సింగరేణి కార్మికచరిత్ర, యాంత్రీకరణ విధానాలతో, సింగరేణి కార్మికుల జీవితాలు మారుతున్నక్రమంలో బొగ్గురవ్వలు ఇచ్చే ప్రేరణ విప్లవ కార్మికోద్యమంతో విడదీయరాని బంధాన్ని ఏర్పరుస్తుంది.
బొగ్గురవ్వలు కథకాదు, నవలకాదు. జీవితానుభవాల సమాహారం. సింగరేణి బొగ్గుగనుల్లో కార్మికుడిగా చేరి నాయకుడుగా మారిన పరిణామక్రమం. విప్లవోద్యమంతో విడదీయలేని బంధాన్ని పెనవేసుకున్న జీవనమార్గం. నిర్మొహమాటంగా, చూసింది చూసినట్లు, తన అనుభవాలన్నిటి అక్షరరూపం. సింగరేణి చరిత్రపై అనేక అనుభవాలతో అనుబంధంతో సమస్యలు పరిష్కారాల పోరాటాలను చిత్రీకరిస్తూ చాలా పుస్తకాలే వచ్చాయి. దేని ప్రత్యేకత దానిదే. అన్నీ చరిత్రను చాటిచెప్పేవే. హృదయాంతరాళాలను కదిలించేవే. అవన్నీ అతిపెద్ద శ్రామిక, బొగ్గుగనుల ప్రపంచాన్ని అతిదగ్గరగా ప్రజలకు పరిచయం చేశాయి. నిప్పులకొలిమిలా మండిన బొగ్గురవ్వలు కార్మికరంగంలో విప్లవోద్యమ భాగస్వామ్యం, స్నేహ సంబంధాలు, వలస జీవితాలు, నిర్వాసితుల కష్టాలు, ట్రేడ్ యూనియన్ల దివాలాకోరు విధానాలు, వీరుల త్యాగాలు, నిర్బంధాలు, చిత్రహింసలు వీటిమధ్య ఒక కుటుంబంలోని సంబంధాలను మనకు పరిచయం చేస్తాయి. కాలికింది ధూళి ప్రతిఘాతక శక్తుల కంట్లోపడి కలవర పెట్టినటువంటి ఘటనలను, పోరాట రూపాలలో సాగిన ఉద్యమక్రమాన్ని ఈ పుస్తకం మనకు పరిచయం చేస్తుంది.
భూలోకంలో యమలోకంగా వందల మీటర్ల లోతులో, 40-50 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత, రక్షణ కరువై ప్రతీక్షణాన్ని భయంభయంగా లెక్కపెడుతూ జీవితాన్ని గడిపే శ్రామికులే బొగ్గుగని కార్మికులు. సింగరాయపల్లి గ్రామంలో బయటపడ్డ ఈ ఖనిజానికి దశాబ్దాల పోరాటాల పురోగమనచరిత్ర ఉంది. కాంట్రాక్టర్లు, గుండాలు వడ్డీ వ్యాపారులు, లిక్కర్ మాఫియాతో కన్నీటిపాలైన కార్మికుల జీవితాలు అన్నలు నాటిన విత్తనాలతో, తిరుగుబాటుతో పోరుజెండాలై ఎగిరాయి. పొట్టగడవక జమ్మికుంటనుండి మందమర్రికి తండ్రి లింగయ్యతో వలస వచ్చిన కుటుంబంతో రవీందర్ జీవితం ముడిపడుతూ సాగింది. సోదరుడు రఘునాథరావు సింగరేణిలో బదిలీ పిల్లర్గా మొదలై, హెడ్ ఓవర్ మాన్గా, చిన్నన్న రాధాకిషన్ రావు దోస్త్ చున్నుమామ ఇంటికి వస్తూపోతుండడం సింగరేణిని, కార్మికుల కష్టాలను పరిచయం చేసింది. గజ్జల గంగారాం పరిచయం రాడికల్ ప్రయాణంవైపు దారులువేసింది.
అదే సింగరేణిలో కార్మికుడుగా చేరిన తర్వాత భూస్వామ్య తొత్తు ట్రేడ్ యూనియన్ల, గుండాల దాడుల, మోసాలకు వ్యతిరేకంగా ప్రారంభమైన ఉద్యమంలో భాగస్వామిని చేసింది. ఒక వ్యక్తి జీవితాన్ని స్నేహబంధం ఎలా మారుస్తుందో తెలియజేసింది. నిబద్ధతగల జీవితం, కార్మికవర్గ దృక్పథానికి బీజాలు నాటింది. క్రమక్రమంగా రహస్య జీవితానికి వెళ్లేలా చేసినా ప్రారంభంలో సంసిద్ధత కొరవడటంతో అండర్ గ్రౌండ్ ప్రయాణం ముందుకు సాగలేదు. ఎర్రటిఎండ, కొలిమిలాంటి బొగ్గుబావిలో పనిచేసి ఇంటికి వచ్చిన వెంటనే ‘‘ఇంత ఫుల్ స్పీడ్లో ఫ్యాన్ వేసుకుని పడుకునే నువ్వు, రేపు పార్టీలోకి అడవికి వెళ్లి ఎలా బతుకుతావురా’’ అంటూ అమ్మ మొగిలమ్మ ప్రశ్న. ప్రజల కోసం నిలబడాలంటే అలవర్చుకోవాల్సిన జీవనవిధానాన్ని ‘అమ్మ’ నవలతో ప్రేరణ పొందినట్లుగా అనిపిస్తుంది. సింగరేణిని కుదిపేసిన 56రోజుల చారిత్రకసమ్మె జరగడం, అదేసమయంలో ఇంద్రవెల్లిలో గిరిజనులు చిందించిన రక్తం సాక్షిగా సి.కా.స. పురుడు పోసుకుంది. చనిపోయే ఆఖరిక్షణం వరకు ధైర్యం నూరిపోసిన గంగారాం అమరత్వం వీరుల త్యాగాల గొప్పతనాన్ని ఎలుగెత్తి చాటుతుంది. రైతాంగ ఉద్యమంతో మమేకమై పనిచేస్తున్న మేన మరదలు సరళను ఆదర్శవివాహం చేసుకొని దుర్భరజీవితాన్ని గడుపుతూ కూడా బాధపడకుండా పోరుబాటకు మళ్లాలనే ప్రయత్నానికి అనేక ఆటంకాలు ఏర్పడ్డాయి.
ఉద్యమ క్రమంలో అరెస్టు, పోలీస్ లాకప్లో తీవ్ర చిత్రహింసలు, ఆశ్రయం దొరకక సహచరి పడ్డ ఇబ్బందులు ఈ పుస్తకంలో నమోదు చేయబడ్డాయి. ఇవన్నీ రికార్డు చేసిన విధానం ‘‘జూలియస్ ప్యూజిక్’’ రక్తాక్షరాల్ణను గుర్తుచేస్తుంది. జైలుపరిస్థితులు, ఖైదీల మానసికస్థితిని జైలుసెక్రటరీగా నిలబడి, నమోదు చేశారు. జైలు మాన్యువల్, రాజకీయశిక్షణ తరగతులు, క్రమశిక్షణను, మానసికంగా దృఢంగా ఉద్యమం వైపు నిలబడేటట్టు చేశాయి. ‘మేరీటేలర్’ రాసిన ‘‘భారతదేశంలో నా జైలు జీవితం’’ నవలాంశాలకు వాస్తవ దర్శనమిస్తుంది. పెద్దన్నయ్య రఘునాథరావు ప్రేరణ, చిన్నన్న రాధా కిషన్రావు తోడ్పాటు, అమ్మవేసిన ప్రశ్నలు అందించిన చైతన్యపుమాటలు, సహచరి సరళ పూర్తి సహకారం ‘‘నా కుటుంబం’’ నవలను గుర్తుకు తెస్తుంది. నల్లా ఆదిరెడ్డి, మల్లోజుల కోటేశ్వరరావు, పెద్ది శంకర్, కటుకం సుదర్శన్, పులి మధునయ్య, కట్ల మల్లేష్, మేరుగు సత్యనారాయణ, విమల్ వంటి వారినుండి పొందిన ప్రేరణ, సహచర్యం విప్లవోద్యమాన్ని దగ్గరగా పరిచయం చేయడంతో పాటు, కొంత భాగస్వామ్యం ఏర్పడేలా తోడ్పాటునందిస్తాయి.
జైలులో ‘కొడుకులు-కూతుళ్లు’, ‘ప్రజలమనిషి’ లాంటి నవలలు నిర్భంధకాలంలో చైతన్యాన్ని రగిలిస్తాయి.‘ఉక్కుపాదం’ నవలలో చూపినట్లుగా, ఎమర్జెన్సీకాలంలో నాటి కార్మికోద్యమంపైన, విప్లవోద్యమంపైన ప్రభుత్వం చేసిన దాడిని, ప్రజల్లో కలిగించిన ఆందోళనను కళ్లకు కనిపించినట్టు చూపుతాయి. ఇదంతా బొలీవియా నవల ‘మా కథ’లా సాగిపోతుంది. అనేక నవలల్లో ఉన్నటువంటి ఘటనలను, ప్రేరణలను స్పర్శిస్తూ వచ్చిందే బొగ్గురవ్వలు. ఈ నవల చదువుతుంటే ఆ కాలంలో మనం ఉన్నట్లు తోస్తుంది. నవలా రచయిత గురిజాల రవీందర్ ఉత్తర తెలంగాణలో విస్తరించి ఉన్న అతిపెద్ద సింగరేణి గనుల కార్మికశక్తిని మనచేయి పట్టుకుని నడిపించినట్టు అనిపిస్తుంది. వేలాదిమందికి ఉపాధి కల్పించిన బొగ్గుబావులు అదృశ్యం అయిపోతున్న కాలం ఇది. ఓపెన్ కాస్ట్ మైనింగ్తో, వ్యవసాయ భూములు బొందలగడ్డలుగా మారుతున్నాయి. ఉపాధి అవకాశాలు రోజురోజుకు సన్నగిల్లుతున్నాయి. సింగరేణి కార్మికచరిత్ర, యాంత్రీకరణ విధానాలతో, సింగరేణి కార్మికుల జీవితాలు మారుతున్న క్రమంలో బొగ్గురవ్వలు ఇచ్చే ప్రేరణ విప్లవ కార్మికోద్యమంతో విడదీయరాని బంధాన్ని ఏర్పరుస్తుంది. ఉద్యమనిర్మాణ చారిత్రిక అవసరానికి పాదులు వేస్తుంది. బొగ్గురవ్వలు పుస్తకం చదువుతుంటే ప్రపంచ విప్లవసాహిత్యంలో వెలువడ్డ పలు పుస్తకాలు, సమాహారంలా గుర్తుకు వస్తాయి.
(‘బొగ్గు రవ్వలు’ సింగరేణి కార్మిక సమాఖ్య ప్రధాన కార్యదర్శిగా, తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన గురజాల రవీందర్ వ్రాసిన పుస్తకం)
-రమణాచారి