– తన జీతభత్యా పేదలకు ఉపయోగించాలని సీఎంకు లేఖ
భువనేశ్వర్, డిసెంబర్ 14: నవీన్ పట్నాయక్.. రాజకీయాల్లో నిజాయతీపరుడెవరంటే ఇట్టే చెప్పవచ్చు. భూతద్దం వేసి వెదికినా ఈయనలాంటివారు కనిపించరంటే అతిశయోక్తి లేదు. ఆయనే ఒడిస్సా మాజీ ముఖ్యమంత్రి.. ఆయన గురించి ఇప్పుడెందుకు గుర్తు చేసుకోవాల్సి వచ్చిందో ఇపుడు చూద్దాం. తనకు వచ్చే జీతభత్యాలు అన్నీ పేదల సంక్షేమం కోసం ఉపయోగించాలని ప్రస్తుత ముఖ్యమంత్రి మోహన్ చరణ్కు ఇటీవల లేఖ రాశారు. అలాగే ప్రతిపక్ష నేతగా లభించే ఆదాయాన్ని కూడా ప్రజల సంక్షేమం కోసం ఉపయోగించాలని ఆ లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్యేల జీతభత్యాలు, మిగతా సౌకర్యాలు అన్నిటినీ భారీగా పెంచేసింది. ఈ చర్య ఈయనకు నచ్చలేదు.. కారణం అవి ఎక్కువ అని ఈయన భావన. అందుకే పేదలకు ఉడతా సాయంగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈయన తండ్రి కూడా ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన పేరు బిజూ పట్నాయక్. వాళ్లది ధనవంతుల కుటుంబం. తండ్రి బిజూపట్నాయక్ ముఖ్యమంత్రిగా పనిచేసి మరణించిన తర్వాత 25 సంవత్సరాలు ఒడిస్సాకు నీవన్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. రాష్ర శాసనసభకు 2024 మే నెలలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయారు. నవీన్ పట్నాయక్ పరిపాలనలో ప్రజలకు మేకప్ వేసి ఏదీ చూపించలేదు. ఉన్నదే స్పష్టం చేశారు, పరిస్థితిని వివరించారు. 2015లో తనకు పూర్వీకుల నుంచి సంక్రమించిన ఆస్తి మొత్తాన్ని దానం చేశారు. ముఖ్యమంత్రి అంటే ఎలా ఉండాలో తన 25 సంవత్సరాల పరిపాలనలో నిరూపించారు. కొండకి వెంట్రుక కట్టి లాగే ప్రయత్నం చేయలేదు. రాష్ట్రానికి వచ్చే వనరులతోనే 25 సంవత్సరాలు పరిపాలించారు. ఇలాంటివారిని కూడా ఓడించేస్తున్నారు ఏం చేద్దాం?!
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





