– అనుకున్న దానికి మించి ప్రజలకు మేలు
– విూడియాతో ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్
న్యూదిల్లీ, అక్టోబర్ 18: ఎన్డీయే ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త జీఎస్టీ సంస్కరణల వల్ల దేశంలో కొనుగోళ్లు పెరుగుతున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. తాము అనుకున్న దానికన్నా ఎక్కువగానే ప్రజలకు మేలు జరుగుతోందన్నారు. దసరా సమయంలో ప్రజలు రికార్డు స్థాయిలో చేసిన కొనుగోళ్ల ద్వారా సంస్కరణల ప్రభావం కనిపిస్తోందని చెప్పారు. జీఎస్టీ సంస్కరణలపై నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, అశ్వినీ వైష్ణవ్ కూడా పాల్గొన్నారు. అనంతరం విూడియా సమావేశంలో నిర్మల మాట్లాడుతూ జీఎస్టీ 2.0 ద్వారా ప్రజలు ఊహించిన దానికంటే ఎక్కువ పన్ను తగ్గింపులు చేపట్టామని, అందువల్లే వినియోగదారులు ఆశించిన దానికంటే ఎక్కువ ప్రయోజనాలను పొందుతున్నారంటూ దేశమంతా పండగ వాతావరణం నెలకొందని ఆనందం వ్యక్తం చేశారు. ఈ సంస్కరణలు దేశ ప్రజలకు ప్రధాని మోదీ ఇచ్చిన దీపావళి కానుక అని పీయూష్ గోయల్ అన్నారు. జీఎస్టీ డబుల్ ధమాకాతో మోదీ దేశ ప్రజల ఇంటికి లక్ష్మీదేవిని తీసుకొచ్చారన్నారు. జీఎస్టీ సంస్కరణలు అన్ని రంగాల్లో ఉత్సాహాన్ని తీసుకొచ్చాయని, వీటితో దేశంలోని అన్ని రంగాలు లాభపడతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. అశ్వినీ వైష్ణవ్ మాట్లాడుతూ జీఎస్టీ సంస్కరణ సమయంలో దేశంలో వినియోగం, డిమాండ్ ఎలా పెరుగుతుందనే దాని గురించి అనేక అంచనాలు రూపొందించినట్లు తెలిపారు. ఈ సంస్కరణల కారణంగా దేశంలో వినియోగం పెరుగుతోందని, ఈ ఏడాది దాదాపు రూ.20 లక్షల కోట్ల అదనపు వినియోగం జరిగే అవకాశం ఉందని అన్నారు. అమెరికాకు స్మార్ట్ఫోన్లను ఎగుమతి చేయడంలో భారత్ తన పొరుగు దేశాన్ని అధిగమించిందని చైనానుద్దేశించి వ్యాఖ్యానించారు. ఇది దేశం సాధించిన అతిపెద్ద విజయమన్నారు. స్మార్ట్ఫోన్లు తయారు చేసే పలు అతిపెద్ద కంపెనీలు వాటి తయారీలో దాదాపు 20శాతాన్ని భారత్లోనే చేపడుతున్నాయని పేర్కొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.


