తేమ శాతం 20 ఉన్నా పత్తి కొనుగోలు చేయాలి

– కేంద్రానికి వ్యవసాయ మంత్రి తుమ్మల విజ్ఞప్తి
– పత్తి కొనుగోళ్లు ప్రారంభించిన సీసీఐ.. 1623 మెట్రిక్‌ టన్నులు కొనుగోలు
– ‘రైతు నేస్తం’లో రైతుల సందేహాలు నివృత్తి చేసిన మంత్రి
– మొంథా తుఫాన్‌తో పత్తి రైతులు అప్రమత్తంగా ఉండాలి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 28: మొంథా తుఫాన్‌ కారణంగా పత్తి రైతులు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులకు విజ్ఞప్తి చేశారు. సచివాలయంలో మంగళవారం రైతు నేస్తం కార్యక్రమంలో ఖమ్మం, మంచిర్యాల, కామారెడ్డి, నల్గొండ, వరంగల్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌ జిల్లాల రైతులతో మంత్రి తుమ్మల మాట్లాడి వారి సందేహాలు నివృత్తి చేశారు. తుఫాన్‌ ప్రభావంతో చేతికందిన పత్తి తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, తేమ శాతం 12 శాతం మించకుండా చూసుకోవాలని సూచించారు. లేకుంటే ధర రాక నష్టపోతారన్నారు. మారిన వాతావరణ పరిస్థితులు దృష్ట్యా తేమ శాతం 20 వరకు ఉన్నప్పటకీ పత్తి కొనుగోళ్లు జరపాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. ఈ సీజన్‌ పత్తి కొనుగోళ్లు సీసీఐ ప్రారంభించిందని, సోమవారం రాష్ట్రవ్యాప్తంగా 72 జిన్నింగ్‌ మిల్లుల్లో ప్రారంభించగా 784 మంది రైతులకు చెందిన 1623 క్వింటాళ్ల పత్తి తొలిరోజు కొనుగోలు చేశారుని తెలిపారు. పత్తి కొనుగోళ్లకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 318 జిన్నింగ్‌ మిల్లులు నోటిఫై చేసినట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 45 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయగా 28 లక్షల మెట్రిక్‌ టన్నుల పత్తి దిగుబడి వస్తుందని అంచనాలున్నాయన్నారు. ఈ ఏడాది అధిక వర్షాల కారణంగా పత్తి దిగుబడులు తగ్గడం, ప్రస్తుతం మారిన వాతావరణ పరిస్థితులు దృష్ట్యా తేమ శాతం విషయంలో 12 శాతం పైగా ఉన్న పత్తిని కూడా కేంద్ర ప్రభుత్వం కొనుగోళ్లు జరపాలని కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ చౌహాన్‌కు మంత్రి తుమ్మల లేఖ రాశారు. పత్తి రైతులు కపాస్‌ కిసాన్‌ యాప్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకునేందుకు ప్రభుత్వం నియమించిన ప్రత్యేక అధికారిక బృందాలు జిల్లాల్లో పర్యటిస్తాయని, ఏఈవోలు, మార్కెట్‌ సెక్రటరీలు, జిల్లా మార్కెటింగ్‌ అధికారులు రైతులకు అందుబాటులో ఉంటారని, రైతులు యాప్‌లో నమోదు చేసుకుంటే పత్తి అమ్ముకోవడంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవని తెలిపారు.

టోల్‌ ఫ్రీ నెంబర్‌ ఏర్పాటు

పత్తి రైతులకు ఎలాంటి సమస్యలు తలెత్తినా వారి సౌకర్యార్థం టోల్‌ ఫ్రీ నెంబర్‌ 1800 599 5779కి కాల్‌ చేయొచ్చని మంత్రి తుమ్మల ప్రకటించారు. పత్తి రైతులు ప్రభుత్వ మద్దతు ధరకు అమ్ముకునేలా ప్రజా ప్రభుత్వంలో అన్ని చర్యలు తీసుకున్నామని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా పత్తి రైతులు పత్తి అమ్ముకునేలా సీసీఐ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఏర్పాట్లు చేసినట్లు మంత్రి తుమ్మల వెల్లడిరచారు.

రేపటి నుంచి సోయాబీన్‌ కొనుగోళ్లు

బుధవారం నుంచి సోయాబీన్‌ కొనుగోళ్లు చేపట్టనున్నట్లు మంత్రి తుమ్మల వెల్లడిరచారు. ప్రైస్‌ సపోర్ట్‌ స్కీమ్‌లో మొక్కజొన్న, జొన్నలు చేర్చాలని, సోయాపై ఉన్న పరిమితులు ఎత్తి వేయాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్లు మంత్రి తుమ్మల తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *