఐఐటీ- ప్రొఫెసర్లు మాదిరి స్పోర్ట్సు యూనివర్సిటీలో కోచ్లు ఉండాలన్నారు. పుట్బాల్ టీమ్ మాజీ కెప్టెన్ బైచుంగ్ భాటియా మాట్లాడుతూ గ్రామ స్థాయిలో స్టేడియాలు, క్రీడా సామగ్రి అందుబాటులో ఉండే క్రీడాకారులు వెలుగులోకి వస్తారని తెలిపారు. ప్రముఖ క్రీడాకారుడు రవికాంత్ రెడ్డి మాట్లాడుతూ మనకు ఉన్న స్టేడియాలను మెరుగ్గా వినియోగించుకోవాలని, వాటి నిర్వహణ సక్రమంగా చేయాలన్నారు. సమావేశంలో క్రీడా వ్యవహారాల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, స్పోర్ట్్స అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, ఎండీ సోని బాల దేవి తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం Prajatantra వెబ్సైట్ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ను ఫాలో కండి. అలాగే మా ప్రజాతంత్ర యూట్యూబ్ చానల్ను సబ్ స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మరిచిపోవద్దు.