ద్రావిడ సాహిత్యోద్యమ చరిత్ర విస్తృతమైనది. కేవలం ద్రవిడ భాషల ఉమ్మడితనం గురించే కాదు, నాలుగు రాష్ట్రాల ప్రాంతీయ అస్తిత్వం గురించి, మరీ ముఖ్యంగా ఈ నాలుగు ప్రధాన భాషలతో పాటు ద్రావిడ మైనర్ భాషలు- తుళు, కొడగు, తొడ, కోట, బడగ, ఇరుళ, కురుంబ; అలాగే మధ్య ద్రావిడ మైనర్ భాషలు–గోండి, కొలామి, పార్జి, పెంగో, ఓల్లారి, కొండ / కువి, కొందేకోర్ గడబ భాషల రక్షణ గురించి ఈ ఉద్యమం మాట్లాడుతుంది, మాట్లాడాలి. ఒరిస్సా, ఉత్తరాంధ్ర బోర్డర్ ప్రాంతంలో నివసించే రెల్లివారు అనర్గళంగా తెలుగు మాట్లాడగలిగినా రెల్లి వాళ్ళ మాతృభాష.
కానీ అది పూర్తిగా దక్షిణభాష అని చెప్పలేకపోయినా లిపికి ఇటు ఆంధ్రవారు తెలుగును అటు ఒరిస్సా వారు ఒరియాను వాడుతున్నారు. ఇటీవలే రెల్లి– తెలుగు నిఘంటువు కూడా వచ్చింది. ఇటువంటి భాషలపై చర్చను ఆహ్వానించేదే ద్రావిడ సాహిత్యోద్యమం అని నమ్ముతున్నాను. ఈ ఉద్యమం పుట్టింది తమిళనాడులో అయినా ఇప్పుడు యావత్తు దక్షిణ భారతదేశం ద్రావిడతత్వం వైపు ఒక ఆర్యేతర సమానత్వం కోసం, సమాధానం కోసం చూస్తోంది.అసలు ఈ ఉద్యమ ఉద్దేశం మొదలుపెట్టడమే ‘ప్రపంచంలోని భాషలన్నిటికీ సంస్కృతమే మూలభాష, అమ్మభాష’ అనే వాదనను శాస్త్రీయంగా తిప్పికొడుతుంది అనిపిస్తుంది.





