– మరోమారు షెడ్యూల్ ప్రకటించిన స్పీకర్
– 6నుంచి వరుసగా విచారణలకు సిద్దం
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 4: పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణలో మరో అడుగు పడింది. పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ షెడ్యూల్ ఇచ్చారు. ఈనెల 6 నుంచి విచారించనున్నారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ గుర్తుపై గెలిచిన పదిమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరిన విషయం తెలిసిందే. దీంతో వారిని అనర్హులుగా ప్రకటించాలంటూ బీఆర్ఎస్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీంతో మూడు నెలల్లోగా విచారించి నిర్ణయం వెల్లడించాలని సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం జూలై 31న తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో నలుగురు ఎమ్మెల్యేల విచారణను పూర్తి చేసిన స్పీకర్ తాజాగా ఈ నెల 6 నుంచి మరో నలుగురు ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్ రెడ్డి, అరికెపూడి గాంధీ, తెల్లం వెంకట్రావు, డాక్టర్ సంజయ్ అనర్హతపై విచారణ చేపట్టనున్నారు. నవంబర్ 6న తెల్లం వెంకట్రావ్, సంజయ్ పిటిషన్లను విచారిస్తారు. 7న పోచారం శ్రీనివాస్ రెడ్డి, అరికెపూడి గాంధీని విచారించనున్నారు. 12న తెల్లం వెంకట్రావ్, సంజయ్ పిటిషన్లపై రెండోసారి విచారణ కొనసాగనుంది.. 13న పోచారం, ఆరికెపూడి గాంధీల పిటిషన్లపై మరోసారి విచారణ నిర్వహిస్తారు. కాగా, సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు గత నెల 31న ముగిసిన విషయం తెలిసిందే. దీంతో నాలుగు రోజుల క్రితం ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై విచారణకు మరో రెండు నెలల గడువు ఇవ్వాలని స్పీకర్ కార్యాలయం సుప్రీంకోర్టును కోరింది. నలుగురు ఎమ్మెల్యేల విచారణ మాత్రమే పూర్తయిందని.. అంతర్జాతీయ సదస్సులు ఉండటంతో గడువు సరిపోలేదని దేశ అత్యున్నత న్యాయస్థానానికి తెలిపింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





