– కనిపించకుండా పోయిన కశ్మీర్ డాక్టర్
– డాక్టర్ నిసార్ ఉల్ హసన్ కోసం ముమ్మర గాలింపు
న్యూదిల్లీ, నవంబర్ 12: దిల్లీ పేలుళ్ల అనంతరం ఓ కశ్మీరీ డాక్టర్ కనిపించకుండా పోవడం ప్రస్తుతం కలకలం రేపుతోంది. జాతి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు డాక్టర్ నిసార్ ఉల్ హసన్ను 2023లో జమ్మూకశ్మీర్ ప్రభుత్వం డిస్మిస్ చేసింది. అయితే దిల్లీ పేలుళ్ల ఘటన తరువాత అతడూ కనిపించకుండా పోవడంతో దర్యాప్తు సంస్థలు అప్రమత్తమయ్యాయి. జాతీయ మీడియా కథనాల ప్రకారం.. శ్రీనగర్లోని ఎస్ఎమ్హెచ్ఎస్ హాస్పిటల్తిలో హసన్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేశాడు. అయితే హర్యానాలోని ఫరీదాబాద్ కేంద్రంగా పన్నిన ఉగ్ర కుట్రతో డా. హసన్కు కూడా సంబంధం ఉన్నట్టు వెలుగులోకి వొచ్చింది. ఫరీదాబాద్లోని అల్ ఫలాహ్ యూనివర్సిటీలో పనిచేస్తున్న కొందరు డాక్టర్లు ఈ ఉగ్రకుట్రకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో డా. హసన్ కూడా అదృశ్యం కావడంతో దర్యాప్తు ఏజెన్సీలు అప్రమత్తమయ్యాయి. ఇక ఉగ్ర కుట్ర కేసులో తాము పూర్తిగా సహకరిస్తున్నట్టు అల్ ఫలాహ్ యూనివర్సిటీ ఓ ప్రకటనలో తెలిపింది. దిల్లీ పేలుళ్లకు వాడిన కారును డా. ఉమర్ ఉన్ నబీ నడిపినట్టు ఇప్పటికే తేలింది. ఈ పేలుడులో అతడు కూడా మృతి చెందాడు. అయితే, అతడి పేరిట మరో కారు కూడా రిజిస్టర్ అయి ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. దిల్లీ పేలుళ్ల కోసం ఈ కారును కూడా వాడినట్టు అనుమానాలు ఉన్నాయి. నకిలీ అడ్రస్తో 2017లో ఈ కారు రిజిస్టేష్రన్ జరిగినట్టు పోలీసులు గుర్తించారు. దిల్లీ పేలుళ్ల వెనుక డాక్టర్ల నెట్వర్క్ ఉందని ఇప్పటికే బయటపడింది. ఈ నెట్వర్క్లో 9 లేదా 10 మంది ఉండొచ్చన్న అనుమానాలు ఉన్నాయి.ఎర్రకోట పేలుడు ఘటన తర్వాత హరియాణాలో ఫరీదాబాద్లోని అల్-ఫలాహ్ యూనివర్సిటీ వార్తల్లో నిలిచింది. ఇప్పుడు ఆ విద్యాసంస్థకు చెందిన ప్రొఫెసర్ డాక్టర్ నిసార్ ఉల్ హసన్ కనిపించకుండా పోయాడు. గతంలో అతడిపై ఉగ్ర ఆరోపణలు ఉండటం గమనార్హం. దిల్లీ పేలుడు తర్వాత అల్-ఫలాహ్ యూనివర్సిటీలో దర్యాప్తు అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. పలువురిని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ విద్యాసంస్థలో నిసార్ పనిచేస్తున్నట్లు గుర్తించారని తెలుస్తోంది. 2023లో అతడిని ఉద్యోగం నుంచి తొలగించారు. అప్పుడు అతడు కశ్మీర్లోని ఎస్ఎంహెచ్ఎస్ ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేసేవాడు. ఉగ్రముఠాలతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో ఉద్యోగం నుంచి తీసేశారు. భద్రతకు సంబంధించిన కేసుల్లో శాఖాపరమైన విచారణ లేకుండానే సదరు ఉద్యోగిని విధుల నుంచి తప్పించేందుకు ప్రభుత్వానికి వీలు ఉంటుంది. ఆ తర్వాత అతడికి యూనివర్సిటీలో మెడిసిన్ విభాగంలో ప్రొఫెసర్గా ఉద్యోగం లభించినట్లు జాతీయ డియా కథనాలు పేర్కొన్నాయి. ఎర్రకోట పేలుడు తర్వాత అతడు కనిపించకుండా పోయాడని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం అతడి జాడ కోసం గాలిస్తున్నారు. ఇదిలా ఉంటే.. అల్-ఫలాహ్ విశ్వవిద్యాలయం చుట్టూ వినిపిస్తోన్న కథనాల వేళ ఆ విద్యాసంస్థ స్పందించింది. ‘మా సంస్థలో విద్యనభ్యసించి, పట్టభద్రులైన వారు భారత్, విదేశాల్లో ప్రముఖ ఆసుపత్రులు, సంస్థల్లో బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నారు. ప్రస్తుతం జరుగుతోన్న దురదృష్టకర పరిణామాలు మమ్మల్ని బాధించాయి. వాటిని మేం ఖండిస్తున్నాం. యూనివర్సిటీ ప్రతిష్టను దెబ్బతీసేలా కొన్ని ఆన్లైన్ సంస్థలు నిరాధార కథనాలు వ్యాప్తి చేయడంపై ఆందోళన చెందుతున్నాం అని ఒక ప్రకటనలో పేర్కొంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





