బేగంపేట్ టూరిజం ప్లాజాలో గురువారం జరిగిన ప్రీ ఈవెంట్ ప్రెస్ కాన్ఫరెన్స్లో 2024 ప్రపంచ సుందరి క్రిస్టినా పిజ్కోవా పాల్గొని సందడి చేశారు. నమస్తే ఇండియా అంటూ 2024 ప్రపంచ సుందరి క్రిస్టినా పిజ్కోవా పలకరించింది. అతిథులు చాలా గొప్పగా స్వాగతం చెప్పారని అన్నారు. తన ప్రయాణంలో, తన హృదయంలో భారతదేశానికి చాలా ప్రాధాన్యం ఉందని తెలిపారు. భారత కల్చర్, ఆర్టస్ చాలా గొప్పగా ఉంటాయని వివరించారు. భారతదేశం చాలా ఇన్స్పైరింగ్ అని తెలిపారు. భారత్ విలువలను బోధిస్తుందని.. భిన్నత్వంలో ఏకత్వానికి ఎంతో గొప్ప భావన ఉందని చెప్పుకొచ్చారు. ఎన్నో భాషలు ఉన్నా అంత ఒక్కటిగా ఉండడం భారతదేశం స్ఫూర్తి అని తెలిపారు.
మిస్ వరల్డ్ పోటీలు కూడా అంతే భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అని చెప్పారు. యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సందర్శించడం మంచి అనుభూతిని ఇచ్చిందని క్రిస్టినా పిజ్కోవా పేర్కొన్నారు. తెలంగాణ త్రిలింగ దేశంగా ప్రాముఖ్యత కలిగిందని తెలంగాణ పర్యాటకశాఖ కార్యదర్శి స్మితా సభర్వాల్ తెలిపారు. ఈ ప్రాంతానికి 2500 ఏళ్ల చరిత్ర ఉందని ఉద్ఘాటించారు. రాష్ట్రం ఏర్పడిన 11 ఏళ్లలో ఎంతో వృద్ధి సాధించామని చెప్పారు.
రామప్ప, వేయి స్థంభాల ఆలయం, చార్మినార్, గోల్కొండ కోట లాంటి ఎన్నో గొప్ప కట్టడాలు ఇక్కడ ఉన్నాయని అన్నారు. మే నెలలో జరుగనున్న మిస్ వరల్డ్ పోటీ-లను తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా నిర్వహించనున్నామని చెప్పారు. మెడికల్ టూరిజంలో తెలంగాణకు ఎంతో ప్రాముఖ్యత ఉందని అన్నారు. సినిమా, ఆహార రంగాల్లో తెలంగాణకు పెట్టింది పేరని చెప్పారు. అత్యంత సురక్షిత పర్యాటక ప్రాంతం తెలంగాణ అని స్మితా సభర్వాల్ పేర్కొన్నారు.





