ఛత్తీస్గఢ్ మాజీ మంత్రికి మంత్రి సీతక్క పరామర్శ
హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 2: ఛత్తీస్గఢ్ రాజధాని రాయపురలో జైలులో ఉన్న ఆ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మాజీ మంత్రి లఖ్మాను తెలంగాణ మహిళా శిశు సంక్షేమ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ధనసరి అనసూయ సీతక్క పరామర్శించారు. ఆయన కుటుంబ సభ్యులకు, అనుచరులకు సంఫీుభావం తెలిపారు. అనంతరం స్థానిక మీడియాతో మంత్రి సీతక్క మాట్లాడుతూ మాజీ మంత్రి, ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆదివాసీల అగ్ర నేత కవాసీ లఖ్మాని అకారణంగా అరెస్టు చేశారన్నారు. రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే ఆయనను బీజేపీ ప్రభుత్వం వేధిస్తోందని, నిరాధారమైన కేసులు పెట్టి వేధింపులకు గురిచేస్తున్నదని ఆరోపించారు. ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండానే తప్పుడు కేసులతో ఆరు నెలలుగా జైలులో పెట్టారంటూ బస్తర్లో ఆదివాసీల గొంతుకగా ఉన్న లఖ్మా అక్రమ అరెస్టును ఖండిస్తున్నామని సీతక్క అన్నారు. ఆపరేషన్ కగార్ పేరిట ఆదివాసీలను వారి స్వస్థలాల నుంచి బీజేపీ ప్రభుత్వం బలవంతంగా తరిమివేస్తోందని, ఆదివాసీల అణచివేతలో బాగంగానే లఖ్మాపై తప్పుడు కేసులు నమోదు చేశారని పేర్కొన్నారు. కవాసీ లఖ్మా కుటుంబానికి కాంగ్రెస్ అండగా నిలుస్తుందని, ఆయనకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పక్షాన పోరాటం కొనసాగుతుందని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. మంత్రి వెంట ట్రైకార్ చైర్మన్, ఆదివాసీ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు బెల్లయ్య నాయక్, ఇతర నేతలు ఉన్నారు.


