కేంద్ర ప్రభుత్వం ప్రజాగ్రహానికి గురికాక తప్పదు
మావోయిస్టులతో కేంద్రం చర్చలు జరపాలి
ఎమ్మెల్సీ మధుసూదనాచారి
అణచివేతతో ఉద్యమం ఆగదు : పౌరహక్కుల సంఘం
అమరుల త్యాగం వృథా కాదు : నిర్బంధ వేదిక నాయకుడు రవిచందర్
అణచివేత ఉన్నంతకాలం ఉద్యమం ఆగదు: పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు లక్ష్మణ్
గాజర్ల రవికి ఘనంగా నివాళులర్పించిన ప్రముఖులు
జోహార్లతో మార్మోగిన వెలిశాల
జయశంకర్ భూపాలపల్లి, ప్రజాతంత్ర, జూన్ 28: సమాజంలోని అణగారిన వర్గాల తరఫున ప్రశ్నించే గొంతుక మూగబోయిందని, ప్రజాస్వామ్యంలో ప్రజల గొంతును అంతం చేయాలనే ప్రభుత్వాలు.. ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని ఎమ్మెల్సీ, శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి అన్నారు. మారేడుమిల్లి ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, ఏఓబి స్పెషల్ జోనల్ కార్యదర్శి గాజర్ల రవి అలియాస్ గణేష్ ఉదయ్ సంస్మరణ సభను భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెలిశాలలో శనివారం నిర్వహించారు. భారీ సంఖ్యలో తరలివచ్చిన అభిమానులు, సానుభూతిపరులు, ప్రజలు గణేష్ కు జోహార్ అటూ నివాళులర్పించారు. ఈ సందర్భంగా మధుసూదనాచారి మాట్లాడుతూ మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. గాజర్ల కుటుంబంలో ఉద్యమ నాయకులు ప్రజల స్వేచ్ఛ కోసం పోరాటం చేశారని కొనియాడారు. గాజర్ల రవి వేల మంది గుండెల్లో గుడి కట్టుకుని ప్రజల సానుభూతిని సంపాదించాడని తెలిపారు .సమాజంలో మారణ హోమం పాల్పడితే ప్రజా గొంతుకలు వెలిగెత్తి చాటుతాయని, ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి ప్రభుత్వాలు పనిచేయాలని అన్నారు.
కేంద్రం ఎందుకు స్పందించడం లేదు
బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ప్రజా, పౌర హక్కుల, విప్లవ సంఘాలు మావోయిస్టుతో చర్చలు జరపాలని చెబుతున్నా కేంద్ర ప్రభుత్వం ఎందుకు చర్చలు జరపడం లేదని ప్రశ్నించారు. అంతరాలు లేని దోపిడీ వ్యవస్థ అవినీతి, కుల, మతతత్వం లేని సమాజం కోసం ఉద్యమకారులు పోరాటం చేస్తున్నారని అన్నారు. ప్రజల కోసం ప్రాణాలర్పించేందుకు పేద అణగారిన ప్రజానీకం కోసం అహర్నిశలు ఉద్యమం చేస్తున్న వారి ప్రాణాలు బలి తీసుకోవడం అమానుషమైన చర్య అని అన్నారు. సమాజంలో పేదలకు విద్యా వైద్యం సమ సమాజ స్థాపన కలిగినప్పుడే సంపద అందరికీ దక్కాలని ఉద్దేశంతో ప్రతి మనిషిని సమానంగా జీవించే హక్కు కల్పించే విధంగా ప్రభుత్వాలు కృషి చేయాలని డిమాండ్ చేశారు. జంతువుల మాదిరిగా వెంటాడి వేటాడి మనుషులను చంపే సంస్కృతి దేశానికి మంచిది కాదని హితువు పలికారు. అమరుల త్యాగం వృథా కాదని నిర్బంధ వేదిక నాయకుడు రవి చందర్ అన్నారు. విప్లవోద్యమంలో అణచివేత మంచిది కాదని, ఉద్యమకారులను శవాలుగా అప్పగించడాన్ని సమ సమాజం వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం విప్లవోద్యమం అయిపోయిందనే భ్రమలో ఉందని వెలిశాల సంస్మరణ సభలో జన వాహిని చూసి ఉద్యమం మరణం లేనిదని అర్థం చేసుకోవాలని సూచించారు .కేంద్ర ప్రభుత్వం ప్రకృతి సహజ సంపదను కార్పొరేట్ వ్యవస్థకు దోచి పెట్టేందుకే నక్సలిజాన్ని అంతమొందించేందుకు కుట్రలు పండుతుందని ఆరోపించారు. లక్షలాదిమంది సాయుధ పోలీసు బలగాలను మోహరించి అన్యాయంగా ఉద్యమకారులపై దాడులు చేసి అమానుషంగా చంపి వేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అణచివేత ఉన్నంతకాలం ఉద్యమం ఆగదని పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. సమాజంలో అణచివేత దోపిడీ, నిర్బంధం ఉన్నంత కాలం ఉద్యమం ఆగదని అన్నారు. సంస్మరణ సభలో అమరుడు గాజర్ల రవి అలియాస్ గణేష్ అలియాస్ ఉదయ్ చిత్రపటానికి శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి ఎమ్మెల్యేలు గండ్ర సత్యనారాయణ రావు, రేవూరి ప్రకాష్ రెడ్డి స్టేట్ క్రెడిట్ కార్పొరేషన్ చైర్మన్ అయి ప్రకాష్ రెడ్డి, బీసీ సంఘాల జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ గద్దర్ కుమారుడు సూర్యం భారత్ బచావో వేదిక నాయకుడు గాదె ఇన్నయ్య బంధుమిత్రుల కమిటీ రాష్ట్ర కార్యదర్శి పద్మ కుమారి, మా భూమి సంధ్య తోపాటు అభిమానులు బంధుమిత్రుల కమిటీ సభ్యులు విరసం పౌర హక్కుల సంఘాల నాయకులు ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు





