– పదేళ్ల బిఆర్ఎస్, రెండేళ్ల కాంగ్రెస్తో ఒరిగింది శూన్యం
– మజ్లిస్ కనుసన్నల్లోనే రెండు పాలన
– మద్యం ఆదాయం.. భూముల అమ్మకం.. ఇదే పాలసీనా
– రేంవత్ సర్కార్పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఘాటు విమర్శలు
హైదరాబాద్,ప్రజాతంత్ర,ఫిబ్రవరి 5ః తెలంగాణను రక్షించుకోవాలంటే బీజేపీకి ఓటు వేయాలని ప్రజలకు కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి సూచించారు. 12 ఏళ్లుగా బానిస ప్రభుత్వాలు నడుస్తున్నాయని విమర్శించారు. మజ్లిస్ కనుసన్నల్లో బీఆర్ఎస్ పదేళ్లు బానిస పాలన చేస్తే.. కాంగ్రెస్ పార్టీ సైతం మజ్లిస్ ఓట్ల కోసం బానిస పాలన చేస్తుందంటూ మండిపడ్డారు. హైదరాబాద్లో గురువారం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ భూములను విక్రయించడం అభివృద్దా అంటూ ఈ పార్టీల నేతలను సూటిగా ప్రశ్నించారు. మద్యం, డ్రగ్స్తో కుటుంబాలు పతనం అవుతున్నా ఈ ప్రభుత్వానికి కావాల్సింది మాత్రం ఆర్థిక వనరులేనని కేంద్ర మంత్రి అన్నారు. భూములు అమ్మాలి.. అప్పులు చేయాలనేది కాంగ్రెస్ ప్రభుత్వ ఆలోచన అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు ధనిక రాష్ట్రాన్ని అప్పులపాలు చేశాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రజా ప్రభుత్వం కాదు.. అవినీతి, దోపిడి ప్రభుత్వమని అభివర్ణించారు. వీధి దీపాలు వెలిగించేందుకు డబ్బులు లేని దౌర్భాగ్య స్థితిలో ఈ ప్రభుత్వం ఉందని వ్యంగ్యంగా అన్నారు. పని చేసే పార్టీలకే ఓటు వేయాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిస్తున్నారంటూ ప్రభుత్వ ఉద్యోగులకు ఐదు డీఏలు పెండింగ్లోనే ఉన్నాయంటూ కిషన్ రెడ్డి గుర్తుచేశారు. ఇది ప్రజా ప్రభుత్వమా.. పని చేసే ప్రభుత్వమా? సమాధానం చెప్పాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. పని చేసే ఏకైక పార్టీ బీజేపీ మాత్రమేనని గుర్తు చేశారు. పొరుగునున్న ఆంధ్రప్రదేశ్లో అనేక విమానాశ్రయాలు ఉన్నాయని.. తెలంగాణలో ఎందుకు లేవని ఆయన రేవంత్ ప్రభుత్వాన్ని నిలదీశారు. గత పదేళ్లు ఏ చేశారంటూ బీఆర్ఎస్ నేతలను సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రం.. కాంగ్రెస్ పార్టీకి బంగారు బాతు అయిందన్నారు. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఇక్కడి నుంచే నగదు పంపుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వ ఉద్యోగుల బెనిఫిట్స్ మాత్రం ఇవ్వరన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్లకు ఓటు అడిగే హక్కు లేదన్నారు. ఆర్ఆర్ ట్యాక్స్తో వ్యాపారస్తులు భయపడుతున్నారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మున్సిపాలిటీలకు ఎంత నగదు ఇచ్చారో సీఎం రేవంత్ రెడ్డి చెప్పాలని ప్రశ్నించారు. ఫిక్స్డ్ రేట్స్.. వన్ టైమ్ పేమెంట్ను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పక్కాగా కొనసాగిస్తున్నదని విమర్శించారు. గత 26 నెలల్లో ఏ చేసిందో చెప్పాలంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆయన సూటిగా ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఇంటి అల్లుడి ఫోన్ ట్యాపింగ్ చేసిన దౌర్భాగ్య పరిస్థితి నెలకొందన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏం పీకారని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత భాషలో అడుగుతున్నానన్నారు. బీఆర్ఎస్ తరఫున గెలిచిన జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గుర్తు చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




