మహిళలకు పెన్షన్ల పెంపుపై ఎమ్మెల్సీ కవిత పోస్టుకార్డు ఉద్యమం
హైదరాబాద్,జూన్25 (ప్రజాతంత్ర): మాజీ సీఎం కేసీఆర్ దమ్ము గురించి మాట్లాడే అర్హత సీఎం రేవంత్రెడ్డికి లేదని, ఆయన దమ్మేంటో కాంగ్రెస్ పెద్దలకు తెలుసునని ఎమ్మెల్సీ కవిత అన్నారు. మహిళలకు రూ.2500 పెన్షన్ల మొత్తం పెంపుపై ఆమె పోస్టు కార్డు ఉద్యమం చేపట్టారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ ఆరు గ్యారెంటీల అమలు, మహిళలకు కాంగ్రెస్ పార్టీ చేసిన మోసంపై అసెంబ్లీలోనే చర్చిద్దామన్నారు. ‘రేవంత్ రెడ్డి చంద్రబాబును పిలిచి హైదరాబాద్ బిర్యాని పెట్టి గోదావరి నీళ్లను గిఫ్ట్గా ఇచ్చారు.. 2016లో పోలవరం, బనకచర్ల అంశమే లేదు.. రేవంత్ రెడ్డికి అబద్దాలు ఆడడం అలవాటైంది. గ్యారెంటీలు అమలు చేయకుండా ప్రజల దృష్టిని మళ్లించడం సరికాదు.. అసెంబ్లీ పెడదాం.. ఆరు గ్యారెంటీల అమలు, మహిళలను మోసం చేసినదానిపై చర్చిద్దాం‘ అని కవిత. సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి హుందాగా వ్యవహరించాలి. కేసీఆర్ కలలో కూడా తెలంగాణకు నష్టం చేయరు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించకుండా ఎన్నికలకు వెళ్తే కాంగ్రెస్ పార్టీని ప్రజలు క్షమించరు అని కవిత పేర్కొన్నారు. వపబ నేతృత్వంలో సోనియా గాంధీకి వేలాది పోస్టు కార్డులు రాశారు. అబిడ్స్ జీపీవోలో ఎమ్మెల్సీ కవిత, జాగృతి కార్యకర్తలు పోస్ట్ కార్డులను పోస్ట్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు పూర్తయినా ఇచ్చిన హామీలు అమలు చేయలేదన్నారు. వృద్ధులకు రూ.2 వేల పెన్షన్ను రూ.4 వేలు చేస్తామన్న హామీని విస్మరించింది. వికలాంగుల పెన్షన్ను రూ.4 వేల నుంచి రూ.6 వేలకు పెంచకుండా మోసం చేసింది. మహిళలకు నెలకు రూ.2500 ఇస్తామన్న హామీ ఏమైంది అని ఆ కార్డుల్లో ప్రశ్నించారు. గ్యారెంటీలపై సోనియాగాంధీ సంకతం పెట్టిన గ్యారెంటీ కార్డులను ఇంటింటికి పంచారు. సోనియాగాంధీ ముఖం చూసి ఓట్లేసనందుకే సోనియా గాంధీకి వేలాది పోస్టు కార్డులు పంపించామని, పెన్షన్ల మొత్తాన్ని పెంచాలని రేవంత్ రెడ్డికి ఆదేశాలివ్వాలని ఆమెను కోరామని కవిత పేర్కొన్నారు.



